వరంగల్ చౌరస్తా, ఆగస్టు 28 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా నిలుస్తున్న ఎంజీఎం దవాఖాన మరో మైలురాయిని దాటింటి. సోమవారం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను ఎంజీఎం అనుసంధానంగా పని చేస్తున్న కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రారంభించింది. వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతానికి చెందిన కౌటం శ్రవన్, సృజన దంపతుల కుమారుడు కౌటం కుశన్(3)కు ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ పరుశురాం, హైదరాబాద్ కోఠి ఈఎన్టీ హాస్పిటల్ మెంటార్ సర్జన్ డాక్టర్ శంకర్, డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ పరుశురాం మాట్లాడుతూ జూలై నెలలో జరిగిన ఆరోగ్యశ్రీ ట్రస్టు కమిటీ సమావేశంలో హైదరాబాద్ కోఠి హాస్పిటల్లో మాత్రమే నిర్వహిస్తున్న కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను ఎంజీఎం దవాఖానలో సైతం నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ మేరకు పుట్టుకతో వినికిడి లోపం కలిగి ఉన్న చిన్నారులకు శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆగస్టు 24న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరిన కౌటం కుశన్ను ఎంపిక చేసి, విజయవంతంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు.
త్వరలోనే అతడికి స్పీచ్ థెరపీ విధానం ద్వారా మాట్లాడేలా చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. వినికిడి శక్తి లోపం కారణంగా శబ్దాలను గుర్తించకపోవడం వల్ల చాలా మంది చిన్నారులు మూగ, చెవిటి దివ్యాంగులుగా జీవిస్తున్నారన్నారు. వారి జీవితాల్లో వెలుగు నింపడానికి సృష్టించిందే ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ పరికరమని తెలిపారు. రూ.5.5లక్షల విలువైన ఈ యంత్రం వినికిడి లోపంతో పుట్టిన చిన్నారులకు ఒక వరమన్నారు. శస్త్రచికిత్స ద్వారా చెవిలో ఏర్పాటు చేసిన ఈ యంత్రం శ్రవణనాడి ద్వారా మెదడుకు సంకేతాలను పంపించి శబ్దాలను గుర్తించేలా చేస్తుందన్నారు. దీంతో చిన్నారులు తమ కంఠస్వరం ద్వారా తిరిగి శబ్దాలను సృష్టించి మాట్లాడగలిగేలా చేయవచ్చన్నారు. సుమారు రూ.పది లక్షల ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యసేవలను తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందిస్తుందని పేర్కొన్నారు. మొదటి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందంలోని డాక్టర్ మధుసూదన్రెడ్డి, డాక్టర్ లక్పతి, డాక్టర్ విజయ్, అనస్తీషియా వైద్యులు డాక్టర్ ప్రవీణ్కుమార్, డాక్టర్ మురళి, డాక్టర్ చంద్రశేఖర్ కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాస్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్రావు, జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి డాక్టర్ కమల్చంద్నాయక్, తదితరులు శస్త్రచికిత్సను పర్యవేక్షించారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యస్థితిని పరిశీలించారు.