హస్తం పార్టీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ను నమ్ముకున్న వారికి అధిష్ఠానం మొండి చేయి చూపడంతో అసంతృప్తితో రగిలిపోతూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఆశించిన నేతలను కాదని పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని ఎన్నారై మామిడాల ఝాన్సీరెడ్డి కోడలు మామిడాల యశస్విని రెడ్డికి టికెట్ కేటాయించడంపై నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. దీనికి నిరసనగా పాలకుర్తి కాంగ్రెస్ టికెట్ ఆశించిన టీ-పీసీసీ ఎన్నారై సెల్ రాష్ట్ర కన్వీనర్ యర్రంరెడ్డి తిరుపతిరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన లేఖను సోమవారం టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి పంపించారు. ఆయనకు మద్దతుగా కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గండిపెల్లి యాకయ్య, పాలకుర్తి మండల మైనార్టీ సెల్ నాయకుడు, కో-ఆపరేటివ్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎండీ సలీం, తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గనగాని రాజేందర్గౌడ్తోపాటు మరికొందరు రాజీనామా చేశారు. వీరంతా నేడు హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు.
జనగామ, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ భారీ కుదుపుకు లోనైంది. నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యనేతలు సోమవారం మూకుమ్మడి రాజీనామా చేస్తూ సంతకాలతో కూడిన లేఖను టీ-పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి పంపించారు. ప్రాధమిక సభ్యత్వం లేని మామిడాల యశశ్వినిరెడ్డికి పార్టీ టికెట్ కేటాయించడం ఏమిటని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం వరకు కాంగ్రెస్ క్యాడర్ రగిలిపోతున్నది. పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఎన్నారై అనుమాండ్ల ఝాన్సీలక్ష్మిరెడ్డి కొద్దినెలలుగా నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచా రం కూడా చేశారు. ప్రవాసాంధ్రురాలుగా ఉన్న ఆమె తనకు భారత పౌరసత్వం కల్పించాలని చేసుకున్న దరఖాస్తును నిబంధనల మేరకు సిటిజన్ షిప్ ఇవ్వలేమని అధికారులు తిరస్కరించారు. దీంతో కోడలు మామిడాల యశశ్వినిరెడ్డిని రంగంలోకి దింపిన ఝాన్సీలక్ష్మిరెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆమె పేరిట ఇప్పించుకున్నారు. వారం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్న అత్తాకోడలు వెంట పార్టీ శ్రేణులు అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి.
ఇన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ ముఖ్యనాయకులు సామూహికంగా రాజీనామాలు చేస్తూ తీసుకున్న నిర్ణయం పాలకుర్తి నియోజకవర్గంలో సంచలనంగా మారింది. కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేని వ్యక్తికి కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్ధిగా నిర్ణయించి బీ-ఫారం ఇవ్వడాన్ని నిరసిస్తూ పాలకుర్తి కాంగ్రెస్ టికెట్ ఆశించిన టీ-పీసీసీ ఎన్నారై సెల్ రాష్ట్ర కన్వీనర్ యర్రంరెడ్డి తిరుపతిరెడ్డి తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసి లేఖను టీ-పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డికి పంపించారు. ఆయనకు మద్దతుగా కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గండిపెల్లి యాకయ్య, పాలకుర్తి మండల మైనార్టీ సెల్ నాయకుడు, మాజీ కో-ఆపరేటివ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండీ సలీం, తెలంగాణ ఉద్యమకారుల సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు గనగాని రాజేందర్గౌడ్, కొరిపల్లి మాజీ సర్పంచ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఇస్లావత్ రవి, ఎస్టీ సెల్ అధ్యక్షులు జె.రాహుల్, కొడకండ్ల మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి టీ.మహేందర్రెడ్డి, దేవరుప్పుల మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాసాని ఎర్రయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తొర్రూరుకు చెందిన అనిల్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు అల్లం ప్రదీప్రెడ్డి సహా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, తొర్రూరు మండలాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన పలువురు ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా త్వరలో హైదరాబాద్లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.