West Bengal : పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక హోటల్లో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బెంగాల్, బీర్భూమ్ జిల్లా, తారాపీట్లోని ఒక హోటల్లో సోమవారం వేకువజామున జరిగింది. కస్టమర్లు, సిబ్బంది గాఢ నిద్రలో ఉండగా, ఉదయం 4.00 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తారాపీట్.. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడి దేవాలయానికి భక్తులు భారీగా వస్తుంటారు. ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో భక్తులు భారీగా వచ్చారు.
దీంతో వారితో హోటల్ నిండిపోయింది. ఇది నాలుగంతస్తుల బిల్డింగ్. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. హోటల్ గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న రిసెప్షన్లో మొదట మంటలు చెలరేగాయి. తర్వాత బిల్డింగులోని ఇతర ఫ్లోర్లకు వ్యాపించాయి. ఈ క్రమంలో ముందుగా పొగ భారీగా విస్తరించింది. తర్వాత మంటలు కూడా వ్యాపించాయి. మంటల ప్రభావంతో వైర్లు కాలిపోవడంతో హోటల్లో లైట్లు పూర్తిగా ఆరిపోయాయి. మంట, పొగల ధాటికి ఉలిక్కిపడి మేల్కొన్న కస్టమర్లు అక్కడినుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. చీకట్లో మంటల నుంచి బయటపడటం కష్టమైపోయింది. పై అంతస్తుల్లోని వారు ఎలాగోలా, మెట్ల మార్గంలో కిందికి రావడానికి ప్రయత్నించారు. అయితే, అక్కడా మంటలు వ్యాపించాయి. అయినప్పటికీ తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో కొంత తొక్కిసలాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. ఇంకొందరు మంటల్లోంచే బయటపడ్డారు. వారి శరీరం కూడా తీవ్రంగా కాలిపోయింది. పొగ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. కొందరు లోపలికి రాలేక లోపలే చిక్కుకుపోయారు. అలా, ఐదుగురు వ్యక్తులు లోపలే మంటలకు మాడిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. బాధితుల్ని రక్షించే సహాయక చర్యలు ప్రారంభించారు. మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఘటనా స్థలం నుంచి ఐదుగురి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం రాంపూర్హత్లోని ఆస్పత్రులకు తరలించారు.
హోటల్ రిసెప్షన్లో ఒక ఏసీకి సంబంధించిన స్విచ్లో మంటలు చెలరేగాయని, ఈ ఫ్లోర్లో ఫైబర్తో తయారైన ఇంటీరియర్స్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని హోటల్ యమజాని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.