వర్ధన్నపేట, మే 2: వరంగల్ జిల్లా రైతులకు 2023-24 సంవత్సరంలో ఆరు లక్షల ఆయిల్పామ్ మొక్కలను పంపిణీ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మండలంలోని నల్లబెల్లి గ్రామంలో రైతు సాగు చేసుకుంటున్న ఆయిల్పామ్ మొక్కలను ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంగెం మండలం రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన నర్సరీలో ఉద్యాన శాఖ అధికారులు ఆయిల్పామ్ మొక్కలను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. వాణిజ్య పంటలను మాత్రమే సాగు చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన పెట్టుబడితో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రజలకు కూడా నాణ్యమైన ఆహారం, ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆయిల్పామ్ తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించిందన్నారు. దీంతో ఈ ఏడాది జిల్లాలో రైతులు సుమారు 3200 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు..
మూడేళ్ల వరకు ఎలాంటి పంట దిగుబడి రాదని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ. 30 వేల వరకు అందించేందుకు సిద్ధంగా ఉందని కలెక్టర్ వివరించారు. మూడేళ్ల తర్వాత మంచి దిగుబడి వచ్చి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటను కూడా నేరుగా మిల్లుల నిర్వాహకులు కొనుగోలు చేసేలా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. అలాగే, రైతులకు నిత్యం సలహాలు, సూచనలు ఇస్తూ పంటకు నష్టం జరుగకుండా ఉ ద్యాన శాఖ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అలాగే, ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్పామ్ కోసం ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. రైతులు ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు తీసుకొని పంటలను సా గు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆమె వెంట ఎంపీ పీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి, ఉద్యాన శాఖ అధికారి సుష్మిత, గ్రామస్తులు ముత్యం సంపత్, మాధవరావు, వాసుదేవరావు, రైతులు పాల్గొన్నారు.
ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరగాలి..
సంగెం : జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. రాంచంద్రాపురం నర్సరీలోని ఆయిల్పామ్ మొక్కలను మంగళవారం ఆమె పరిశీలించారు. మొక్కల సాగు విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎప్పటి నుంచి మొక్కలు ఇచ్చే అవకాశం ఉందని అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచడానికి నర్సరీలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. రాంచంద్రాపురం గ్రామంలోని 40 ఎకరాల్లో రాంచరణ్ ఆయిల్పామ్ ఇండస్ట్రీ ప్రతినిధులు వివిధ దేశాల నుంచి 6 లక్షల ఆయిల్ పామ్ విత్తన మొలకలను దిగుమతి చేసుకుని నర్సరీల్లో పెంచుతున్నారని; జిల్లాలో 3,600 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారని చెప్పారు. ప్రస్తుతం నర్సరీలో 6 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సాగు కోసం ఎక్కువ మంది రైతులను గుర్తించి క్లస్టర్, మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ డీడీ శ్రీనివాస్, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వర్రావు, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, రాంచరణ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీశ్, హార్టికల్చర్ హెచ్వోలు శంకర్, తిరుపతి, సుష్మిత, లోహిత ఎంపీటీసీ అడ్డగట్ల దుర్గారావు, కందకట్ల నరహరి పాల్గొన్నారు.