కాజీపేట, అక్టోబర్ 28 : ‘కాంగ్రెస్ అధిష్టానం బేషరతుగా నాకు వరంగల్ పశ్చిమ టికెట్ ఇవ్వాలి.. లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడం ఖాయం’ అని డీసీసీబీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జంగా రాఘవరెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కాంగ్రెస్ నుంచి వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడిన ఆయన గ్రేటర్ 64వ డివిజన్లోని వ్యవసాయ క్షేత్రంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండేందుకు నేను సిద్ధంగా ఉన్న. పార్టీలో సీనియర్ను అయిన నన్ను కాదని కేయూ భూములను అమ్ముకున్న, గతంలో పార్టీని భ్రష్టు పట్టించిన, అసమర్థుడు నాయిని రాజేందర్రెడ్డికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం?’ అని ప్రశ్నించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డికి టికెట్లు ఇచ్చి పార్టీకి అన్ని విధాలా అండగా ఉన్న తనను విస్మరించడం ఏమిటని నిలదీశారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ సమావేశాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశానని ఆవేదన చెందారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తన స్వలాభం కోసం పార్టీని నట్టేట ముంచి బయటకు వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఏ సర్వే ప్రకారం టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్లోని కొందరు పెద్దలు తమ స్వలాభం కోసం వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీని నాశనం చేస్తున్నారని విమర్శించారు. తాను ఏనాడూ కాంగ్రెస్ను మోసం చేయలేదని, భద్రకాళి అమ్మవారిమీద ప్రమాణం చేస్తానని, నాయిని కూడా చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో తన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, వారి సూచన మేరకు రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యంకు తనకు మధ్యే పోటీ ఉంటుందని, నాయిని పోటీ దరిదాపులో కూడా ఉండడన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయ శ్రీ సయ్యద్ రాజాలీ, మాజీ కార్పొరేటర్లు తోట్ల రాజు, రేపల్లె శ్రీనాథ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రంగనాథ్, హనుమకొండ పార్లమెంటరీ యూత్ అధ్యక్షుడు కొడిపాక గణేశ్, కట్ల శ్రీనివాస్, ధనరాజు, రాజు, వస్కుల శంకర్, సందెల విజయ్ ఉన్నారు.