‘వారం రోజులుగా వానలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వర్షాలు కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ముంపు నివారణకు ప్రణాళికలు రూపొందించాం. అన్ని శాఖల ఉద్యోగులు, వైద్యారోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఎండాకాలంలోనే నాలాల పూడికతీతతో పాటు మరమ్మతులు చేయించాం.’ అని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. వరుస వానల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలపై ‘నమస్తే’కు ప్రత్యేకంగా వివరించారు.
– వరంగల్, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎంత వానలు కురిసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఇటీవల వచ్చిన వానలతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వరదలు వచ్చినా నగరంలోని ప్రజలకు ఇబ్బందులు రా కుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పా రు. వర్షాల నేపథ్యంలో వ్యవసాయం, ఆరోగ్యం, ఇతర అవసరాల పరంగా ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పరం గా చేపట్టిన చర్యలపై హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.
నమస్తే : వర్షాల నేపథ్యంలో వైద్యం పరంగా తీసుకున్న చర్యలు ఏమిటి ?
కలెక్టర్ : ప్రజల ఆరోగ్యం విషయం లో రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. సీజనల్ వ్యాధులు అనే కాకుండా, ఏడాది పొడవునా ప్రజల ఆరోగ్యం కోసం ఈ ప్రణాళిక అమలవుతున్నది. జిల్లాలోని నగర, గ్రామీణ ప్రజల కోసం వేర్వేరుగా ఏర్పా ట్లు చేశాం. వానాకాలంలోనూ పారిశు ధ్య నిర్వహణ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. జిల్లాలోని 208 గ్రామ పంచాయతీల్లోనూ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నా యి. కొత్తగా కొన్ని డెంగీ కేసులు నమోదైనా మన జిల్లాలో ఇది చాలా తక్కువగా ఉంది. డెంగీ ప్రబలకుండా ముం దస్తు చర్యలతోపాటు బాధితులకు సత్వ ర వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశాం. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయి అప్రమత్తంగా ఉన్నారు.
నమస్తే : వ్యవసాయపరంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
కలెక్టర్ : వానాకాలం సాగుపై ప్రణాళికా ప్రకారం ఏర్పాట్లు చేశాం. ప్రభు త్వం రైతులకు పెట్టుబడి కోసం రైతు బంధు అందజేస్తున్నది. జిల్లాలో గత ఏడాది 2.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రస్తుత సీజన్కు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేశాం. తాజా వానలతో జిల్లాలో వరి నాట్లు ఎక్కువగా పడుతున్నాయి. ఎరువుల సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం.
నమస్తే : సాగులో ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
కలెక్టర్ : వానలు ఈ సారి ఆలస్యమైనా దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. సాగునీటి ప్రాజెక్టులతో వచ్చిన నీటితో అత్యధిక శాతం చెరువులు నిం డాయి. జిల్లాలోని 902 చెరువుల్లో ఐదు చెరువులు మత్తడి పడుతున్నాయి. సగం చెరువులు సగం కంటే ఎక్కువగా నిండి ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో అన్ని చెరువులూ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. సాగునీటి శాఖ నివేదికల ఆధారంగా చెరువుల నిర్వహణపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ప్రాజెక్టుల నీరు, వరద నీటి నిర్వహణ ఎలా ఉండాలనేది ప్రణాళికా రూపొందించి అమలు చేస్తున్నాం.
నమస్తే : నగరంలో వరదల ముంపు రాకుండా ఎలాంటి ప్రణాళిక ఉంది?
కలెక్టర్ : భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించాం. తెరిపి ఇవ్వడంతో ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్లోకి వచ్చాం. ప్రస్తుత సీజన్లో నగరంలో అధిక వర్షాలు కురుస్తాయనే అంచనా మేరకు ప్రత్యేక ప్రణాళిక రూ పొందించాం. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వరదల నిర్వహణ ఏర్పా ట్లు చేశాం. క్షేత్ర స్థాయిలో సిబ్బంది, డీఆర్ఎఫ్టీ బృందాలను అందుబాటులో పెట్టాం. 2020 వరదల కమిటీ ప్రణాళికా ప్రకారం స్మార్ట్ సిటీ, ఇతర పథకాల కింద నగరంలో పలు పనులు చేపట్టాం. వరదలపై ముందు జాగ్రత్తగా ఎండాకాలం నుంచే నాలాల పూడిక తీత పనులు పూర్తి చేశాం. శాశ్వత పనులపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం.
నమస్తే : వరదల నివారణలో శాశ్వత ప్రణాళిక అమలు ఎలా ఉంది ?
కలెక్టర్ : స్మార్ట్ సిటీలో భాగంగా కొనసాగుతున్న స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. వానలు ఉండే ఈ రెండు నెలలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిర్మాణ పరంగా మిగిలిన ఉన్న కొద్దిపాటి పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపట్టాం. హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లిలోని ఔట్ ఫ్లో ఏరియా, రెసిడెన్సి సూల్ (సమ్మయ్యనగర్) సమీపంలోని బ్రిడ్జి వద్ద ప్రవాహ తీవ్రతను, రాజాజీనగర్ వద్ద నీటి ప్రవాహాన్ని, నయీంనగర్ నాలాను, కొత్తూరు సమీపంలోని బ్రిడ్జిని, కాకాజీకాలనీ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాం. స్మార్ట్ సిటీ పథకంలో రూ. 97 కోట్లతో చేపట్టిన పనులు ప్రణాళికా ప్రకారం కొనసాగుతున్నాయి. నిర్దేశిత గడువులోగా అవి పూర్తవుతాయి.