‘జనగామ నియోజకవర్గంలో పల్లా ఎంట్రీతోనే ఆయన విజయం ఖాయమైంది.. ఇక్కడి మట్టి బిడ్డ రాజేశ్వర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి సిరిసిల్ల, సిద్దిపేట తరహా జనగామ అభివృద్ధికి తోడ్పాటునందించండి’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జనగామలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ శ్రేణుల సమన్వయ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య, ఎమ్మె ల్సీ బస్వరాజ్ సారయ్యతో కలిసి మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ‘ఇద్దరం ఒకే హైట్లో ఉన్నాం..సేమ్ ైస్టెల్లో అభివృద్ధి కూడా ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నా తమ్ముడు పల్లాను నిండు మనసుతో ఆశీర్వదించండి.’ అని నియోజకవర్గ ప్రజలను కోరారు.
జనగామ, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ)/జనగామ రూరల్/ జనగామ చౌరస్తా : జనగామ నియోజవకర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన బుధవారం జనగామలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ శ్రేణుల సమన్వయ సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ‘జనగామ అంటే కేసీఆర్కు చాలా ప్రేమ.. ఏ సందర్భం వచ్చినా ఇక్కడి ఉద్యమాలు, ఉద్యమకారుల గురించి పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడుతారు’ అని గుర్తు చేశారు. 2001లోనే జనగామ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గులాబీజెండా ఎగిరిందని, తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి జనగామ అడ్డా అని అన్నారు. పల్లాను ముత్తిరెడ్డి నిండు మనస్సుతో ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. ముత్తన్న ఆశీస్సులతో పల్లా గెలుపు పక్కా అయిందని సంతోషం వ్యక్తం చేశారు.
నా తమ్ముడు పల్లాను ఆశీర్వదించండి : ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
‘సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తమ్ముడుపల్లా రాజేశ్వర్రెడ్డిని నిండుమనసుతో ఆశీర్వదించండి. 2009 తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు నాతో పాటు కలిసి పనిచేస్తూ, నాకు సహకరించిన ప్రతిఒక్కరికి పేరు పేరునా పాదాభివందనాలు..’ అని టీఆర్ఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఒకనాడు బువ్వకు నోచుకోని జనగామ, ఇవాళ సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో జిల్లా ఏర్పాటు చేసుకున్నామని, అద్భుతమైన కలెక్టరేట్ను నిర్మించుకున్నామని, కోర్టు, మెడికల్ కళాశాల, హాస్పిటల్ను తెచ్చుకున్నామని, చేర్యాలను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. నియోజకవర్గంలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో రూ.60కోట్ల నిధులు సాధించుకున్నామని చెప్పారు. జనగామ నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు రానంత అత్యధిక మెజార్టీని పల్లా రాజేశ్వర్రెడ్డికి ఇచ్చి సీఎం కేసీఆర్కు ఈ గెలుపును కానుకగా ఇద్దామని పేర్కొన్నారు. రూ.10 కోట్లతో రంగప్ప చెరువు నీటి మళ్లింపు కాలువ, రూ.5 కోట్లతో బాణాపురం బతుకమ్మకుంట అభివృద్ధి చేస్తామని చెప్పారు. కుందారం రోడ్డు, చేర్యాల ఆకునూరు రోడ్డులో స్టేడియం నిర్మించాల్సిన అవసరముందన్నారు.
దూల్మిట్ట, కొమురవెళ్లి మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని, ఈ పనులన్నీ పల్లా పూర్తి చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాడనే నమ్మకముందన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా కారు గుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని, జనగామ నుంచి పల్లాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనగామ ప్రాంతం సీఎం కేసీఆర్ నేతృత్వంలో సస్యశ్యామలంగా మారిందని ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాను గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు.
జనగామను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
– బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా కోసం ఏవిధంగా పోరాటం చేశామో అభివృద్ధికి కూడా అలాగే కృషి చేస్తానని జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రతి గ్రామానికి పోరాట చరిత్ర ఉందన్నారు. ఇలాంటి జనగామ ప్రాంతానికి సీఎం కేసీఆర్ ఆశీర్వదించి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపారని, జనగామకు సేవ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. ఇక్కడ ప్రతి గ్రామం, వార్డును ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, మిగిలిన పనులను ముత్తిరెడ్డి సహకారంతో పూర్తిచేస్తానని చెప్పారు. త్వరలోనే చేర్యాలను రెవెన్యూ డివిజన్గా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తారని చెప్పారు.
ఇన్ని ఇస్తున్న సీఎం కేసీఆర్, చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయరా ఆలోచించాలన్నారు. ఏప్రాంతానికి ఏమవసరం ఉందో గుర్తించి 33జిల్లాలు చేసిన కేసీఆర్, చిన్న పనులు చేయరా అని ప్రతిపక్షాలకు సూచించారు. జనగామకు మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి అండగా ఉన్నారని, మా అన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారంతో జనగామను మరింత అభివృద్ధి చేస్తానని, ఈ నెల 16న సీఎం కేసీఆర్ సభను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జల్లి సిద్ధయ్య, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, అంకుగారి స్వరూప, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, రైతు సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, జనగామ, చేర్యాల మార్కెట్ చైర్మన్లు బాల్దె సిద్ధిలింగం, సుంకరి మల్లేశం, కొమురవెల్లి ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఎంపీపీలు బద్ధిపడిగె కృష్ణారెడ్డి, మేకల కళింగరాజు, నాగజ్యోతి, కీర్తన, కరుణాకర్, గోవర్ధన్, హరిత, జడ్పీటీసీలు నిమ్మతి దీపిక, శ్రీనివాస్, సిద్ధప్ప, పద్మజ, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు గౌస్, పట్టణ, మండలాధ్యక్షులు మల్లేశ్, సంతోశ్, యాదగిరి, జగన్మోహన్రెడ్డి, సురేశ్, చంద్రారెడ్డి, యాదగిరి, సురేశ్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
గత ప్రభుత్వాలు నాశనం చేస్తే.. సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసిండు : మంత్రి ఎర్రబెల్లి
‘నాడు నీటి కరువుతో తల్లడిల్లిన జనగామ నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నది.. అందుకు సీఎం కేసీఆర్ కృషి ఉన్నది. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏట్లా ఉండే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎట్లా ఉన్నదో కండ్లరా చూస్తున్నాం’ అని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇక్కడి నీటి కష్టాలను చూసి కాలువలు, చెక్డ్యాంల ద్వారా ప్రతి గ్రామానికీ సీఎం కేసీఆర్ నీరందించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. మంత్రి హరీశ్రావు పట్టుబట్టి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడి ప్రజలకు నీటిని అందించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ర్టాన్ని నాశనం చేసిందని, వారు ఇచ్చిన హామీలు, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అందిరినీ సమానంగా చూస్తారని కేబినెట్ హోదా కలిగిన పోస్టులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి, తాటికొండ రాజయ్యకు ఇచ్చారని చెప్పారు. పల్లా గెలుపుకోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్తోనే పేదల సంక్షేమం : మంత్రి సత్యవతి రాథోడ్
పేదల సంక్షేమం కావాలంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎంగా కేసీఆరే గెలవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పేదలు, రైతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఇలా అందరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, దళిత బంధు, ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కారు గుర్తుకు ఓటేసి పల్లాను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
లక్ష మందితో సభ..
సీఎం కేసీఆర్ 16న జనగామ వస్తున్నారని, లక్షమందితో సభకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. 15న బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన తెల్లారే 16న కేసీఆర్ జనగామకు వస్తున్నారని, తెలంగాణలో ఇది రెండోసభ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి ఎన్నికల సభ అని చెప్పారు. జనగామను జిల్లా చేసి బ్రహ్మాండమైన కలెక్టరేట్ నిర్మించి, మెడికల్ కాలేజీ ఇచ్చిన అధినేత కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ బోనాలు, బతుకమ్మలు, కోలాటాలు, ఒగ్గుడోలు డప్పుళ్లతో అద్భుతమైన స్వాగతం పలకాలని కోరారు. చేర్యాలను డివిజన్ కేంద్రంగా ప్రకటించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ‘అన్న పానీయాలు లేకున్నా ఓపికగా సభలో ఉన్నారంటే నిజంగా మీరెంత గొప్పవాళ్లు.. ఇంత గొప్ప కార్యకర్తలు ఉండడం బీఆర్ఎస్ పార్టీ అదృష్టం’ అని కొనియాడారు. పల్లాను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ముత్తిడ్డి పిలుపునిచ్చిన సంకల్పం గొప్పదన్నారు. ఇలాంటి సన్నివేశాలు రాజకీయాల్లో చాలా అరుదు అని చెప్పారు.
ప్రజలను మోసం చేసేందుకే..
మన రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేయని పథకాలు తెలంగాణలో అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజల్లో కేసీఆర్ అంటే ఒక నమ్మకం ఉందని, ఆ పాలనపై విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ఓటమి తప్పదని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ‘కాంగ్రెస్ హయాంలో జనగామ ఎట్లుండె…ఇప్పుడు ఎట్లుందో ఒక్కసారి ఆలోచించండి..అభివృద్ధి మీ కండ్ల ముందున్నది..ఒకనాడు కరువు విలయ తాండవం చేసిన ఎగువ ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలి’ అని కోరారు.