నేపాల్, శ్రీలంక వంటి ఇరుగుపొరుగు దేశాల్లో జెన్-జీ తిరుగుబాట్లు వచ్చినప్పుడు భారత్లో అలాంటివి సాధ్యం కాదనే వాదనలు వినిపించేవి. ఇక్కడి యువత చదువు, కెరీర్ గురించి తప్ప మరోటి ఆలోచించడం లేదనేది ఓ సమర్థన. అయితే వాదనలు వినిపించేవారి సమర్థన. కానీ దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థి-యువజనులు చేపట్టిన 28 రోజుల ఆందోళన ఆ వాదన తప్పని నిరూపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘ప్రశ్న’ను ఎంత బలంగా అణగదొక్కితే అంతకు పదిరెట్ల బలంతో అది ఎగదన్నుకు వస్తుందని ఢిల్లీ ఆందోళన చాటిచెప్పింది.
విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్న లీకులకు జవాబుదారీతనం కావాలనే నినాదంతో యువత ఢిల్లీలో కదంతొక్కితే మొత్తం దేశం ఊగిపోయింది. ఎట్టకేలకు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే చేశారు. కానీ అందుకు ఆయన చూపిన కారణాలు మాత్రం సహేతుకంగా లేవు. పదే పదే పేపర్లు లీకు కావడం, పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టుగా కాకుండా, జాతివ్యతిరేక శక్తులు ప్రవేశించడంతో ఉద్యమం తప్పుదారి పడుతుందన్న ఉద్దేశంతో తప్పుకొంటున్నట్టు ఆయన చెప్పడం దారుణం.
కేంద్రంలో పన్నెండేండ్ల పైచిలుకు కాలంగా కొనసాగుతున్న నరేంద్రమోదీ పాలనకు ఈ ఆందోళన ఒక సవాలు. సర్వశక్తిమంతుడూ, అజేయుడూ అని ప్రచారంలో ఉన్న మోదీని మెడలు వంచొచ్చని ఆందోళనకారులు నిరూపించారు. బొద్దింకల పేరిట మొదలైన వ్యంగ్యం చిలికిచిలికి గాలివానగా మారి ప్రభుత్వాన్ని వణికించింది. తమను తాము అప్రతిహత శక్తిగా భావించి విర్రవీగిన మోదీ సర్కార్ ‘చలిచీమల చేత చిక్కి చావదె సుమతి’ అన్నట్టుగా దిగివచ్చి లెంపలు వేసుకోక తప్పలేదు. మరోవైపు విపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడటంలో విఫలమైన కాంగ్రెస్ ఈ ఆందోళనలో మార్కులు కొట్టేసేందుకు హద్దుల్లేని అవకాశవాద రాజకీయాలకు పాల్పడటం విడ్డూరం. జెన్-జీ పిల్లలు నిలదీశారు. నిగ్గుతేల్చారు. దిద్దుకోవాల్సింది పెద్దలేనని తెలుసుకోవాలి.
ఏ దేశంలో అయినా దిగజారుడు రాజకీయాలకు తమ ఆందోళనల ద్వారా యువత-విద్యార్థులు దిశానిర్దేశం చేయడం చరిత్ర ఎరిగిన సత్యమే. అయితే ఇదంతా పేపర్ లీకేజీలు, రాజీనామా డిమాండ్లకు సంబంధించిన వ్యవహారంలా చూడటం సంకుచిత ధోరణి. దేశంలో సంవత్సరాలుగా పేరుకుపోతున్న అసంతృప్తి ఒక్కసారిగా బద్దలవుతున్న సంకేతాలు ఈ ఆందోళన సందర్భంగా స్పష్టంగా వ్యక్తమయ్యాయి. విద్యారంగం తీసుకుంటే నానాటికీ తీసికట్టు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. నెహ్రూ హయాంలో ఐఐటీల వంటి ఉన్నతస్థాయి విద్యాసంస్థలు ఏర్పడితే..మోదీ హయాంలో వాటి ర్యాంకులు దిగజారిపోతుండటం గమనార్హం. ఉపాధి కల్పన ఉత్తమాట అయ్యింది. ఆర్థికం అస్తవ్యస్తమైంది.
విదేశాంగం అపహాస్యమైంది. మేకిన్ ఇండియా కాస్తా లీకిన్ ఇండియాగా పరిణమించింది. ప్రశ్నించడం దేశద్రోహమైంది. పత్రికాస్వేచ్ఛలో దేశం అట్టడుగు స్థాయికి చేరింది. ప్రజాస్వామ్యం పేరిట సాగుతున్న ఏకవ్యక్తి నియంతృత్వ పాలన వల్ల దేశానికి లాభం కన్నా నష్టమే ఎక్కువన్న భావన సర్వత్రా వ్యాపించింది. యువజనుల ఉద్యమం ఆ భావనను బలంగా ప్రతిఫలించింది.
ఈ ఉద్యమం కేవలం ప్రశ్నపత్రాల లీకేజీపై ఆగ్రహంతో ప్రారంభమైందనేది వట్టిమాట. ఈ ఉద్యమం మరింత విస్తృత రాజకీయ-సామాజిక ప్రశ్నలను లేవనెత్తింది. భారత సమాజంలో అసంతృప్తి ఎంత లోతుగా, ఎంత విస్తృతంగా ఉందో బయటపెట్టింది. ఎంతసేపూ విభజించి పాలించే రాజకీయాలతో, అసలు సమస్యలను గాలికి వదిలేయడంపై ప్రజలు విసిగిపోయారనే దానికి ఈ ఉద్యమం ఒక సూచిక. దేశాభివృద్ధిని గాలికి వదిలి అలవిమాలిన వ్యక్తిపూజ, జాతి నిర్మాతలను తూలనాడే ధోరణిపై యువత అసహనం పెల్లుబుకుతున్నది. యువజనుల ఉద్యమం దేశవ్యాప్తంగా మంచి మద్దతు పొందగలిగింది. ఇప్పటికైతే యువత సాధించింది మామూలు విజయం కాదు. అయితే ఈ ఆందోళన గడ్డిమంటలా చల్లారిపోతుందా? దావానలంలా విస్తరిస్తుందా? అనేది వేచిచూడాలి.