వరంగల్, ఫిబ్రవరి 13 : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డకు వెళ్లి రాజకీయం చేస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. మంగళవారం వరంగల్లో ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. మేడిగడ్డ డ్యామేజ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నదని మండిపడ్డారు. ఇదివరకే రాహుల్గాంధీతో కలిసి మేడిగడ్డకు వెళ్లిన రేవంత్రెడ్డి ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాక ముందు కాళేళ్వరం అవినీతి, మేడిగడ్డ డ్యామేజీపై సీబీఐ విచారణ జరిపిస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపించే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. మేడిగడ్డ డ్యామ్ ప్రమాదంలో ఉందని తెలిసినా అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలం వృథా చేశారన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, నిపుణుల కమిటీ బృందం మళ్లీ మేడిగడ్డ సందర్శనకు వస్తామంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నదని విమర్శించారు. విజిలెన్స్ దర్యాప్తు అంటున్న రాష్ట్ర సర్కారు విజిలెన్స్ ఏం చేస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఆంధ్రా పోలీసుల పహారాలో కృష్ణా జలాలను తీసుకుపోతుంటే రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారంపై రాష్ట్ర సర్కారు వైఖరి ఏమిటో తెలుపాలని, సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ర్టాలు పరిష్కరించుకుంటే కేంద్రం జోక్యం చేసుకోదని, లేకుంటే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని స్పష్టంచేశారు. కృష్ణా జలాల వివాదంపై కేంద్రం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసిందన్నారు. ఇరు రాష్ర్టా లు ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించి న్యాయం పొందవచ్చన్నారు. కేంద్రంపై నిందలు వేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని కిషన్రెడ్డి విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు 40 సీట్లు రావని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్లేనని, రాహుల్ గాంధీని నమ్మితే కుక్కతోక పట్టి గోదారి ఈదినట్లేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో బీజేపీ ఎప్పుడూ కలువలేదని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, గంటా రవికుమార్, రాష్ట్ర నాయకులు ప్రేమేందర్రెడ్డి, తాళ్లపెల్లి కుమారస్వామి, డాక్టర్ విజయరామారావు, డాక్టర్ రాజేశ్వర్రావు, డాక్టర్ కాళీప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, మార్తినేని ధర్మారావు, ఓంటేరు జయపాల్, సతీశ్, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.