పల్లెలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్మాగాంధీ ఆశయానికనుగుణంగా తెలంగాణ సర్కారు చేపట్టిన ‘పల్లెప్రగతి’ సత్ఫలితాలిస్తున్నది. మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి బాటలు వేసేందుకు సీఎం కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పారిశుధ్యం, హరితహారం, వీధి దీపాల నిర్వహణతో పల్లెలు ప్రగతిపథంలో ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో లండన్కు చెందిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ బృందం జిల్లాలో ఇటీవల పర్యటించి ఐఎస్వో నాణ్యతా ప్రమాణాలపై సర్వే చేసింది. ప్రజలకు మెరుగైన పౌరసేవలందిస్తున్న గ్రామాల్లో దేవరుప్పుల మండలం కడవెండి, పాలకుర్తి మండల కేంద్రం, బచ్చన్నపేట మండలం కొడ్వటూరు, లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామపంచాయతీలను ఎంపిక చేసింది. ఇటీవల ఈ ఐదు జీపీలకు 9001-2005 సర్టిఫికెట్లను అందించడంతో జిల్లా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది.
జనగామ, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : పల్లెల ప్రగతే దేశాభివృద్ధికి సూచిక అన్నారు మహాత్మాగాంధీ. గ్రామసీమల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో తనదైన రీతిలో రూపొందించిన పల్లెప్రగతి ప్రత్యేక కార్యాచరణ ఫలితాలతో ఇప్పుడు పల్లెలు మెరిసిపోతున్నాయి. పల్లెల్లో కనీస వసతులు కల్పించి అభివృద్ధికి బాటలు వేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల బాట పట్టి పచ్చదనాన్ని సంతరించుకునేలా చూడడం, పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడడంతోపాటు స్థానిక సమస్యలను ఎప్పుటికప్పుడు పరిష్కరిస్తున్నారు. దీంతో పల్లెప్రగతి కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నది. పల్లె ప్రగతి స్ఫూర్తిగా ఊరి బాగు కోసం అందరూ ఒక్కటై ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన పనులు ఊరు మురుసెలా చేస్తున్నాయి. ఏ ఊరు చూసినా ఇప్పుడు పాత బావులు, పాడుబడిన ఇండ్లు కనిపించవు. ఇప్పటికే విడుతల వారీగా నాటిన మొక్కలకు నీళ్లు పోస్తూ కొత్తగా మరిన్ని మొక్కలు నాటుతుండడంతో ఊరూవాడ పచ్చదనంతో కళకళలాడుతున్నది. ప్రత్యేక ప్రగతి కార్యాచరణ ప్రణాళిక స్ఫూర్తితో జిల్లాలోని చాలా గ్రామాలు సమస్యలను దూరం చేసుకుని రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచాయి.
పారిశుధ్యం, హరితహారం, వీధి దీపాల నిర్వహణ బాగుపడగా గ్రామావృద్ధికి తయారు చేసిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలతో ప్రగతి పథంలో ముందుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపుకనుగుణంగా జిల్లాలోని పలువురు ప్రవాసాంధ్రులు, దాతలు సొంత ఊరి బాగుకు విరాళాలు ఇచ్చారు. గ్రామాల అభివృద్ధే దేశానికి పట్టుగొమ్మలని నాడు గాంధీ మహాత్ముడు కలలు కంటే అదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ గ్రామాలను పచ్చదనం, పరిశుభ్రతతో బాగు చేసుకునేందుకు ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి కార్యక్రమం అమలు చేస్తున్నారు.
ఐదు పంచాయతీలకు ఐఎస్ఓ..
వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ రంగాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీలు తమ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించుకునేందుకు క్వాలిటీ మేనేజ్మెంట్ ఐఎస్వో 9001-2005 సర్టిఫికెట్కు దరఖాస్తు చేసుకుంటాయి. ఈ తరహాలోనే గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అందించే పౌరసేవలకు ప్రమాణికం నిర్ధారణ కోసం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన్ సంస్థ తెలంగాణ పల్లెల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. గ్రామపంచాయతీల్లో ప్రజలకు అందే పౌరసేవలపై క్వాలిటీ మేనేజ్మెంట్ గుర్తింపు కోసం నీటి సరఫరా, విద్యుత్ సేవలు, ఇంటి, నల్లా పన్నులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, సీసీ రోడ్లు, హరితహారం, నర్సరీ, పారిశుధ్య నిర్వహణ, వైద్యసేవలు వంటి అంశాల ఆధారంగా జిల్లాలో పలు గ్రామపంచాయతీలు దరఖాస్తు చేసుకున్నాయి. లండన్కు చెందిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ బృందం గ్రామాల్లో పర్యటించి ఐఎస్వో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న జిల్లాలోని దేవరుప్పుల మండలం కడవెండి, పాలకుర్తి మండల కేంద్రం, బచ్చన్నపేట మండలం కొడ్వటూరు, లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామపంచాయతీలను ఎంపిక చేసింది. ఇటీవల ఈ ఐదు గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు 9001-2005 సర్టిఫికేట్లను అందించారు.
పల్లెప్రగతి ప్రణాళిక స్ఫూర్తి..
పల్లెప్రగతి ప్రణాళికతో చేపట్టిన కార్యచరణ పనుల వల్లే పౌర సేవల్లో జిల్లా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఐఎస్వో సర్టిఫికెట్లు అందుకొని ప్రపంచ చిత్రపటంలో మన పల్లెలు మెరిసిపోతున్నాయి. తాగునీటి లభ్యత, జనన, మరణ, వివాహ సర్టిఫికెట్ల జారీ చేసే సమయం, పన్నుల వసూలు, జవాబుదారీతనం, ఈ-పంచాయతీ నిర్వహణ, నల్లా నీటి పైపులైన్ పాడైతే మరమ్మతు సమయం, వీధిదీపాల నిర్వహణ, డ్రైయినేజీ శుభ్రత, పచ్చదనం, పరిశుభ్రత, ఇంటింటి తడి,పొడి చెత్త సేకరణ, పల్లెప్రగతి ప్రణాళికలో గ్రీనరీ, బృహత్ ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంకుడు గుంతలు, భూగర్భ జలాల పెంపు, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి అంశాల్లో ప్రామాణికంగా గ్రామాలను ఐఎస్వో గుర్తింపుకు ఎంపిక చేశారు. నీటి సమృద్ధి విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న నెల్లుట్ల గ్రామపంచాయతీ పేరు ప్రపంచ వ్యాపితమైంది.
– సేవలన్నీ పంచాయతీల్లోనే..
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుపరిపాలన అందించే పంచాయతీలను గుర్తించి ఐఎస్వో సర్టిఫికెట్ ఇచ్చిన సంస్థ రానున్న ఏడాదిలో ప్రభుత్వ నిధులకు తోడు ఎన్జీవోల ద్వారా అదనపు నిధులు సమకూర్చనుంది. అంతేకాకుండా పారిశుధ్యం, పరిశుభ్రతతోపాటు గ్రామాల్లో రైతులకు సంబంధించి మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ పరమైన పహాణీలు, పంచనామా కాపీలు, పట్టాదారుపాస్పుస్తకాల నకలు, అడంగల్, పహాణీ మార్పులు, గ్రామాల మ్యాపులు, ఆస్తుల పత్రాల కోసం స్థానికంగా ఆయా గ్రామాల్లో సేవా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఆర్వోఆర్ భూమి విలువ, కొనుగోలు తర్వాత పట్టా అమలు కోసం దరఖాస్తులు, టైటిల్డీడ్ బదిలీ, పేరు మార్పిడి వంటి సేవలను పంచాయతీల్లో అందుబాటులోకి తెస్తారు. డబుల్బెడ్ రూం ఇళ్లకు దరఖాస్తులు, పేర్ల మార్పిడి పత్రాలు, డీడ్స్ బదలాయింపు, రేషన్కార్డుల ప్రింటింగ్, పావలా వడ్డీ రుణం గ్రామీణ మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు సేవలు లభించేలా చూస్తారు.
అందరి సహకారంతోనే అభివృద్ధి సాకారం..
లింగాలఘనపురం : అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతోనే నెల్లుట్ల గ్రామ పంచాయితీ అవార్డులను అందుకుంది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణల్లో మిషన్ భగీరథ సీఎం కేసీఆర్ మానసపుత్రిక. గ్రామంలోని ప్రతి ఇంటికీ నల్లాలను ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలో స్వఛ్చమైన గోదావరి జలాలను అందించాం. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకున్నాం. వృథాగా నీళ్లు పోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. మిషన్భగీరథ నీటియాజమాన్య తీరుపై జాతీయ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాం. దీంతో ఆనందంగా ఉంది.
-చిట్ల స్వరూపరాణీభూపాల్రెడ్డి, సర్పంచ్, నెల్లుట్ల
మా బాధ్యతలను నెరవేరుస్తున్నాం..
దేవరుప్పుల : ప్రజలు తనపై ఎంతో నమ్మకముంచి గెలిపించారో అంతే నమ్మకంతో తాను ప్రజాసేవచేస్తున్నా. పల్లెప్రగతిలో గ్రామం దశ తిరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తోడ్పాటుతో వాడవాడలా సీసీ రోడ్లు వేయించాం. ప్రతి రోజూ తడపొడిచెత్త సేకరించి సెగ్రిగేషన్ షెడ్డుకు చేరవేసి తడిపొడి చెత్తను వేరుచేస్తూ సేంద్రీయ ఎరువును తయారు చేస్తున్నాం. మిషన్భగీరథ నీటికి కరువులేకుండా సరఫరా చేస్తున్నాం. నూతన గ్రామపంచాయతీ నిర్మించి అం దుబాటుతోకి రావడంతో కడవెండికి శోభ సంతరించుకుంది.
-పోతిరెడ్డి బెత్లినారెడ్డి, సర్పంచ్, కడవెండి
ప్రజలకు అందుబాటులో జీపీ సేవలు
పాలకుర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న అభివృద్ధి పనులతోపాటు గ్రామపంచాయతీల ద్వారా పౌరసేవలు అందిస్తున్నాం. పల్లెప్రగతిలో ఐఎస్వో సర్వే నిర్వహించగా పాలకుర్తి గ్రామపంచాయతీకి అవా ర్డు లభించింది. జీపీలో 18 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నాం. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి సకాలంలో ఇస్తున్నాం. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సకాలంలోనేరవేరుస్తున్నాం. డ్రైనేజీలు, డంపింగ్యార్డు, చెత్త సేకరణ ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజు చేరవేస్తున్నాం. వైకుంఠధామాలు, నర్సరీ, పల్లెప్రగతి, ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం. సుపరిపాలన విభాగంలో అత్యుత్తమ సేవలకు అవార్డు లభించడం ఆనందంగా ఉంది.
– యాకాంతారావు, సర్పంచ్, పాలకుర్తి సర్పంచ్
అందరి సహకారంతోనే అభివృద్ధి
చిల్పూరు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామం లో అభివృద్ధి పను లు జరుగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సంపూర్ణ సహకారంతోనే ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే గ్రామంలో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీల నిర్మాణం చేపట్టాం. మిషన్భగీరథతో తాగునీటి సమస్య పరిష్కారమైంది. సీఎం కేసీఆర్ గ్రామాలకు నిధులు కేటాయిస్తుండడంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పల్లెప్రకృతివనం, నర్సరీలను అభివృద్ధి చేశాం. వీధుల్లో సీసీ రోడ్లను నిర్మించడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పాం. ప్రజల సంపూర్ణ సహకారంతో మరింత అభివృద్ధి చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నాం.
– మామిడాల లింగారెడ్డి, సర్పంచ్, చిన్నపెండ్యాల
జవాబుదారితనంగా ప్రజలకు సేవలు
బచ్చన్నపేట : రాష్ట్ర ప్రభు త్వ సహకారంతో గ్రామం లో అభివృద్ధి పనులు వేగవంతం చేశాం. దీనికి ప్రజల సహకారం వందశాతం ఉంది. ఇంటి, నల్లా పన్నులు ప్రతి ఏడాది ప్రజలు స్వచ్చందంగా చెల్లిస్తారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ సకాలలో చేరవేస్తున్నాం. జీపీ రికార్డులు వందశాతం నిర్వహిస్తున్నాం. జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందిస్తున్నాం. గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత పాటించడంతో పాటు ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తున్నాం. ఇప్పటికే స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా తొమ్మిది ఆవార్డులు అందుకున్నాం. పౌరసేవల్లోనూ ఉత్తమ సేవలు అందించినందుకు అవార్డు రావడం ఆనందంగా ఉంది.
-గంగం సతీష్రెడ్డి, సర్పంచ్, కొడవటూరు