రోజురోజుకూ పత్తి ధర పైపైకి ఎగుస్తున్నది. ఈ నెల ఒకటి నుంచి నిలకడగా పెరుగుతూ వస్తున్నది. మార్కెట్లో అక్టోబర్ చివరి వారంలో ఒకింత తగ్గి క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.7,225 పలికింది. నవంబర్ నుంచి క్రమేనా పుంజుకుని.. ప్రస్తుతం రూ.9 వేలకు చేరువ కావడంతో రైతులు సంబుర పడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో తెల్ల బంగారానికి డిమాండ్ ఉండడంతో ధర పెరుగుతున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇప్పటి వరకు 85,226 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగినట్లు చెప్పారు. పత్తి దిగుబడులు మార్కెట్కు పోటెత్తుతుండడంతో అధికారులు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
వరంగల్, నవంబర్ 14(నమస్తేతెలంగాణ) : రైతుల్లో పత్తి ధరపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడింది. అక్టోబర్ చివరి వారంలో తగ్గినట్లు కనపడిన ధర మళ్లీ పుంజుకున్నది. మార్కెట్లో రోజురోజుకూ ధర పెరుగుతుండడంతో రైతులు సంబురపడుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్ పత్తి ధర రూ.9వేలకు చేరువైంది. ఈ ఏడాది సెప్టెంబర్ మూడో వారం నుంచి వానకాలం పత్తి పంట దిగుబడులు రావడం మొదలైంది. ఆరంభంలో కొత్త పత్తికి క్వింటాల్ ధర రూ.9 వేలకుపైగా పలికింది. సెప్టెంబర్ 21న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గరిష్ఠ ధర రూ.9,410. 22న రూ.9 వేలకు తగ్గింది. 23న రూ.8,920 పలికింది.
26న మార్కెట్కు కొత్త పత్తి తెచ్చిన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామ రైతు క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.8,019 పొందాడు. అలాగే, 28న రూ.8,451 పలికితే 29న రూ.8,271, 30న రూ.8,316గా నమోదైనట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 7న క్వింటాల్ పత్తి గరిష్ఠ ధర రూ.8,210 ఉంటే 17వ తేదీ నుంచి రూ.8వేల కంటే తక్కువ పలుకడం మొదలైంది. 18న రూ.8,010 మినహా నెలాఖరు వరకు ధర ఏనాడు రూ.8వేలకు చేరలేదు. ధర క్రమంగా తగ్గుతూ 28వ తేదీ వరకు రూ.7,225 పడిపోయింది. దీంతో పత్తి రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు పత్తి పంట దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషకుల అంచనా నేపథ్యంలో మార్కెట్లో పత్తికి ధర పడిపోతుండడంపై టెన్షన్ పడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తగ్గే అవకాశం లేదనే సమాచారంతో ఊపిరీ పీల్చుకున్నారు. ఆశించినట్లుగానే ఈ నెలలో మార్కెట్లో పత్తి ధర పైపైకి పోతుండడం వారికి ఊరటనిస్తున్నది.
ఒకటి నుంచి ధర పెరుగుదల..
అక్టోబర్ 31న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్ఠ ధర రూ.7,550 పలికితే ఈ నెల ఒకటో తేదీన రూ.7,650 నమోదైంది. 2న రూ.7,900 పెరిగింది. 3న రూ.8 వేలు దాటింది. గరిష్ఠ ధర రూ.8,055 నమోదైంది. 4న రూ.8,200 పలికిన ధర 7న రూ.8,410కి ఎగబాకింది. దుగ్గొండి మండలం మందపల్లి గ్రామ రైతు బోడ రాజనర్సింహకు ఈ ధర లభించింది. పది బస్తాల ద్వారా ఆయన ఎనుమాముల మార్కెట్కు తెచ్చిన పత్తికి ఖరీదుదారులు తేమ శాతం 11.9 శాతం ఉండడంతో క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.8,410గా నిర్ణయించారు. ఈ ధర 9న రూ.8,560కి పెరిగింది. 11న రూ.8,620కి ఎగబాకింది. సోమవారం ధర మరింత పెరిగింది. ఈ మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్ఠ ధర రూ.8,960 పలికింది. 5,707 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ మార్కెట్లలో ఇదే రోజు గరిష్ట ధర రూ.9 వేలు దాటడం గమనార్హం.
ఈ ఏడాది పత్తి(లాంగ్ స్టేపుల్)కి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు రూ.6,380. ఒక దశలో అక్టోబర్ చివరి వారం మార్కెట్లో పత్తి క్వింటాల్ ధర రూ.7,225కి పడిపోయిన సమయంలో మద్దతు ధరైనా దక్కేనా? అనే అనుమానాలు రైతుల్లో గుబులు పుట్టించాయి. ఈ క్రమంలో అవసరమైతే జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. కొద్దిరోజుల నుంచి మార్కెట్లో పత్తి ధర పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో 85,226 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఇందులో రైతులు బస్తాల ద్వారా తెచ్చింది 66,636 లూజు పత్తి 18,590 క్వింటాళ్లు అని మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. పంట నుంచి పత్తి తీసే పనులు ఊపందుకోవడంతో మార్కెట్కు మరింత పత్తి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఎనుమాముల మార్కెట్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.