‘ప్రాజెక్టులు, నీళ్లు బందోబస్తుగా చేసుకున్నాం. అద్భుతంగా పురోగమిస్తున్న సమయంలో ఈ వడగండ్ల వాన పడింది. మీకు ధైర్యం చెప్పి అండగా నిలబడేందుకు ఎర్రటి ఎండలో మీ వద్దకు వచ్చిన. తెలంగాణ రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో ముందుకే పోవాలె తప్ప వెనక్కి వెళ్లొద్దు. నేను మీకు గతంలో ఎంతో అండగా ఉన్నానో తెలుసు. ఇప్పుడు కూడా అండగా ఉంటా. కేంద్రం సహకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎకరాకు రూ. 10 వేల సాయం అందజేయాలని నిర్ణయించాం. దీన్ని కూడా ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరలో ఇవ్వాలని అధికారులను ఆదేశించాం.’ గురువారం తన పర్యటనలో సీఎం కేసీఆర్ దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామంలో రైతులతో అన్న మాటలివి..
వరంగల్, మార్చి 24(నమస్తేతెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పర్యటన అనంతరం అధికారులు జిల్లాలో పంట నష్టం సర్వేలో వేగవంతం చేశారు. గ్రామాల వారీగా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు. పంటల వారీగా జరిగిన నష్టాన్ని నమోదు చేస్తున్నారు. వారం రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అకాల వర్షం 249 గ్రామాల్లో ప్రభావం చూపినట్లు అధికారులు గుర్తించారు. ఈ గ్రామాల్లో సుమారు 69 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అత్యధికంగా 54 వేల ఎకరాల్లో మక్కజొన్న, 12 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. దాదాపు మూడు వేలకుపైగా ఎకరాల్లో ఉద్యాన పంటలైన మిరప, అరటి, కూరగాయలు, ఇతర పంటలకు నష్టం కలిగిందని తెలిపారు.
ప్రభుత్వ ఆదేశంతో అధికారులు గ్రామం వారీగా పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపేందుకు ప్రణాళిక రూపొందించారు. బుధవారం నుంచి సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం కేసీఆర్ అకాల వర్షంతో జరిగిన పంట నష్టాలను స్వయంగా పరిశీలించేందుకు జిల్లాలో పర్యటించారు. అడవిరంగాపురం గ్రామాన్ని సందర్శించి పంట నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండుటెండలో కలియదిరిగి దెబ్బతిన్న మక్కజొన్న, వరితోపాటు టమాట తదితర పంటలను చూశారు. బాధిత రైతులతో మాట్లాడి అధైర్య పడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంపై రైతులు హర్షం వెలిబుచ్చారు. కృతజ్ఞతగా శుక్రవారం పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
సర్వే బృందాల్లో ఎవరంటే..
గ్రామం వారీగా సమగ్ర సర్వే నిర్వహించేందుకు టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఏఈవో, కార్యదర్శి, వీఆర్ఏ ఉన్నారు. పర్యవేక్షణ కోసం మండలస్థాయి టీంలు పని చేస్తున్నాయి. ఈ టీంలో ఏవో, తహసీల్దార్, ఎంపీవో ఉన్నారు. గ్రామస్థాయి టీంల్లోని అధికారులు ఆయా గ్రామంలో అకాల వర్షం వల్ల నష్టం వాటిల్లిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆయా రైతు సాగు చేసిన పంట విస్తీర్ణం ఎంత?, ఇందులో దెబ్బతిన్న పంట ఎంత?, నష్టం వాటిల్లిన వాటిలో ఏ పంట విస్తీర్ణం ఎంత ఉంది? అనేది, సర్వే నెంబర్, బాధిత రైతు వివరాలను నమోదు చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులు కూడా గ్రామస్థాయి టీంలను కలిసి తమకు జరిగిన పంట నష్టాలపై దరఖాస్తులను అందజేస్తున్నారు. పరిశీలనకు వెళ్లిన సమయంలో గ్రామస్థాయిలోని టీం సభ్యులు దరఖాస్తుదారులకు సమచారం ఇస్తున్నారు. ఈ టీం వచ్చిన సమయంలో బాధిత రైతులు తమ పంట చేను వద్ద ఉండి జరిగిన నష్టాలను వివరిస్తున్నారు.
గ్రామస్థాయిలో జరుగుతున్న పంట నష్టాల సర్వేను మండలస్థాయి బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్, ఏడీఏలు ఈ సర్వేను మానిటరింగ్ చేస్తున్నారు. కలెక్టర్ ప్రావీణ్య ఎప్పటికప్పుడు సర్వే వివరాలను తెలుసుకుంటూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ప్రాథమిక అంచనా నివేదికలో అధికారులు పేర్కొన్న అకాల వర్షం ప్రభావిత గ్రామాలు, నష్టం వాటిల్లిన పంటల విస్తీర్ణం వంటివి ప్రస్తుతం చేపట్టిన సర్వే పూర్తయ్యే వరకూ పెరుగొచ్చు లేదా తగ్గొచ్చని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లోగా పంట నష్టాల సర్వేను పూర్తి చేయాలనే దిశగా ముందుకు వెళ్తున్నట్లు డీఏవో ఉషాదయాళ్ చెప్పారు.