వరంగల్, జనవరి 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు.. ఎమ్మెల్యేలతో సమానంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై నిర్వహించే సమీక్షల్లో ఎమ్మెల్యేలతో పాటు వారు కూడా దర్జాగా పాల్గొంటున్నారు. వివిధ అంశాలపై ప్రజాప్రతినిధుల వలె ఆదేశాలు ఇస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష జరుగగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ సహా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వపరంగా నలుగురు మంత్రులు నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యేలకు మాత్రమే అని చెప్పారు. కానీ ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఎమ్మెల్యేలతో సమానంగా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పాలకుర్తికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సమీక్షలో పాల్గొని అధికారులకు పలు అంశాలపై ఆదేశాలు ఇచ్చారు.
కొమ్మూరి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. ఝాన్సీరెడ్డి సమీక్ష మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు సమావేశంలోనే ఉన్నారు. నలుగురు మంత్రుల సమక్షంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇలా ఎమ్మెల్యేల తరహాలో వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. జిల్లా యంత్రాంగం అయినా ఇలాంటి విషయాలపై అప్రమత్తంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలను తప్ప ఎవరినీ ఆహ్వానించలేదు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, మున్సిపల్ చైర్పర్సన్లను ఆహ్వానించకపోవడంపైనా అధికారుల్లోనూ చర్చ జరిగింది. ప్రభుత్వపరంగా జరిగిన సమీక్ష సమావేశానికి ప్రజాప్రతినిధులను పాల్గొనకుండా చేయడం సరికాదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమైంది.
పోలీసు పహారా..
సమీక్ష సమావేశం సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ మొత్తం పోలీసులతో నిండిపోయింది. ఆరు జిల్లాలకు చెందిన వందలాది మంది పోలీసులు హనుమకొండ కలెక్టరేట్లోనే ఉ న్నారు. గతంలో ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కూడా లేనంత మంది పోలీసులు మంత్రుల పర్యటనలో ఉండడంపై వరంగల్ నగర ప్రజలు చర్చించుకున్నారు. హైదరాబాద్ మార్గంలో వరంగల్ నగర శివారు నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు అడుగడుగునా పోలీసులు కనిపించారు.