Supreme Court : విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్నప్పుడు, అవి ఉద్రిక్తంగా మారినప్పుడు వారిపై దూకుడుగా వ్యవహరించి, అణిచివేసే బదులు సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు భద్రతా బలగాలకు సూచించింది. వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, వీలైనంతవరకు సంయమనంతోనే వ్యవహరించాలని సూచించింది. జూలై 20న సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సంసద్ చలో సందర్భంగా తలెత్తిన ఘర్షణలు, హింస నేపథ్యంలో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, వి మోహన ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. ఇప్పటికే ఈ అంశంపై దాఖలైన పాత పిటిషన్లతో కలిపి, కొత్త పిటిషన్ను కూడా కోర్టు విచారించనుంది. రిటైర్డ్ ఎయిర్ఫోర్స్ అధికారి మనీష్ కుమార్ సోలంకి తాజా పిటిషన్ దాఖలు చేశాడు. ఆయన తరఫున రిజ్వాన్ అహ్మద్ కోర్టులో వాదనలు వినిపించాడు. ఆందోళన జరిగి రెండు వారాలు గడుస్తున్నా, ఈ ర్యాలీ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోలేదని, జవాబుదారీతనం కొరవడిందని రిజ్వాన్ పిటిషన్లో పేర్కొన్నాడు. ఇప్పటికీ నిర్వాహకులు మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని తన పిటిషన్లో కోరాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆందోళనల సందర్భంగా ఎవరైనా తప్పుడు ప్రచారం ద్వారా రాళ్లు రువ్వే చర్యలకు పాల్పడ్డా సరే.. విశాల దృక్పథంతో ఆలోచించి, వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలి. వారికి సలహా, కౌన్సెలింగ్ కావాలి. వారితో దూకుడుగా వ్యవహరిస్తే అది మరింత దిగజారి, ఇంకా హింసకు దారితీయవచ్చు.
అలాంటిది జరగకుండా చూడాలి. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. దీంతో యువత హింసవైపు వెళ్లకుండా ఉంటారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, వారిని శాంతింపజేయడమే మంచిది. అందులో అత్యంత కీలకమైంది వారి వాదన వినడం. వారి ఆవేదన విని, ఎందుకు అరుస్తున్నారో అర్థం చేసుకోవాలి. కానీ, ఇదంతా శాంతి భద్రతల్ని పరిరక్షించే భద్రతా బలగాలకే వదిలేయాలి. మీకన్నా, మాకన్నా ఈ విషయంపై వారికే ఎక్కువ తెలుసు’’ అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో పార్లమెంట్ వైపు ఆందోళనకారులు దూకుడుగా వెళ్లడాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయం వంటిదని, అలాంటి దేవాలయం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత భద్రతా బలగాలపై ఉంటుందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.