దేవరుప్పుల : సీజన్లో ఇప్పటికే చెరువులు నిండి, భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి సాగు ఊపందుకోవాల్సిన ఈ తరుణంలో వానలు లేక రైతులు వ్యవసాయంలో వెనుకబడిపోయారు. రోహిణి కార్తెలో పోసిన వరినార్లు ముదురుతుండగా, ఉన్న నీళ్లతో నాట్లు వేద్దామని కొద్దోగొప్పో దున్నిన దుక్కులు నీరు లేక ఎండుతున్నాయి. అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు పత్తి గింజలు విత్తినా కింద పదనులేక ఎర్ర చెల్కల్లో మొక్కలు మాడుతున్నాయి. ఇగ రేగళ్లలో ఇప్పటికి పచ్చగానే కనిపిస్తున్నా, వానలు పడకపోతే మరో వారం రోజుల్లో పత్తి మొక్కలు ఎండిపోవడం ఖాయమని రైతులు చెబుతున్నారు.
ఇప్పటికే నాట్లు పూర్తి కావాలె. జూలై నెల సగం వచ్చినా సాగునీరు లేక నాట్లు ఆలస్యమైతున్నయి. నేను 6 ఎకరాలకు నారు పోసిన. ఒక్క గుంట నాటు పెట్టలే. బోరు ఆగిఆగి పోస్తుంది. దుక్కులు దున్నుదామన్నా నీళ్లు లేవు. నార్లు ముదురుతున్నయ్. కనీసం దేవాదుల నీరు వదిలి చెరువులు నింపినా భూగర్భ జలాలు పెరిగి బోర్లు పోస్తుండె. ఆ ప్రయత్నం జరగడం లేదు.
– తోటకూరి దశరథ, రైతు, దేవరుప్పుల
10 ఎకరాలు పత్తి చేను పెట్టిన. అంతా ఎర్ర చెల్క భూమి. చేను ఏపుగా పెరిగింది. వానలు ఎనకపడ డంతో భూమిల పదనులేక చేను మాడ్పుముఖం పట్టింది. మరో పది రోజుల్ల వానలు పడక ఇట్లే ఉంటే చేను పూర్తిగా ఎండిపోతది. ఇంత ఆధ్వానమైన పరిస్థితి ఎన్నడు చూడలే. 10 ఎకరాలు పత్తి గింజలు పెట్టడానికి చేతి కష్టం పోను ఇప్పటికే రూ. 60 వేల పెట్టుబడి అయింది.
– దొంటిక మల్లయ్య, రైతు, కడవెండి
జఫర్గఢ్ : మండలంలోని పాగరం, తిడుగు, తిమ్మంపేట, తమ్మడపల్లి(జి), జఫర్గఢ్, హిమ్మత్నగర్ తదితర గ్రామాల్లో కొంత మంది రైతులు తమ బోరు మోటర్ల నీటితో పొలాలను దున్నుకున్నారు. తీరా వరి నాటు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బోర్లు నీళ్లు పోయక పోవడంతో దుక్కులు ఎండిపోవడంతో వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వానకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చెరువులు, కాల్వలు నింపకపోవడంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. వెంటనే వాటిల్లోకి గోదావరి జలాలలను వదలాలని కోరుతున్నారు.
జఫర్గఢ్లోని పెద్ద చెరువును గోదావరి జలాలతో నింపి పలు గ్రామాలకు మేలు జరుగుతుంది. ఎలినినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో రైతాంగం కష్టాలు పడుతున్నది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలి.
– మదన్ మోహన్, రైతు, జఫర్గఢ్
పాలకుర్తి : మండలంలోని కొండాపురం శివారు పూసల తండాలో నీళ్లు లేక సుమారు పదెకరాల వరి పొలం దున్నలేదు. నారు మడులు ముదిరిపోతుండడంతో రైతులు అల్లాడుతున్నారు. తన మూడెకరాల భూమిలో నీళ్లు లేక పొలం దున్నలేదని, ఎన్నడూ లేనంత కరువు చూస్తున్నామని తండాకు చెందిన బదావత్ సీత్యానాయక్ వాపోయాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా జీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రిగా ఉన్నప్పుడు గోదావరి జలాలు పుష్కలంగా వచ్చాయని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు, ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి పంట కాల్వ ఆపారని పేర్కొన్నాడు. తనతో పాటు చాలా మంది పొలం దున్నలేదని, ప్రభుత్వం వెంటనే గోదావరి జలాలు విడుదల చేయాలని కోరాడు.