స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 4 : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని, బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి, నాయకులు ఏనుగు రాకేశ్రెడ్డి, మాదాసు వెంకటేశ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధంగా సీట్లు, ఓటింగ్ రాలేదన్నారు. పోటా పోటీగా ఓటింగ్ నమోదైందన్నారు. ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. పదవుల కోసం గొడవ పడితే అభివృద్ధి ఆగిపోతుందని, ప్రభుత్వాలు నిలకడగా ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, తెలంగాణలోని వనరులకు పొంతన లేదన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచకుంటే హా మీలు నెరవేరవని కడియం స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో ఉండాలంటే అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి విషయం లో ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చామని అహంకారంతో వ్యవహరిస్తే అడ్డంకులు ఏర్పడతాయని, ఐదేళ్లు ప్రభుత్వం నిలబడాలంటే నిజాయితీగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పో రాటం చేస్తుందన్నారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి..
పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారని, ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని కడియం తెలిపారు. మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధించారని, పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం విద్యుత్ సమస్యను పరిష్కరించారని వివరించారు. సాఫ్ట్వేర్ ఎగుమతులు పెరిగాయని, ప్రముఖ కంపెనీలను తెలంగాణను తీసుకొచ్చి ఉద్యోగావకాశాలను పెంచడం లో కేటీఆర్ కృషి విశేషంగా ఉందన్నారు. నాయకత్వం ఒకటిగా లేకుంటే నాగార్జునసాగర్ డ్యాం నుంచి కృష్ణా జలాల తరలింపుపై తెలుగు రాష్ర్టాల్లో గొడవలు జరుగుతాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను ప్రణాళిక రూపొందించానని వివరించారు. స్టేషన్ఘన్పూర్లో 100 పడకల దవాఖానకు అనుమతులు వచ్చాయని, జీవో జారీ అయిందని తెలిపారు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని కడియం తెలిపారు.
కేసీఆర్ పథకాలతో పేదలకు మేలు..
అన్ని వర్గాలను ఆదుకునేందుకు కేసీఆర్ చేపట్టిన సం క్షేమ పథకాలు దేశ చరిత్రలో మిగిలిపోతాయని ఏనుగు రాకేశ్ రెడ్డి, జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఇచ్చి ప్రజలు గౌరవం అందించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ శ్రేణులు నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ర్టానికి అన్యాయం జరిగితే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, రాజేశ్ నాయక్, రాపోలు మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.