మహబూబాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 27న మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. శనివారం రాత్రి మంత్రి, ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు మానుకోట పట్టణంలోని శనిగపురం వద్ద సభాస్థలిని పరిశీలించారు. కాగా, సీఎం కేసీఆర్ రాకతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరుగనుంది. ఇప్పటికే మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకరనాయక్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనేందుకు వస్తుండడంతో బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సభలో మాట్లాడనున్నారు.
భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 21 : భూపాలపల్లిలోని కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద శనివారం సాయంత్రం భూపాలపల్లి సీఐ రాం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై శ్రావణ్ కుమార్ వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీలో నల్ల రవి వద్ద రూ.1.50లక్ష లు, సాద సురేందర్ రెడ్డి వద్ద 165 గ్రాముల బంగారు అభరణాలు లభించగా, సీజ్ చేశారు. వాటిని భూపాలపల్లి రిటర్నింగ్ ఆఫీసర్కు అప్పగించినట్లు తెలిపారు.