రాష్ట్రంలోనే అత్యధికంగా గిరిజనులు ఉండే మానుకోట, సమైక్యపాలనలో అభివృద్ధికి ఆమడ దూరాన ఉండేది. అధికారుల పర్యవేక్షణ లేక.. ప్రభుత్వ ఫలాలు దరిచేరక ఈ ప్రాంత ప్రజల జీవితాలు దుర్భరంగా గడిచేవి. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇక్కడి తండాల్లో ఇబ్బందులు స్వయంగా తెలుసుకొని స్వపరిపాలనతోనే అభివృద్ధి సాధ్యమని స్వరాష్ర్టాన్ని తెచ్చారు. ఒకప్పుడు రెవెన్యూ డివిజన్గా ఉన్న మానుకోటను సీఎం కేసీఆర్ 2016 అక్టోబర్ 11న జిల్లాగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక చొరవతో నిధుల వరద పారించారు. రూ.వందల కోట్లు వెచ్చించి ప్రగతి పనులు చేయించారు. గిరిబిడ్డలకు మెరుగైన విద్య, వైద్య సేవలను దరిచేర్చారు. సరికొత్త సర్కారు కార్యాలయాలు, సకల వసతులతో మహబూబాబాద్ను సుందరంగా ముస్తాబు చేశారు. జిల్లాకే తలమానికంగా రూ.62.50కోట్లతో సమీకృత కార్యాలయ సముదాయాన్ని నిర్మించి రేపటినుంచే మానుకోట ప్రజలకు అందుబాటులోకి తేబోతున్నారు.
మహబూబాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ మానుకోట అభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. వందల కోట్లు వెచ్చించి జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. మున్సిపాలిటీల్లో రహదారుల విస్తరణ పనులు, కొత్తగా కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.62.50 కోట్లు కేటాయించారు. అలాగే రూ.40కోట్లతో మెడికల్ కళాశాల, రూ.3కోట్లతో జిల్లా గ్రంథాలయం నిర్మించారు. మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. జిల్లాకేంద్రంలో ఎస్పీ కార్యాలయం, సమీకృత మార్కెట్ పనులు తుదిదశకు వచ్చాయి. అలాగే మరిపెడలో ఇండోర్ స్టేడియం, మార్కెట్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. వందల కోట్లతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఐటీడీఏ నుంచి నిధులు వెచ్చించింది. తారురోడ్లను నిర్మిస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఇప్పటికే బీఫార్మసీ కళాశాల, ఎస్టీ, ఎస్సీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు అనేకం వచ్చాయి. వీటితో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. 100 పడకలుగా ఉన్న ఏరియా దవాఖానను 350 పడకలకు పెంచి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని మానుకోట తెలంగాణ వచ్చాక అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
తెలంగాణ రాకముందు తాగునీటి కోసం జిల్లా ప్రజలు అల్లాడేవారు. బిందె నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన రోజులున్నాయి. ఈ పరిస్థితులను గుర్తించిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి ప్రారంభమైన ప్రాజెక్టును రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మించగా 22 మండలాల పరిధిలోని 1,683 ఆవాస ప్రాంతాలకు సురక్షిత తాగునీరు సరఫరా అవుతున్నది. 2,500 కిలోమీటర్ల మిషన్ భగీరథ పైపులైన్ పనులు పూర్తి చేశారు. రోజుకు 140 ఎంఎల్టీ నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఇవికాకుండా జిల్లాలో 855 పాఠశాలలు, 1,269 అంగన్వాడీ కేంద్రాలు, 80 రైతు వేదికలు, 365 వైకుంఠధామాలు సహా ఇప్పటివరకు పూర్తి అయిన డబుల్ బెడ్రూం ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారు.
మానుకోట జిల్లా కొత్త కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభానికి ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాగా ఏర్పాటు చేసింది. జిల్లాకేంద్రంలోని సాలార్తండా వద్ద ఎన్హెచ్-365ని ఆనుకొని రూ.62.50 కోట్లతో కలెక్టరేట్ను నిర్మించారు. జిల్లా యంత్రాంగం యుద్ధప్రతిపాదికన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పూర్తి చేసింది. అలాగే కలెక్టరేట్ ముందు అధునాతన సీసీరోడ్లు నిర్మించారు. జాతీయ ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ భవనం లోపలికి సీసీరోడ్లు, కలెక్టరేట్ ముందుభాగంలో గార్డెన్లను నిర్మించి, మొక్కలను నాటి కలెక్టరేట్ను అందంగా తీర్చిదిద్దారు. ఇందులో కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, పరిపాలనాధికారి (ఏవో) కార్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలన్నీ ఒకేచోట ఉండేలా నిర్మించారు. కలెక్టరేట్కు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలతో పాటు అధికారులు, సిబ్బంది వాహనాలతో పాటు కార్యాలయాలకు వచ్చే వీఐపీల వాహనాలను నిలిపేందుకు విశాలమైన స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
జిల్లావ్యాప్తంగా మొత్తం 1,622 చెరువులు ఉన్నాయి. వీటిలో మొత్తం నాలుగు విడుతలుగా పూడికతీత, తూములకు మరమ్మతులు చేశారు. ఫలితంగా నీటి సామ ర్థ్యం పెరిగి 98,699 ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 కాల్వల ద్వారా దాదాపు 2,05,055 ఎకరాలు ఆయకట్టు సాగులో ఉంది. అలాగే 18 ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిఫ్ట్ స్కీముల ద్వారా 8,183 ఎకరాలు సాగులో ఉంది. డీబీఎం-48 ప్రధాన కాల్వ ద్వారా 1,18,174 ఎకరాలు, డీబీఎం-40 కాల్వ ద్వారా గూడూరు మండలంలో 6,022 ఎకరాలు సాగులో ఉంది. అలాగే సీతారామ ప్రాజెక్టు ద్వారా డోర్నకల్, గార్ల మండలాల్లోని రైతులకు మేలు జరుగనున్నది. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసిన అధికారులు త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే డోర్నకల్లో 612 ఎకరాలు, గార్ల మండలంలో 250 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
తెలంగాణ ఏర్పడక ముందు గ్రంథాలయాలు పెంకుటింట్లో రెండు గదుల్లో ఉండేది. జిల్లా కేంద్రంలో శ్రీనివాస టాకీస్ వెనుకభాగంలో ఉన్న పాత లైబ్రరీ స్థానంలో రూ.3 కోట్లతో జీప్లస్-2 భవనాన్ని కొత్తగా నిర్మించారు. గ్రౌండ్ఫ్లోర్లో ఐదు షాపింగ్ కాంప్లెక్స్లు, గ్రంథాలయానికి వచ్చే పాఠకుల వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలాగే వాచ్మెన్ ఉండేందుకు ప్రత్యేక గదులు కేటాయించారు. మొదటి అంతస్తులో గ్రంథాలయ కార్యాలయం, చైర్మన్, కార్యదర్శి గదులు నిర్మించారు. ఇందులోనే తాగునీటితో పాటు పురుషులు, మహిళలకు వేర్వేరుగా టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. రీడింగ్ రూము, వరండాలో అన్ని రకాల తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ పత్రికలు చదివేందుకు ఏర్పాట్లు చేశారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక గదితో పాటు ప్రొజెక్టర్ అమర్చారు. రెండో అంతస్తులో స్టోర్ రూమ్తో పాటు పుస్తకా లను నిల్వ చేసేందుకు ర్యాక్లను ఏర్పాటుచేశారు. పుస్తకాల కోసం ప్రత్యేక గదితో పాటు 10 కంప్యూటర్లతో గదిని నిర్మించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వచ్చే జలాలతో చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన పూడికతీత పనుల వల్ల చెరువుల్లో నీటిమట్టం పెరిగింది. అంతేకాకుండా వాగులపై జిల్లా వ్యాప్తంగా సుమారు 40 చెక్డ్యాముల నిర్మాణంతో ఏడాది పొడవునా సాగునీరు ఉంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక పంటే అరకొరగా పండేది. యాసంగి ముచ్చటే ఉండేది. అలాంటి కరువు నేలలో సాగునీరు ఏరులై పారుతుంది. జిల్లాలో ఎక్కడ చూసినా భూమికి ఆకుపచ్చని రంగు వేసినట్లుగా మారింది. తెలంగాణ రాకముందు ఉపా ధి కోసం వలస వెళ్లిన వారు సీఎం కేసీఆర్ అందజే స్తున్న 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు పథకాల ద్వారా తిరిగి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఒకప్పుడు జిల్లా నుంచి వలస వెళ్లిన వారు తిరిగి వచ్చి ఉపాధి పొందుతున్నారు. వలసలు ఆగిపోయి ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి వలస వచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మానుకోట జిల్లాగా ఏర్పాటు కావడంతో సుపరిపాలన ప్రజలకు మరింత చేరువైంది.