పోచమ్మమైదాన్, జూన్ 6 : తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో వరంగల్లో పరిశమ్రల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయని, నూతనంగా ఏర్పాటు చేసిన టెక్స్టైల్స్ పార్క్తో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. టెక్స్టైల్స్ పార్క్లో మూడు కంపెనీలు వచ్చాయని, వచ్చే నెల 15న కిటెక్స్ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశాయిపేట రోడ్డులోని కేఆర్ గార్డెన్లో పారిశ్రామిక విజయోత్సవ సభను మంగళవారం నిర్వహించారు. ముందుగా కొత్తవాడలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్ నుంచి దేశాయిపేట రోడ్డు వరకు ర్యాలీని నిర్వహించగా దాన్ని ఎమ్మెల్యే నన్నపునేనితో కలిసి మేయర్ గుండు సుధారాణి జెండా ఊపి ప్రారంభించారు. చేనేత పనిముట్లతో నిర్వహించిన ఈ ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు శ్రీవత్సవ కోట, అశ్విని తానాజీ, ఆర్డీవో మహేందర్జీ, సరోగసి డైరెక్టర్ డాక్టర్ హరిరమాదేవి, డీసీసీబీ డైరెక్టర్ యెలగం రవిరాజ్, మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిదన్నారు. మంత్రి కేటీఆర్ విదేశాల్లో పర్యటించి, తెలంగాణలో పెద్ద కంపెనీలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నారన్నారు. అలాగే, వరంగల్కు కూడా అనేక పరిశ్రమలు, కంపెనీలు రాబోతున్నాయన్నారు. గతంలో వరంగల్ తూర్పు అంటే కేవలం ఆజంజాహి మిల్లు, ఎనుమాముల మార్కెట్ అనేవారని, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆజంజాహి మిల్లును అమ్ముకుంటే నాలుగువేల మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. నేడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 319 మంది కార్మికులకు ఇళ్ల స్థలాలను కేటాయించినట్లు తెలిపారు. గత పాలకులు దమ్ము లేక, చేతకాక మిల్లును అమ్ముకుంటే, ఇయ్యాల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో 1200 ఎకరాల్లో మెగా టైక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేసిట్లు తెలిపారు. దీనివల్ల పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకనున్నట్లు చెప్పారు. ఇందులో కార్మికుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, బస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కొత్తవాడలో నేతన్నలు ఆగం కావొద్దని వారు తయారు చేసిన కార్పెట్లు, బెడ్షిట్లను గోదాంలో పెట్టి విక్రయిస్తున్నట్లు వివరించారు. ఇటీవల 1200 మందికి చేనేత బీమా పత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఎన్నికలు పూర్తి కాగానే రింగ్ రోడ్డు పక్కన పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. రానున్న కాలంలో వరంగల్ నగరం ఐటీ కంపెనీల, పరిశ్రమలకు వేదిక కానుందన్నారు. కేటీఆర్ చొరవతో ఇండెక్స్ కంపెనీ ఏర్పాటు వల్ల 80శాతం మంది మహిళలకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
తెలంగాణలో టీఎస్ఐపాస్ విధానం వల్ల పరిశ్రమల ఏర్పాటు సులభమైందని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆధునాతన సాఫ్ట్వేర్ వల్ల 21 రోజుల్లోనే అనుమతి లభిస్తోందన్నారు. వరంగల్ జిల్లాలో 700 యూనిట్లకు అనుమతి ఉందన్నారు. దీనివల్ల 15వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.85 కోట్ల వరకు రుణాలు మంజూరైతే రూ.40 కోట్ల వరకు యూనిట్లు పెట్టినట్లు తెలిపారు. మెగా టైక్స్ టైల్స్ పార్క్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలు, కంపెనీల వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అలాగే చిన్నతరహా, పెద్ద తరహా పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
మెప్మా, డీఆర్డీఏ, చేనేత జౌళి శాఖ ద్వారా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామివేత్తలను సన్మానించారు. అలాగే, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతూ విజయవంతంగా నిర్వహిస్తున్న యూనిట్ల లబ్ధిదారులకు ఉత్తమ అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా దళితబంధు ద్వారా సోను టైల్స్ అండ్ శానిటరీ షాపు నిర్వహిస్తున్న పెండ్యాల సోనిబాబుకు ప్రారిశ్రామిక ప్రగతి అవార్డును ఎమ్మెల్యే నరేందర్, కలెక్టర్ ప్రావీణ్య అందజేశారు. అలాగే, మంత్రి కేటీఆర్ టీఎస్ఐపాస్ గురించి వివరించిన తీరును దృశ్యమాలిక ద్వారా ప్రదర్శించారు. సమావేశంలో ఇండస్ట్రీస్ జీఎం నరసింహామూర్తి, చేనేత జౌళిశాఖ ఏడీ రాఘవరావు, డీవో బొట్టు వెంకటేశ్వర్లు, ఏసీపీ బోనాల కిషన్, సీఐ వెంకటేశ్వర్లు, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.