రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించి ఓరుగల్లు కీర్తిని తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘కేసీఆర్ ఆనవాళ్లు’ ఉండకూడదనే అక్కసో.. లేక చారిత్రక ప్రాధాన్యతపై అవగాహన లేకనో రేవంత్ సర్కారు అనుసరిస్తున్న అనాలోచిత వైఖరిపై ప్రజలు, సాహితీవేత్తలు, చరిత్రకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి సంస్కృతి, వారసత్వ సంపద గుర్తింపును మంటగలిపేలా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు. ప్రజలు మెచ్చిన కాకతీయుల పాలనకు తెలంగాణలో మొదటి నుంచీ ప్రత్యేక గుర్తింపు ఉన్నదని.. ఇప్పుడు తోరణాన్ని తొలగించి కొత్తగా రాజముద్రను మార్చాల్సిన అవసరమేమున్నదని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఈ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరుమెదపకపోవడంపై భగ్గుముంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన విరమించుకోకుంటే వారసత్వ సంపద పరిరక్షణ కోసం ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం చిహ్నాన్ని తొలగించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలపై ఓరుగల్లు ప్రజలు మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలును నెరవేర్చకుండా తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద గుర్తింపును మంటగలిపే పనులు ఎందుకుని చరిత్రకారులు, సాహితీవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి అంశాలను పట్టించుకోకుండా పదేండ్లుగా ఉన్న రాజముద్రకు కొత్తగా ఇప్పుడు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు ఇప్పటికైనా ఆలోచన విరమించుకోకుంటే ఉద్యమాలు చేపడుతామని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఉన్న ప్రాధాన్యతను తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలపై ఆ పార్టీకి చెందిన ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే సైతం అధికార పార్టీలో చేరారు. కాకతీయ కళాతోరణంపై కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నిర్ణయాలపై అధికార పార్టీకి చెందిన 11మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరూ స్పందించడం లేదని వరంగల్ ప్రజలు గుర్తు చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఉన్న గుర్తింపును చెరిపివేసే చర్యలను ఎంత మాత్రం సహించబోమని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప సాంస్కృతిక గుర్తింపుగా ఉన్న కాకతీయుల కీర్తి తోరణం తొలగించే ఆలోచన విరమించుకునేలా కార్యాచరణ ఉంటుందని చరిత్రకారులు, కవులు, రచయితలు చెబుతున్నారు.
ములుగు, మే 29(నమస్తే తెలంగాణ) : తెలంగాణ కీర్తి ప్రపంచానికి తెలిసేలా కేసీఆర్ రాష్ట్ర రాజముద్రలో కాకతీయుల తోరణం పొందుపర్చితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని తొలగిస్తే ఏం వస్తుంది? కాకతీయులు, కుతుబ్షాహీల పరిపాలనను గుర్తుచేసేలా కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నాన్ని రూపొందించారు. ఇప్పుడు ఇందులో నుంచి కాకతీయ తోరణాన్ని తొలగించి దాని స్థానంలో ఏం పెడతారు? మన రాష్ట్ర ఎంబ్లమ్ను చూడగానే ఇది తెలంగాణ అని తెలిసేలా ఉంది. వందేళ్ల తర్వాత తెలంగాణ అధికారిక చిహ్నాన్ని ఎవరు చేశారంటే కేసీఆర్ చేసిండు అనే పేరు వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తున్నది. ఎంతో శ్రమించి, మేధావుల అభిప్రాయాలు తీసుకొని ఆలోచించి రూపొందించిన చిహ్నంలో మార్పులు చేయడం సరికాదు.
భూపాలపల్లి రూరల్, మే 29 : కాంగ్రెస్ నాయకులకు కాకతీయుల చరిత్ర తెలియదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుంచి కళాతోరణాన్ని తొలగించడం మంచి పద్ధతి కాదు. ప్రజలు మెచ్చేలా పాలించిన కాకతీయులకు ఒక ప్రత్యేకత ఉంది. చరిత్ర తెలిసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని రాజముద్రలో చేర్చితే చరిత్ర తెలియని కాంగ్రెస్ దానిని తొలగించింది. కాకతీయుల కాలంలో కట్టిన రామప్ప యునెస్కో గుర్తింపు పొందింది. వారు కట్టించిన చెరువులు, ఆలయాలు మన కళ్లముందు కదలాడుతున్నాయి. కాకతీయులు నేటి పాలకులకు మార్గదర్శకులు. ఓరుగల్లు చారిత్రక ప్రాధాన్యతను తగ్గిస్తే ఉమ్మడి వరంగల్ ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది.
హనుమకొండ చౌరస్తా, మే 29: కాకతీయ కళాతోరణం కళ్యాణిచాళుక్యుల నుంచి సంక్రమించింది. దాని తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయులు ఇంకా సుందరంగా తీర్చిదిద్ది గణపతిదేవుని కాలంలో (1199-1260) రాజధాన్ని ఖిలా వరంగల్కు మార్చి కళాతోరణాల్ని తీర్చిదిద్దారు. ఇప్పటివరకు తెలంగాణలోని ప్రజలందరూ కాకతీయుల తోరణాలను తమ సాంస్కృతిక సంపదగా భావిస్తున్నారు. మొఘల్రాజులు కట్టించిన ఎర్రకోటపై కూడా జాతీయజెండా ఎగురవేయవచ్చా? కాంగ్రెస్ ప్రధానమంత్రులు కూడా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు.
జనగామ చౌరస్తా, మే 29 : కాకతీయ కళాతోరణం, చార్మినార్ వంటి రాచరిక చిహ్నాలకు తావులేదని రాష్ట్ర ప్రభుత్వం అనడం సరైంది కాదు. అది అసలు కారణమే కాదు. ప్రజల సమ్మతి పొందిన ఏ రాజవంశాన్ని అయినా మనం చిహ్నంగా తీసుకోవచ్చు. గత తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన చిహ్నం పట్ల ప్రజల నుంచి ఎలాంటి భిన్నాభిప్రాయాలు రాలేదు. అందరూ సుముఖంగా ఉన్నారు. సంతృప్తి చెందారు. రాష్ట్ర ప్రభుత్వం మార్పుతో చిహ్నాల మార్పు అనేది కొత్తగా తెరమీదకి వచ్చింది. ప్రజా ఉద్యమాలను ప్రతిబింబించే విధంగా కొత్త చిహ్నంలో మార్పు తీసుకొస్తామని ఈ ప్రభుత్వం చెబుతున్నది. కొత్త చిహ్నం కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటే మాత్రం కచ్చితంగా వ్యతిరేకించాల్సిందే.