జనగామ, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం, ఆహ్లాదకర వాతావర ణం పెంపొందించేందుకు, యువత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నేడు వెలవెలబోతున్నాయి. కేసీఆర్ పాలనలో కళకళలాడిన ఈ వనాలు ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంతో సరైన నిర్వహణ లేక, నీరు అందక ఎండిపోయి కళావిహీనంగా మారుతున్నాయి.
అటు పల్లెల్లోనూ, ఇటు పట్టణాల్లోనూ వీటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఆలనాపాలన లేక క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ పరిధి సహా పల్లెలు, పట్టణాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ప్రత్యేక నిధులతో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. తద్వారా పచ్చని శోభ సంతరించుకోగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది.
కానీ రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రస్తుతం నిర్వహణ సరిగా లేక కళావిహీనంగా మారాయి. ఎండిపోయిన మొక్కలతో ఏపుగా పెరిగిన చెట్లు, పిచ్చిగట్టితో ముళ్లపొదలను తలపిస్తున్నాయి. సర్కారు నిర్లక్ష్యం, పంచాయతీ, మున్సిపల్ అధికారుల పట్టింపులేని తనంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయని, అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాలు మారాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సర్కారు పట్టించుకొని ప్రకృతి వనాలుతోపాటు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.