నర్సంపేటరూరల్, అక్టోబర్ 17: వాహన తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య ఆదేశించారు. మండలంలోని మహేశ్వరం గ్రామ శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును మంగళవారం ఆమె పరిశీలించారు. తొలుత చెక్పోస్టుకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి సంతకం చేశారు. ఈ సందర్భంగా పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను వెంటనే సీజ్ చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం అక్రమ రవాణా జరుగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. చెక్పోస్టు వద్ద రిజిస్టర్లను విధిగా మెయింటెన్ చేయాలన్నారు. ఆమె వెంట నర్సంపేట ఆర్డీవో కృష్ణవేణి, ఏసీపీ పుప్పాల తిరుమల్, తహసీల్దార్ కే విశ్వప్రసాద్, నర్సంపేట టౌన్ సీఐ సుంకరి రవికుమార్, మున్సిపల్ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
నర్సంపేట: ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఉన్న పోలింగ్ బాక్స్లు, స్ట్రాంగ్స్ రూమ్లను మంగళవారం ఆమె పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై సూచనలు, సలహాలు అందించారు. పోలింగ్ సామగ్రిని భద్రపరిచేందుకు అవసరమై గదులను పరిశీలించారు. ఓటరు జాబితాపై పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేయాలన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ బూత్లకు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నుంచే పోలింగ్ సిబ్బందిని పంపించేందుకు వివిధ రూట్లను సిద్ధం చేయాలని కోరారు. ఎన్నికల నిబంధనలను అధికారులు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఆమె వెంట మార్కెట్ అధికారి ప్రసాదరావు ఉన్నారు.