వరంగల్, జనవరి 17 : కంటి వెలుగుకు జిల్లా యంత్రాగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గురువారం జిల్లాలో మంత్రులు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కంటి వెలుగుపై సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించింది. 45 వైద్య బృందాలను నియమించి, 282 కేంద్రాలలను ఏర్పాటు చేసింది. గురువారం నుంచి షురూ కానున్న కంటి పరీక్షల కేంద్రాల వద్ద మౌలిక వసతుల పనులు చక చకా సాగుతున్నాయి. నగరంలో బల్దియా అధికారులు కంటి వెలుగు కేంద్రాల వద్ద వసతులు కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రజలను కంటి వెలుగు శిబిరాలకు తీసువచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ ఆహ్వాన పత్రాలను అందజేస్తున్నారు. రోజూ కంటి వెలుగు క్యాంపులో అర్బన్లో 400 మందికి, రూరల్లో 300 మందికి పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. దీని కోసం ప్రత్యేకంగా వైద్యులతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. ప్రతి బృందానికి ఆటో రిఫ్రోక్టోమీటర్, ట్రయల్ లెన్స్ బాక్స్లను అందజేశారు. ఆధునిక వైద్య పరికరాలతో కంటి పరీక్షలు నిర్వహించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
రేపటి నుంచి కంటి పరీక్షలు
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో గురువారం నుంచి ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ బుధవారం ఖమ్మంలో ప్రారంభించనున్నారు. మరుసటి రోజు నుంచి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 45 వైద్య బృందాలు వంద పని దినాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయనున్నాయి. దీని కోసం ఇప్పటికే జిల్లా యంత్రాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కంటి పరీక్ష కేంద్రాల గుర్తింపుతో పాటు ఆయా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన పనులు చక చకా సాగుతున్నాయి. ఒక్కో కంటి పరీక్ష కేంద్రానికి ఒక్కో నోడల్ అధికారిని నియమించారు. కంటి పరీక్షల కేంద్రాల వద్ద ఏర్పాట్లను నోడల్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో కంటి పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. నిరంతరం కలెక్టర్లు, డీఎంహెచ్వోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గదర్శనం చేస్తున్నారు.
45 వైద్య బృందాల ఏర్పాటు
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 45 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో పది మంది వరకు సిబ్బంది పనిచేయనున్నారు. మెడికల్ అధికారి, పారమెడికల్ ఆప్తాల్మిక్ అధికారి, డాటా ఎంటీ ఆపరేటర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశ వర్కర్లను నియమించారు. గ్రేటర్ పరిధిలో 20 వైద్య బృందాలు, పరకాల మున్సిపాలిటీ పరిధిలో ఒక బృందం, రూరల్ ప్రాంతంలో 24 బృందాలు వంద రోజుల పాటు కంటి పరీక్షల క్యాంపులు నిర్వహించనున్నారు. వీటితో పాటు అదనంగా మరో రెండు బఫర్ వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. 100 పనిదినాల పాటు నిర్వహించే కంటి వెలుగులో ప్రతి ఇంటిలో కంటి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం కార్యాచరణ చేసింది. 45 వైద్య బృందాలు రోజు 45 కేంద్రాల్లో క్యాంపులు నిర్వహిస్తాయి. వంద రోజులు కార్యక్రమంలో 282 క్యాంపుల ద్వారా ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 208, పట్టణ ప్రాంతాల్లో 74 క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలో కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో బల్దియా, మెప్మా సహకారంతో వైద్య ఆరోగ్య శాఖ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ రాజ్ శాఖ సహకారం అందిస్తోంది. రెండు శాఖలను సమన్వయం చేసుకుంటూ వైద్య, ఆరోగ్య శాఖ కంటి వెలుగును విజయవంతం చేసేలా ముందుకు పోతున్నది.
57,780 కంటి అద్దాలు సిద్ధం
కంటి వెలుగులో పరీక్షలు చేసుకున్న వారికి వెంటనే కంటి అద్దా లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే జిల్లాకు 57,780 కంటి అద్దాలు వచ్చాయి. కంటి వెలుగు పరీక్ష కేంద్రాల వద్ద దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన వారికి వెంటనే కంటి అద్దాలు ఇవ్వనున్నారు. రెండు చూపుల కంటి అద్దాలను పరీక్షలు నిర్వహించిన వారం రోజుల్లో ఆశ వర్కర్లు ఇంటి వద్దకు వెళ్లి అందజేయనున్నారు. కంటి వెలుగు పరీక్షా కేంద్రాల్లో మందులతో పాటు ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కంటి పరీక్షల కోసం కొత్తగా 33 ఆటో రిఫ్రోక్టోమీటర్ యంత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. పాతవి 12 అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ట్రయల్ లెన్స్బాక్స్లు 17 ఉండగా మరో 30 కొత్త వాటిని ప్రభు త్వం జిల్లా కేంద్రానికి పంపించింది. ప్రతి బృందానికి ఆటో రిఫ్రోక్టోమీటర్తో పాటు టయల్ లెన్స్ బాక్స్ పరికరాలను అందజేశారు.
ఇంటింటికీ ఆహ్వానం
కంటి వెలుగు ఆహ్వాన పత్రికను ప్రతి ఇంటికీ ఆశ వర్కర్లు అందజేస్తున్నారు. కంటి వెలుగు ఆహ్వాన పత్రికపై కంటి పరీక్షల కోసం వెళ్లాల్సిన కేంద్రం, పరీక్షల కోసం రావాల్సిన తేదీ, సమయం వేసి అందజేస్తున్నారు. కంటి పరీక్షల కేంద్రానికి వచ్చే వారు ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీకార్డులలో ఏదైన ఒకటి తీసుకు రావాలని ఆహ్వాన పత్రికలో స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లాకు సుమారు 3 లక్షల ఆహ్వాన పత్రాలు వచ్చాయి. కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి వాటిని అందచేస్తున్నారు.
క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి ఒక్కరూ కంటి వెలుగు క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఇంటిలో కంటి పరీక్షలు నిర్వహించేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలు చేశాం. 24 వైద్య బృందాలను ఏర్పాటు చేశాం. అదనంగా మరో రెండు బృందాలను సిద్ధంగా ఉంచాం. మొదటి విడుతలో కంటి పరీక్షలు చేసుకున్న వారంతా మళ్లీ రెండె విడుతలో కూడా పరీక్షలు చేసుకోవచ్చు. దృష్టిలోపం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించి కొత్త అద్దాలు అందజేస్తాం. ప్రతి ఇంటికీ ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నాం. ఒకే సారి కంటి పరీక్షల కేంద్రాల వద్దకు రాకుండా ప్రణాళికాబద్ధంగా ఆహ్వన పత్రికలపై తేదీ, సమయం వేసి అందిస్తున్నాం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 45 బృందాలు కంటి వెలుగు కార్యక్రమంలో 100 రోజుల పాటు క్యాంపులు నిర్వహించి కంటి పరీక్షలు నిర్వహిస్తాయి.
– డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్వో
మరోసారి కంటి వెలుగు పెట్టడం సంతోషకరం
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని పెట్టడం సంతోషకరం. గతంలో నేను కంటి వెలుగులో పరీక్షలు చేసుకుంటే అద్దాలు ఇచ్చారు. అవి ఎంతో ఉపయోగపడ్డాయి. మళ్లీ కళ్ల పరీక్షలు చేయించేందుకు శిబిరాలను ఏర్పాటు చేయడం పేద, మధ్యతరగతి ప్రజలకు చాలా తోడ్పాటునిస్తుంది. కంటి సమస్యలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ సర్కారు ప్రజల నేత్రాలపై శ్రద్ద పెట్టి ఉచితంగా పరీక్షలు చేయించడం మంచి పరిణామం. వేలాది రూపాయలు పోసి కంటి పరీక్షలు చేయించుకోలేని పేదలకు ఇది వరం. నేను తప్పకుండా మళ్లీ కంటి పరీక్ష చేయించుకుంటాను.
– దాసరి రమేశ్, టైలర్, శాయంపేట