న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరువులు తరచూ సంభవిస్తున్న వేళ, అమెరికాకు చెందిన 13 ఏండ్ల విద్యార్థి రైతులకు ఉపయోగపడేలా గాలి నుంచి సాగు నీటిని ఉత్పత్తి చేసే విధానాన్ని ఆవిష్కరించాడు. బీవర్టన్లోని విట్ఫోర్డ్ మిడిల్ స్కూల్లో చదువుతున్న రాయ్ కిమ్ వాతావరణంలోని తేమను గ్రహించి దాన్ని సాగు నీటిగా మార్చే చాంబర్ను రూపొందించాడు. ఈ ఆవిష్కరణ 2026 3ఎమ్ యంగ్ సైంటిస్ట్ చాలెంజ్లో టాప్-10 నేషనల్ ఫైనలిస్ట్స్లో అతడికి చోటు దక్కేలా చేసింది.
ఇది పెల్టియర్ మాడ్యూల్ సాంకేతికత ఆధారంగా పని చేస్తుంది. ఈ పరికరంలో విద్యుత్తును సరఫరా చేసినప్పుడు ఈ మాడ్యూల్ ఒక వైపు వేడిని, మరోవైపు చల్లదనాన్ని సృష్టిస్తుంది. ఈ పరికరంలోని చాంబర్లోకి గాలిని ప్రవేశపెట్టిన తరవాత అది కొద్దిగా వేడెక్కి తర్వాత ఫ్యాన్ సహాయంతో చల్లని ఉపరితలం వైపు నెట్టబడుతుంది. అక్కడ గాలిలోని తేమ చల్లని ఉపరితలాన్ని తాకినప్పుడు నీటి బిందువులుగా మారుతుంది.
ఈ నీటి బిందువులను గరాటు ద్వారా సేకరించి వాల్వ్ ఉపయోగించి మొక్కలకు అందిస్తారు. ఈ వ్యవస్థలో నేలలోని తేమ, ఉష్ణోగ్రత, నీటి ఆవిరి సెన్సార్లు ఉన్నాయి. ఇవి గాలి ప్రవాహాన్ని ఆటోమేటిగ్గా సర్దుబాటు చేస్తాయి. మొక్కలకు ఎప్పుడు నీళ్లు అవసరమో తెలుసుకొని, అనవసర నీటి వాడకాన్ని నివారిస్తాయి.