గ్లాస్గో : కామన్వెల్త్ గేమ్స్ తాజా ఎడిషన్లో దేశానికి తొలి స్వర్ణం అందించిన స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను పోటీలకు ముందు బరువు నియంత్రణ ఎలా చేసుకున్నదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళల 48 కిలోల విభాగంలో పసిడి నెగ్గిన అనంతరం తనను కలిసిన పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘త్వరత్వరగా ముగించండి. రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు. ఈ పోటీల కోసం నా బరువును నియంత్రణలో ఉంచుకోవడం నాకు అతిపెద్ద సవాల్గా నిలిచింది. నాకే కాదు. ఏ అథ్లెట్కైనా ఇది చాలా కష్టంతో కూడుకున్న పరీక్ష.
నేను 48 కేజీల విభాగంలో పోటీపడుతున్నా. నా సాధారణ బరువు 50.5 కిలోలు. 49 కి.కు రావడానికి నాకేం కష్టం అనిపించలేదు. కానీ 48 కిలోలకు రావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. దానికోసం రెండు రోజులుగా నోటికి తాళం వేశా. ముఖ్యంగా మూడు రోజుల నుంచి చుక్క నీరు కూడా ముట్టలేదు. ఇక నా శరీరంలో బరువు తగ్గించుకునేందుకు చోటే లేదు’ అంటూ వ్యాఖ్యానించింది. వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ వంటి క్రీడల్లో బరువు నియంత్రణ అనేది అత్యంత కీలకమన్న విషయం విదితమే.