నల్లబెల్లి : కాంగ్రెస్ పాలనలో పంటలకు నీళ్లు పెట్టేందుకు రాత్రిపూట ఇంటికాడ చిన్న పిల్లలను వదిలేసి భార్యాభర్తలం చెల్క కాడికి పోయేది. వచ్చీ రాని కరెంట్తో ఒక్కోనాడు దొయ్య పారకపోయేది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే ఏనాడూ పెట్టుబడి మందమైనా పండకపాయె. పండిన కొద్దిపాటి పంటకు నాడు సరైన ధర పెట్టలేదు. అప్పుపై మిత్తికి సరిపోయేది. లోవోల్టేజీతో బాయికాడ మోటర్ ఊకే కాలిపోయేది. మోటర్ అల్లియ్యాలంటే మళ్లోకాడ అప్పు తెచ్చుడే. లేకుంటే ఆయింత పంట పండదు. పంటలకు రోగం వత్తే నేను బావికాడ, నా భర్త మండలం పోయి చెప్పులు లైనుకు పెడితెనే ఒకటో రెండో మందు బత్తాలు దొరికేవి. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇత్తాండు. పగలు పంటకు నీళ్లు కట్టి రాత్రి వేళ ఇంటికాడే ఉంటున్నాం. రంగాయచెర్వుకు గోదావరి నీళ్లు కూడా వచ్చాయి. మా బోరులో సరిపడ నీళ్లు ఎళ్తున్నాయి. ఇప్పుడు నీళ్లకు రందిలేదు. పిండి బత్తాలు అదనుకు దొరుకుతానై. పంట పెట్టుబడి ఇత్తాండు. ఇప్పుడు పంటలు మంచిగా పండుతానై. అప్పులు లేకుండా కట్టుకున్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్సోడు మూడు గంటల కరెంటు ఇత్తానంటాండు. 10 హెచ్పీ మోటర్లు పెడుతానంటాండు. మా ఏరియాలో త్రీ హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లు వాడుతానం. ఈ మోటర్లతో బోరులో ఎల్లే నీళ్లకు ఈ మోటర్లకు సరిపోతున్నయి. కాంగ్రెస్సోడు మూడు గంటల కరెంటు ఇస్తే రైతులందరూ ఒకేసారి మోటర్లు ఆన్ చేస్తే టాన్స్ఫార్మర్ కాలిపోవా? సబ్స్టేషన్లు కాలిపోవా? కేసీఆర్ సార్ ఇచ్చే 24గంటల కరెంట్తో పంటలు మంచిగా పండుతానై, పిల్లలను చదివించుకుంటున్నాం. ఓట్ల కోసం కాంగ్రెస్సోళ్లు మళ్లీ దాపురించారు. వాళ్ల మాయమాటలు నమ్మేందుకు ఉత్తగలేం.
దామెర : కాంగ్రెస్ రైతులను ఆగం చేయాలని చూస్తున్నది. వ్యవసాయానికి కాంగ్రెస్ పార్టీ 3 గంటల కరెంటు ఇస్తే పంటలకు నీరు అందక ఎండిపోతయ్. తెలంగాణ రాక ముందు కూడా ఆ పార్టీ ఇట్లానే చేసింది. అప్పుడు బావులకాడికి పంటలకు నీరు పెట్టేందుకు చిమ్మ చీకట్లో వెళ్లెటోళ్లం. లో కరెంటుతో మోటర్లు కాలిపోయేవి. ఇప్పుడు మళ్లీ అదేతీరుగ ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నరు. వ్యవసాయానికి 3గంటల కరెంటు చాలదు. 10హెచ్పీ విద్యుత్ మోటర్లను కొనుగోలు చేయలేం. అయినా ఇప్పుడు చెరువులు, బావుల నిండా నీరు, సీఎం కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంటు ఉన్నది. రైతులమంతా మళ్లీ కాంగ్రెస్ రావొద్దనే కోరుకుంటున్నం.
హనుమకొండ సబర్బన్ : పాత రోజుల్లో రైతులు ఎలా భూముల విషయాల్లో ఇబ్బందులు పడ్డారో మళ్లీ కౌలుదారు కాలమ్ పెడితే అట్లనే ఇబ్బందులు పడుతరు. ఇప్పుడున్న ధరణితో భూములు భద్రంగా ఉన్నాయని రైతులు నిశ్చింతగా ఎవుసం చేసుకుంటున్నరు. నెలకోసారి వీఆర్వోల దగ్గరకు వెళ్లి భూములు రికార్డుల్లో ఉన్నాయో, మారాయో చూసుకోవడం లేదు. రైతు వెళ్లి సంతకం పెడితే తప్ప రికార్డులు మారడం లేదు. అట్లాంటి ధరణిని తీసేస్తామనడం తెలివి తక్కువ పనే. మన భూములపై కౌలుదారులకు ఏం హక్కు ఉంటది. గట్ల రికార్డుల్లో కౌలుదారు పేరు రాస్తామంటే రైతులు ఎలా ఒప్పుకుంటరు. పాత రోజులు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టాలని చూడొద్దు. రోజులు మారుతుంటే మంచిగ లేని పాత పద్ధతులు మార్చుకొని ముందుకు పోవాలే తప్ప, మల్ల ఎనకటి కాలమ్లు పెడ్తామనడం విడ్డూరంగా ఉంది. రైతులందరు కాంగ్రెసోళ్ల మాటలు గమనించాలి.
సంగెం : భూమి కౌలుకు ఇస్తే రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలనే చట్టం తెస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. రైతులను ఒకరిపై ఒకరు దౌర్జన్యం చేసుకొమ్మని చెప్పడమే దీని అర్థం. రైతు భూమిని రాతపూర్వకంగా కౌలుకు ఇస్తే గొడవలు పడి కోర్టులకు వెళ్లే వరకు వస్తుంది. కౌలు రాసి ఇచ్చినప్పుడు అసలు రైతు భూమి మీద హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇరువురి మధ్య కొట్లాటలతో పాటు చట్టపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అసలు రైతు భూమికి రక్షణ ఉండదు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి అందరికీ శ్రేయస్కరం. దాన్నే కొనసాగించాలి. ధరణితో గంటల్లోనే పట్టా పాస్ పుస్తకం వస్తున్నది.
ఖానాపురం : రైతులకు పారదర్శకంగా సేవలందిస్తున్న ధరణి పోర్టల్ను రద్దు చేసి రెవెన్యూ శాఖలో మళ్లీ పాత కాలం నాటి పటేల్, పట్వారి వ్యవస్థను తీసుకువస్తే దళారీ వ్యవస్థకు ఆజ్యం పోసినట్లు అవుతుంది. ధరణి పోర్టల్ వచ్చిన నాటి నుంచి రైతులకు వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం, విక్రయించడం సులభతరంగా మారింది. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుంటే కేవలం అరగంటలోనే నేరుగా భూమి మన పేరుమీద పట్టా అవుతున్నది. గతంలో భూమి పట్టా చేయించుకోవాలంటే గ్రామంలో ఒక దళారీని కలిసి ముడుపులు ముట్టజెప్పితే తహసీల్దార్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరిగితే, అధికారులు దయతలిస్తే అప్పుడు కాని పట్టా అయ్యేది కాదు. అంతే కాకుండా మన భూములు మనకు తెలియకుండానే ఇతరులకు పట్టా అయ్యేది. సంవత్సరాలు గడిచినా మనకు తెలిసేది కాదు. కాని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో మన వేలిముద్ర లేకుండా మన భూమి ఇతరుల పేరుమీదకు మారడం అసాధ్యం. పాత రెవెన్యూ వ్యవస్థ వస్తే మళ్లీ రైతుల బతుకులు ఆగమాగం అవుతాయి. ఇది చాలా ప్రమాదకరం. రైతులను ముంచేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత రెవెన్యూ విధానం తీసుకొస్తామంటే రైతులు పార్టీని పాతరేయడం ఖాయం. రైతు బతకాలంటే కాంగ్రెస్ను పాతరేయాల్సిందే…
ఆత్మకూరు : సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ఆలోచించి ధరణి పోర్టల్ తీసుకవచ్చి, రైతులకు భద్రత కల్పించారు. నాకు ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థ కాలంలో దొంగ రిజిస్ట్రేషన్లు చేసిండ్రు, రెవెన్యూ రికార్డుల్లో గోల్మాల్ చేస్తూ రైతులను మోసం చేసేవారు. గతంలో ఆఫీసుల చుట్టు రోజుల తరబడి తిరిగినా పనులు కాకపోయేటిది. ధరిణితో రైతులకు పావుగంటలోనే పట్టాదారు పాస్ పుస్తకం వస్తున్నది. నా భూమికి ఒక్కరూపాయి లంచం లేకుండా పాస్ పుస్తకం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ 50 సంవత్సరాల పాలనలో రైతుల గురించి పట్టించుకోలేదు. వాళ్ల మాటలు రైతులు నమ్మితే నట్టేట మునగడం ఖాయం.
పరకాల : 3 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ కరెంటు కష్టాలు మొదలైతయ్. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ గడ్డపై కరెంటు కష్టాలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొంత మంది రాత్రి వేళల్లో మోటర్లతో పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్లతో మృతి చెందారు. అప్పటి రోజులు తలచుకుంటేనే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. మళ్లా తెలంగాణ గడ్డపై ఆ పాత రోజులు రావొద్దు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతు అదే కోరుకుంటాడు. కాంగ్రెస్ నాయకుల మాటలు చూస్తుంటే రాష్టంలో వ్యవసాయంపై ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పూర్తి అవగాహన లేదని అర్థమైతాంది. మళ్లా వారికి ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పయనిపిస్తాంది.
చెన్నారావుపేట: కౌలు దున్నెటోళ్లకు కాగితం రాసిస్తే భూమి ఆగమైనట్టే. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన ధరణితో ఎవరి భూమి వారికి ఉండి రైతులు నిమ్మలంగా ఉన్నరు. ధరణి భూమి రికార్డులను తీసేస్తే ఊర్లల్లో రైతులు, భూములు ఆగమయితయి. మునాబ దున్నెటోళ్లకు రాసిస్తే రెండేండ్లు దున్ని భూమి నాదే అంటరు. గొడవలు పెరిగి దాడి చేసుకుంటరు. అనుభవదారు కింద కౌలు రైతులు పేరు ఎక్కించుకుంటే యజమాని ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఊర్లల్లో రైతులు, కౌలు దున్నెటోళ్లు ఇప్పుడు మంచిగ వ్యవసాయం చేసుకుంటున్నరు. కాగితం రాసియ్యాలంటే ఎవరూ భూములు కౌలుకు ఇయ్యక కౌలు రైతులకు బతుకుదెరువు లేకుండా పోతది. కాంగ్రెసోళ్లు ఇచ్చే రూ.10వేల కోసం కౌలు రైతులకు కాగితం రాస్తే లక్షల విలువైన భూమి పోతది. కొత్త పద్ధతి తీసుకొచ్చి రైతులను ఆగం చేయొద్దు.
ఆత్మకూరు : 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. 3గంటల కరెంటుతో వ్యవసాయం చేయలేం. రైతు బిడ్డగా, రైతుల గురించి అవగాహన కల్గిన సీఎం కేసీఆర్ ఉండడం తెలంగాణ అన్నదాతల అదృష్టం. గతంలో రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే. 10హెచ్పీ మోటర్లను పెట్టుకొని 3 గంటల కరెంటుతో పంటలను పండించలేం. అందరూ ఒకేసారి మోటర్లు వేస్తే ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ ఎక్కువై కాలిపోతాయి. ఇప్పడు 24గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చి రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నడు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నది. వారికి ఓటుతో బుద్ధి చెప్పాలి. వారిని నమ్మితే ఇప్పడిప్పడే కుదుట పడుతున్న అన్నదాతలను మరోసారి మోసం చేస్తారు. గత కాంగ్రెస్ పాలన అనుభవాలను గుర్తు చేసుకోవాలి.
నల్లబెల్లి : అరచేతి బొటన వేలికే నా భూమిపై నాకు హక్కు కల్పించడం అద్భుతం. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ఎవరి భూములకు వారికే హక్కు కల్పించాలనే సీఎం కేసీఆర్ సంకల్పానికి చేతులెత్తి మొక్కుతున్నం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు రెవెన్యూ వ్యవస్థ ద్వారా ఎనిమిదంచెల విధానం అమలు చేయడంతో ఎవరి భూములు ఎవరి పేరున పట్టా అయితాయో తెల్వని దుస్థితి ఉండేది. వీఆర్వో మొదలుకుని తహసీల్దార్ వరకు ఎవరు ఎప్పుడు భూములను రికార్డుల నుంచి మారుస్తారో అర్థం అయ్యేది కాదు. కాస్తులో ఒకరు ఉంటే పట్టా కాలంలో మరొక రైతు పేరు ఉండేది. దీంతో గ్రామాల్లో పలు మార్లు రైతుల మధ్య భూవివాదాలు చోటు చేసుకుని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగినం. అప్పులపాలైనం. నాటి రోజులకు స్వస్తి పలికిన తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్ సార్ దూర దృష్టితో ధరణి పోర్టల్ తీసుకువచ్చి మా భూములపై ఎంజాయ్మెంట్ సర్వే చేయించారు. తర్వాత ఆ భూములను ధరణి పోర్టల్లో నమోదు చేసి పట్టాలను పంపిణి చేసి అరచేతికే అధికారం కల్పించారు. మేము పెద్ద సార్కు రుణపడి ఉంటాం. నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బృహత్తరమైన ధరణిని రద్దు చేసి పటేల్, పట్వారీల కాలం నాటి రెవెన్యూ వ్యవస్థను అమలు చేస్తామంటున్నారు. ఈ వ్యవస్థ వస్తే మా భూములకు భద్రత కరువవుతుంది. ధరణి ద్వారా మా పిల్లలు అమెరికాలో ఉన్నా భూముల సమాచారాన్ని సెల్ఫోన్ (అరచేతి)లో చూసుకుంటున్నారు. పాతకాలపు పద్ధతులు అమలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కేవలం అధికార దాహంతోనే అమలుకు సాధ్యం కాని హామీలను ప్రకటిస్తూ కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ను రద్దు చేస్తామనడం అవివేకం.