TTD | తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అంకురార్పణ సోమవారం రాత్రి నిర్వహించారు. నేటి (మంగళవారం) సాయంత్రం 6:21 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం ఉంటుంది. స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేందు సీఎం చంద్రబాబు నాయుడు సాయంత్రం 5:30 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ హెలిప్యాడ్కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారు. బేడి ఆంజనేయ స్వామని దర్శించుకుని, శిరోవస్త్రం స్వీకరిస్తారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి బ్రహ్మోత్సవ పూజలను ప్రారంభిస్తారు.
బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్భంగా నేడు ధ్వజారోహణం, పెద్దశేష వాహనం, సెప్టెంబర్ 19న గరుడ వాహనం, సెప్టెంబర్ 22న రథోత్సవం రథయాత్ర నిర్వహిస్తారు. సెప్టెంబర్ 23న చక్రస్నానం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా నేటి నుంచి ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు (ప్రొటోకాల్ ప్రముఖలు మినహా), ప్రత్యేక దర్శనాలు, శ్రీవాణి దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికార వర్గాలు తెలిపాయి. 20వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

Ankurarpana
ఈ ఉత్సవం శ్రీవేంకటేశ్వరస్వామికి చేసే అత్యంత వైభవోపేతంగా తొమ్మిది రోజులు నిర్వహించే కార్యక్రమం. మానవాళిని రక్షించినందుకు స్వామివారికి కృతజ్ఞతగా బ్రహ్మదేవుడు తొలిసారి ఈ ఉత్సవాలు నిర్వహించాడని, అందుకే వీటిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. వీటికి చారిత్రక ఆధారాలుగా ఆలయ గోడలపై లభించిన 600కి పైగా శిలాశాసనాలు నిలుస్తున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. శ్రీవారి (Srivari) ఆలయానికి సంబంధించిన విశేషాలు, టీటీడీ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యతను తెలియజేసేలా ఈ ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఫొటో ప్రదర్శన, ఇతర ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి భక్తులకు అందుతున్న సమాచారాన్ని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అలాగే అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.