బూర్గంపహాడ్, ఆగస్టు 05 : ఈ నెల 10న బూర్గంపహాడ్ మండల కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం బూర్గంపహాడ్లో ఐకేపీ మహిళలతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తుందని, 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు మార్చి యాజమాన్యాలు, పారిశ్రామిక ఫ్యాక్టరీలకు కార్మికులను బానిసలు చేస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, బ్రిటీష్ పాలన కంటే మోదీ పాలన దారుణంగా ఉందన్నారు. కార్మికులు, విద్యార్ధులు, రైతులు, వ్యవసాయ కార్మికులు అంతా ఏకమై ఈ 10న మండల కేంద్రంలో జరిగే జైల్ భరోలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ దీపికలు సుజాత, నక్షత్రమ్మ, లక్ష్మి, ఉమ, నాగమణి, లక్ష్మీకాంత పాల్గొన్నారు.