Prakash Raj | జార్ఖండ్లో పోటీ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీలపై విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. రాంచీలో జార్ఖండ్ అసెంబ్లీని ముట్టడించడానికి యత్నించిన జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ (JPSC-JSSC) అభ్యర్థులపై పోలీసులు తీవ్రంగా బలప్రయోగం చేశారు. లాఠీచార్జ్తో పాటు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఈ దారుణ ఘటనపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన ఘాటుగా స్పందించారు.
“ఎందుకు.. ఎందుకు.. ఎందుకు? ఈ పాశవిక అణచివేత ఇకపై ఎప్పటికీ పనిచేయదు.. ఇది కేవలం అహంకారంతో కూడిన ప్రభుత్వాన్ని కిందకు దించుతుంది” అంటూ ప్రకాష్ రాజ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం సాయంత్రం మూడోసారి అసెంబ్లీ వైపు శాంతియుతంగా మార్చ్ నిర్వహించారు. అయినప్పటికీ పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ రిఫార్మ్ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని, డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చిచెప్పారు.
ఇదిలాఉంటే, గత రెండు వారాలుగా అలుపెరగకుండా పోరాడుతున్న జార్ఖండ్ విద్యార్థులకు దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇటీవల ప్రముఖ నటుడు, గేయ రచయిత పియూష్ మిశ్రా నేరుగా నిరసన ప్రాంతాన్ని సందర్శించి అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు. విద్యార్థులు ఎలాంటి హింసకు పాల్పడకుండా, ఒళ్ళు గగుర్పొడిచేలా శాంతియుతంగా నిరసన తెలపడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘గులాల్’ సినిమాలోని తన ప్రసిద్ధ పాట ‘ఆరంభ్ హై ప్రచంద్’ను ఆలపించి విద్యార్థులలో ఉత్సాహం నింపారు. ఆయనతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా కూడా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.