ములుగు, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వంద రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లో మేడారం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్పై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మేడారం మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతోపాటు పార్కింగ్ వసతులు కల్పించాలన్నారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని జంపన్నవాగులో నీరు నిలిచేలా ఏరియాల వారీగా చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ వారంలో మేడారానికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతానని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.
మేడారం అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ను గౌరవించడంతోపాటు స్థానికంగా ఉన్న నిపుణులు, పూజారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. సమీక్షలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.