భూపాలపల్లి రూరల్, సెప్టెంబర్ 28: రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డా రు. బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఆనందంగా గడుపాల్సి ఉండగా యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని ఇబ్బం ది పడుతున్నారని తెలిపారు.
ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వేచి ఉన్న రైతులను ఆయన కలిశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరిన విషయం తెలుసుకున్న గండ్ర వెంకటరమణారెడ్డి పరిస్థితిని పరిశీలించారు. పద్ధతి ప్రకారం క్లస్టర్ల వారీగా రైతులకు యూరియా పంపిణీ చేయాలని సొసైటీ చైర్మన్ మేకల సంపత్ను కోరారు. అనంతరం గండ్ర విలేకరులతో మాట్లాడుతూ జంగేడు సొసైటీకి 500 యూరియా బస్తాలు వస్తే వెయ్యి మందికి పైగా రైతులు వేచి ఉన్నారని తెలిపారు.
బతుకమ్మ, దసరా పండుగలకు బంధుమిత్రులు ఇంటికి వస్తే వారితో కలిసి బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపే సమయంలో యూరి యా కోసం ఎదురుచూడాల్సి వస్తున్నదని, దీనికి కారణమైన కాంగ్రెస్ పాలన పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వెంకటరమణారెడ్డి అన్నారు. సరిపడా స్టాక్ ఉన్నప్పటికీ యూరియా తెప్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. వరి పండిస్తున్న రైతుల వివరాలు సేకరించి నేరుగా యూరియా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి యూరియా అందించాలని కోరారు.