ఖిలావరంగల్, మే 16 : బలగం సినిమాలో తన పాట ద్వారా యావత్ తెలుగు ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన బుడిగ జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులను అనారోగ్య కష్టాలు చుట్టుముట్టాయి. మొగిలయ్యకు రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేళ్లుగా డయాలసిస్ చేసుకుంటున్నారు. బలగం సినిమాతో వెలుగులోకి వచ్చినట్లే తనకున్న జబ్బు కూడా బయటి ప్రపంచానికి తెలిసింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఊరూరా తిరుగుతూ యక్షగానాలు, బుర్రకథలు చెపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మొగిలయ్యకు ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేదు. ఇదే విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి, అతడి కుటుంబానికి అండగా నిలిచింది. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించింది. ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడాలని మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి దళిత బంధు పథకం కింద మొగిలయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్కు మొగిలయ్య దంపతులను తీసుకొచ్చారు. కలెక్టర్ ప్రావీణ్య శాలువాతో సత్కరించి, దళిత బంధు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ మొగిలయ్య అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా అధికార యంత్రాంగం తరుఫున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కాగా, తమ ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని దళిత బంధు పథకం మంజూరు చేయించిన బోయినపల్లి వినోద్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, పెద్ది సుదర్శన్రెడ్డికి మొగిలయ్య దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, ఎల్డీఎం రాజు పాల్గొన్నారు.
ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో మొగిలయ్యకు వైద్యపరీక్షలు
వరంగల్ చౌరస్తా : వరంగల్ ప్రాంతీయ నేత్రవైద్యశాలలో బలగం మొగిలయ్య కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మంగళవారం దవాఖానకు చేరుకున్న ఆయనకు హాస్పిటల్ ఆర్ఎంవో డాక్టర్ భరత్కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించి, కంటి శుక్లం శస్త్రచికిత్స అవసరమని తెలిపారు. ముందుగా మధుమేహ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆరోగ్య పరిస్థితిని బట్టి శస్త్రచికిత్స చేస్తామని తెలిపారు. కాగా, మొగిలయ్య కుటుంబసభ్యులతో దవాఖాన సిబ్బంది, ఉద్యోగులు, వైద్య పరీక్షల కోసం వచ్చిన రోగులు, అటెండెంట్లు ఫొటోలు, సెల్ఫీలు దిగారు.