లబ్ధిదారులు కోరుకున్న ప్రాంతంలో గొర్రెలను కొనుగోలు చేసేందుకు వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. అక్కడి నుంచి జీవాలను రవాణా చేసేందుకు అధికారులు టెండర్లను ఖరారు చేశారు. ఇప్పటికే తమ వాటాగా రూ. రూ.43,750 చొప్పున జమ చేసిన 566 మంది పెంపకందారులకు రూ.1.75 లక్షల విలువైన యూనిట్లను అందజేయనున్నారు. జిల్లాలో రెండో విడుతలో మొత్తం 12,782 మందికి లబ్ధి చేకూరనుండగా, జూన్ 5న నియోజకవర్గం వారీగా గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
– వరంగల్, మే 24 (నమస్తే తెలంగాణ)
వరంగల్, మే 24 (నమస్తే తెలంగాణ) : రెండో విడుత గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న గొర్రెల పెంపకందారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూన్ 5న జీవాల పంపిణీని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మంగళవారం ప్రకటించారు. దీంతో ఇప్పటికే జిల్లాలో వాటాదనం చెల్లించిన గొర్రెల పెంపకందారులకు జూన్ 5న గొర్రెలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా గొర్రెల కొనుగోలు కోసం జూన్ ఒకటో తేదీన నిర్దేశిత రాష్ర్టాల్లోని జిల్లాలకు బయల్దేరేందుకు సన్నద్ధం అవుతున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం గొర్రెల పెంపకందారులకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను రెండు విడుతల్లో పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామం వారీగా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో 199 సంఘాల్లో 23,252 మంది సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. 13 మండలాల్లో లాటరీ పద్ధతిన జాబితా ‘ఏ’, జాబితా ‘బీ’ రూపొందించారు. జాబితా ‘ఏ’ లో 10,470, జాబితా ‘బీ’లో 12,782 మంది గొర్రెల పెంపకందారులు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. తొలివిడుత 2017-18లో జాబితా ‘ఏ’ లోని గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసి ఇచ్చింది. ఒక్కో యూనిట్ విలువ రూ.1.25 లక్షలు. ప్రతి యూనిట్లో 20 ఆడ గొర్రెలు, ఒక మగ గొర్రె ఉంది. లబ్ధిదారులు తమ వాటాధనం కింద యూనిట్ విలువలో 25 ఐదు శాతం చెల్లించారు. ఈ లెక్కన రూ.1.25 లక్షల యూనిట్లో రూ.31,250 చెల్లిస్తే ప్రభుత్వం 75 శాతం అంటే రూ.93,750 సబ్సిడీగా ఇచ్చింది. గొర్రెల పంపిణీతో గ్రామాల్లో గొర్రెల సంపద పెరిగింది. సబ్సిడీ గొర్రెలను పొందిన లబ్ధిదారులు తాము ఆశించిన ఉపాధి పొందుతున్నారు. ప్రధానంగా గతంలో గొర్రెల యజమానుల వద్ద పాలేరుగా పనిచేసిన పెంపకందారులు ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీతో యజమానులు అయ్యారు.
ఆగస్టులోగా పంపిణీ పూర్తి..
మార్కెట్లో గొర్రెల ధర పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ గొర్రెల యూనిట్ విలువను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది. రెండో విడుత జాబితా ‘బీ’లోని గొర్రెల పెంపకందారులకు రూ.1.75 లక్షల యూనిట్ను అందజేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు లోపు రెండో విడత గొర్రెల పంపిణీ పూర్తి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ఫలితంగా జిల్లాలో రెండోవిడుత జాబితా ‘బీ’లోని 12,782 మంది గొర్రెల పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జాబితా ‘బీ’లోని గొర్రెల పెంపకందారులకు రెండో విడుత సబ్సిడీ గొర్రెల పంపిణీకి అధికారులు ప్రణాళిక రూపొందించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు జాబితా ‘బీ’లోని గొర్రెల పెంపకందారులకు వాటాధనం చెల్లించాలని చెప్పారు. దీన్ని డీడీ రూపంలో కాకుండా బ్యాంకు సొంత ఖాతాలో జమ చేసి కలెక్టర్ ఖాతాకు బదిలీ చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు గొర్రెల పెంపకందారులు రూ.1.75 లక్షల యూనిట్లో 25 శాతం రూ.43,750 వాటాధనం చెల్లిస్తున్నారు. దీనికి ప్రభుత్వం 75 శాతం రూ.1,31,250 సబ్సిడీ జమ చేయనుంది. ఈ లెక్కన ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 566 మంది గొర్రెల పెంపకందారులు ఒక్కొక్కరు తమ వాటాధనం రూ.43,750 చొప్పున రూ.2,47,62,500 చెల్లించారు. జూన్ 5న రెండోవిడుత సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ 566 మంది పెంపకందారులకు గొర్రెలను కొనుగోలు చేసి జిల్లాలో నియోజకవర్గం వారీగా పంపిణీ ప్రారంభ కార్యక్రమం నిర్వహించే దిశగా అధికారులు ముందుకు వెళ్తున్నారు.
కొనుగోలుకు 12 బృందాలు..
జిల్లాలో రెండోవిడుత గొర్రెల పెంపకందారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలతో పాటు కర్నాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలో గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులు కోరుకునే జిల్లాలోనే అధికారులు గొర్రెలను కొనుగోలు చేయాలని ఆదేశించింది. దీంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులతో 12 బృందాలను నియమించింది. లబ్ధిదారుల ఇష్టప్రకారం ఈ బృందాలు ఏపీ, కర్నాటక రాష్ర్టాల్లోని మూడు జిల్లాల్లో గొర్రెలను కొనుగోలు చేస్తాయి. సదరు జిల్లాల్లో కొనుగోలు చేసిన గొర్రెలను జిల్లాకు రవాణా చేసేందుకు ట్రాన్స్పోర్టు కాంట్రాక్టు టెండర్ను కూడా కొద్దిరోజుల క్రితం పశుసంవర్ధక శాఖ అధికారులు ఖరారు చేశారు. ఒక్కో లారీ ద్వారా 6 యూనిట్ల గొర్రెలను రవాణా చేస్తారు. టీంల వెంట పశు సంవర్ధకశాఖ రాష్ట్ర కార్యాలయం కేటాయించే అసిస్టెంటు డైరెక్టర్ స్థాయి అధికారులు కూడా ఉంటారు. జూన్ 1న జిల్లా నుంచి గొర్రెల కొనుగోలు కోసం లబ్ధిదారులు కోరుకునే ఏపీ, కర్నాటకలోని జిల్లాలకు పయనం అయ్యేందుకు ప్రత్యేక బృందాల్లోని అధికారులు సమాయత్తం అవుతున్నారు. నిర్దేశిత జిల్లాల్లో కొనుగోలు చేసిన గొర్రెలను జూన్ 5న నియోజకవర్గం వారీగా జరిగే కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు.