గిర్మాజీపేట, మే 13 : పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మే 23 నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు జరిగే పరీక్షలను సాఫీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 56 పరీక్షా కేం ద్రాలను ఏర్పాటు చేయగా.. 5,072 మంది బాలురు, 4,868 మంది బాలికలు మొత్తం 9,940 మంది హాజరుకానున్నారని డీఈవో వాసంతి తెలిపారు. 56 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 56 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 600 మంది ఇన్విజిలేటర్లను విధులు నిర్వర్తించనున్నారు. కాగా, ఈసారి ఆరు పేపర్లకు కుదించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా బెంచీకి ఒకరు చొప్పున కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నన్నారు.
ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని…
ఎండలు తీవ్రంగా ఉన్నందున పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు సదుపాయం కల్పించనున్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత అధికారులతో చర్చించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపే విధంగా అధికారులతో మాట్లాడారు. పరీక్షా కేంద్రానికి ఒక ఏఎన్ఎం, ఆశ కార్యకర్త అందుబాటులో ఉండనున్నారు. అనారోగ్య సమస్యలున్న విద్యార్థులు పరీక్ష రాయడానికి కేంద్రానికో ప్రత్యేక గది ఏర్పాటు చేయనున్నారు.
సమర్థవంతంగా నిర్వహిస్తాం..
– డీఈవో డీ వాసంతి
పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తాం. విద్యార్థులు మానసిక ఒత్తిడి, ఆందోళనను గురికాకుండా ప్రశాంతంగా రాయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒకరోజు ముందే పరీక్షా కేంద్రాన్ని చూపించాలి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 45 నిమిషాల ముందు రావాలి. హాల్టికెట్లను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకోవాలి. పాఠశాలల యాజమాన్యం హాల్టికెట్ల విషయంలో ఇబ్బందులు పెడితే డీఈవో కార్యాలయానికి సమాచారం అందించాలి. జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశాం.