న్యూఢిల్లీ, ఆగస్టు 6 : బీమా సేవల సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.13,492 కోట్ల నికర లాభా న్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.10,987 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షాకాలంలో సంస్థ రూ.2,37,848 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
అంతక్రితం ఏడాది రూ.2,22,864 కోట్లుగా ఉన్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంతో తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.7,525 కోట్ల నుంచి రూ.9,217 కోట్లకు పెరిగాయి. అలాగే రెన్యువల్ ప్రీమియం వసూళ్లు కూడా 59,885 కోట్ల నుంచి రూ.61,833 కోట్లకు పెరుగగా, సింగిల్ ప్రీమియం వసూళ్లు రూ.56,369 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర ప్రీమియం ఆదాయం రూ.1,19,200 కోట్ల నుంచి రూ.1,27,250 కోట్లకు పెరిగాయి. మరోవైపు, నిర్వహణ ఖర్చులు రూ.2,11,928 కోట్ల నుంచి రూ.2,25,573 కోట్లకు చేరుకున్నట్టు తెలిపింది.
వచ్చే ఏడాదిన్నరలోగా సంస్థలో వాటా విక్రయించేయోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్ దొరైస్వామి స్పష్టంచేశారు. ఇటీవల ఆఫర్ ఫర్ సేల్ రూట్లో 6.5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించిన విషయం తెలిసిందే. సెబీ మార్గదర్శకాల ప్రకారం సంస్థలో ప్రజలు 25 శాతం వాటా కలిగివుండాలనే ప్రతిపాదనపై ఆయన స్పందిస్తూ..వచ్చే 18 నుంచి 24 నెలల్లో కేంద్రం మరోదఫా వాటా విక్రయించేయోచనలో లేదని, ఇప్పటికే 10 శాతం వాటాను విక్రయించినట్టు చెప్పారు.