న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బందికి జూలై నెల జీతాలు అందకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. అలాగే రిటైరైన ఉద్యోగులకు పెన్షన్లు కూడా జమ కాలేదు. విశ్వవిద్యాలయ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిధులు విడుదల కాకపోవడంతో ఈ వేతనాల జాప్యం చోటుచేసుకుంది. దీనికి కారణాలు వివరిస్తూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఒక సర్క్యులర్ జారీ చేసింది. యూజీసీ నుంచి పీఎఫ్ఎంఎస్ ద్వారా జూలై నెలకు సంబంధించిన జీతాలు, గ్రాంట్లు అందలేదని దానిలో పేర్కొన్నారు.
అవసరమైన గ్రాంట్లు అందిన వెంటనే ఫైనాన్స్ బ్రాంచ్ ద్వారా జూలై నెల జీతాలు, పెన్షన్లు అందజేయనున్నామని తెలిపారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల వంటి స్వయం ప్రతిపత్తి సంస్థల సిబ్బందికి, పింఛనుదారులకు ప్రతి నెలా చివరి రోజున జీతాలు, పెన్షన్లు అందుతుంటాయి.
విద్య మంత్రిత్వ శాఖ యూజీసీకి నిధులు విడుదల చేస్తుంది.ఆ తర్వాత యూజీసీ విశ్వవిద్యాలయాలకు పంపిణీ చేయడానికి మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలోకి ఈ నిధులు జమ కావాల్సి ఉంటుంది. అయితే ఈసారి కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో సెంట్రల్ యూనివర్సిటీల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.