రుద్రంపూర్, ఆగస్టు 17 : నేతాజీ రామవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న “నా మొక్క.. నా బాధ్యత” కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కల సంరక్షణతో పాటు వ్యక్తిగత భద్రత, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. “మొక్కను నాటడం అంటే కేవలం ఒక మొక్కను భూమిలో నాటడం కాదని మన భవిష్యత్ను నాటడం” అన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి, దానిని స్నేహితుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. పిల్లల భద్రతపై అవగాహన కల్పిస్తూ సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ గురించి వివరించారు. ఎవరైనా వేధించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా, వెంటపడినా లేదా బెదిరించినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. సమస్యలను మనసులో పెట్టుకుని మౌనంగా ఉండకూడదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.