హనుమకొండ, ఆగస్టు 9 : వ్యవసాయ గణన (2021-22) కు సర్వం సిద్ధం చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గణన పర్యవేక్షకులు, గణకులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరుగతుల్లో కలెక్టర్ మాట్లాడారు. దేశంలో వ్యవసాయ స్థితి గతులు తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి ప్రణాళికలు, ఆర్థిక విధానాల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ గణన నిర్వహిస్తుందన్నారు. ఈ 11వ గణనను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మొదటి గణన 1970-71 సంవత్సరంలో ప్రారంభించి ఇప్పటి వరకు 10 గణనలు పూర్తి చేశారని కలెక్టర్ తెలిపారు. ఈ సర్వేకు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. జిల్లా స్థాయి కమిటీలో జిల్లా పాలనాధికారి చైర్మన్గా, సీపీవో కన్వీనర్గా డీఏఓ, హార్టికల్చర్ అధికారి, డీపీవో డీవీహెచ్వో, లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారని కలెక్టర్ తెలిపారు.
క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రత్యేక యాప్లో గణన నిర్వహిస్తారన్నారు. ఉప గణాంక, మండల ప్రణాళిక అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించి గడువులోగా పూర్తి చేసేందుకు సూచనలు చేస్తారని తెలిపారు. ఈ 11వ వ్యవసాయ గణనను మూడు దశల్లో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మొదటి దశలో జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో 100 శాతం గణన చేస్తారన్నారు. రెండోదశలో 20 శాతం రెవెన్యూ గ్రామాల్లో గణన సందర్బంగా నీటి పారుదల, పంటల వివరాలు సేకరిస్తారన్నారు. మూడో దశలో 7 శాతం రెవెన్యూ గ్రామాల్లో గణన సందర్భంగా సాగు ఖర్చులు, యంత్రాల వినియోగం, ఎరువులు, విత్తనాల ఉపయోగం, ప్రభుత్వ రాయితీ లాంటి వివరాలను సేకరిస్తారన్నారు. గతంలో చేపట్టిన గణనలో రైతుల వారీగా వివరాలు మ్యాన్యువల్గా సేకరించి నమోదు చేసేవారని, తాజాగా చేపడుతున్న ఈ గణనలో ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో స్మార్ట్ ఫోన్, టాబ్ల ద్వారా డిజిటల్ విధానంలో వివరాలను ఆర్ఎస్ఎస్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని రైతు పేరు, సామాజిక స్థితిగతి, సాగు విస్తీర్ణం, భూమి వినియోగం (వ్యక్తిగత, ఉమ్మడి, సంస్థాగత), పురుషులు, స్త్రీలు, వర్గాల వారీగా వివరాలు సరి చూసి నమోదును రెవెన్యూ గ్రామాల వారిగ సేకరిస్తారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
2015-16 సంవత్సరంలో చేపట్టిన 10వ వ్యవసాయ గణన వివరాలను కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలో 163 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయన్నారు. వాటి పరిధిలో 2,58, 604.60 ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉందని తెలిపారు. ఈ రెవెన్యూ గ్రామాల పరిధిలో 1,41,918 మంది రైతులు ఉండగా వారిలో 1,08,410 మంది సన్నకారు రైతులు, 24,435 మంది చిన్నకారు రైతులు, పాక్షిక సన్నకారు రైతులు 7,387 మంది, మధ్యకారు రైతులు 1,576 మంది, పెద్ద రైతులు 110 ఉన్నారని తెలిపారు. వీరిలో ఎస్సీ రైతులు 17,717 మంది, ఎస్టీ రైతులు 2,611 మంది, ఇతర రైతులు ( మిగిలిన కులాలు) 1,21,590 మంది ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో హనుమకొండ సీపీవో బీ సత్యనారాయణరెడ్డి, డీఏఓ, హార్టికల్చర్ ఆఫీసర్, వ్యవసాయ సహాయ సంచాలకులు, ఎంఏవోలు, ఏఈవోలు, ఎంపీఎస్వోలు, ఆర్ఐలు, ముఖ్య ప్రణాళికా అధికారి కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.