‘వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ప్రజల మనిషి.. వరంగల్ నగరాభివృద్ధి కోసం ఆయన అడిగినవి పెద్ద కోరికలేం కావు.. అన్నింటినీ పూర్తి చేసుకుందాం.. వరంగల్ నగరంలో ఆటోల వెనుక దాస్యం మా ధైర్యం అని ఉంటదని హైదరాబాద్లో నాకో మిత్రుడు చెబుతుండె. ఆయన చీఫ్విప్ అయినా హైదరాబాద్లో ఒక్క రోజు కూడా ఉండడు. హనుమకొండలోనేఉంటడు. నన్నపునేని నరేందర్ చిన్నస్థాయి నుంచి ఎదిగిండు. వినయ్భాస్కర్, నరేందర్ టైగర్లలాంటోళ్లు.. మీ చేతుల్లో కలిసి పెరిగిన సొంత బిడ్డలు. మీకు సేవలు చేసేందుకు అందుబాటులో ఉంటరు. వీరిద్దరిని మీరే కాపాడుకోవాలె.. తప్పకుండా గెలిపించుకోవాలె’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని కేఎంసీ క్రీడామైదానంలో మంగళవారం నిర్వహించిన వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.
వరంగల్, నవంబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కాకతీయుల హయాంలో అన్ని రంగాల్లో వృద్ధిలో ఉన్న ఓరుగల్లు ప్రాంతం సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైంది.. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఆగిపోయింది.. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వరంగల్ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నది. ప్రజలు బీఆర్ఎస్కు మద్దతిస్తేనే అభివృద్ధి కొనసాగుతుంది.. దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్ ఇద్దరూ మీ బిడ్డలు.. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వీరిద్దరినీ గెలిపించుకోవాలె’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ, తూర్పు బీఆర్ఎస్ అభ్యర్థులు దాస్యం, నన్నపునేని ఆధ్వర్యంలో నగరంలోని కేఎంసీ మైదానంలో మంగళవారం నిర్వహించిన రెండు నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణ సాధన కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన దాస్యం వినయ్భాస్కర్పై మహబూబాబాద్లో తెలంగాణ ఉద్యమకారులపై కాల్పులు జరిపిన సమైక్యవాది పోటీ చేస్తున్నారని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. వరంగల్ నగరంలోని రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న బీసీ బిడ్డలు దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్ను ఆదరించాలని కోరారు. బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరుతారని, అవకాశం ఇచ్చిన చోట వారిని గెలిపించాలని సూచించారు.
వినయ్భాస్కర్, నరేందర్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడానికి 24 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఆకాశాన్ని ముద్దాడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగ్ ఒక్కటి చాలదా అని ఉదహరించారు. పదేండ్ల క్రితం వరకు వరంగల్ నగరంలో వారానికోసారి తాగునీరు వచ్చేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథతో ఇప్పుడు తాగునీటికి ఇబ్బందులు లేకుండా పోయాయని చెప్పారు. దుమ్మూధూళి ఉండే నగరం తొమ్మిదిన్నరేండ్లలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. నగరంలో నిజాం ప్రభుత్వం నిర్మించిన అజంజాహీ మిల్స్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని సమైక్య ప్రభుత్వాలు మూసివేసి, మిల్లు జాగలను తెగనమ్ముకున్నాయని పేర్కొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు పునర్వైభవం తెచ్చే లక్ష్యంతో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును నగరానికి సమీపంలో నిర్మిస్తున్నామని చెప్పారు. టెక్స్టైల్ పార్కులో కొద్దికాలంలోనే లక్ష మందికి ఉపాధి కలుగుతుందన్నారు. వరంగల్ను విద్యా కేంద్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని చెప్పారు. రాష్ట్రంలోనే ఏకైక హెల్త్ యూనివర్సిటీని కాళోజీ నారాయణరావు పేరుతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ను మించిన వైద్య వసతి కల్పించేలా 24 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. వైద్యం కోసం హైదరాబాద్ నుంచి వరంగల్కు వచ్చేలా ఈ హాస్పిటల్ సేవలు ఉంటాయన్నారు. 14 రకాల మల్టీ స్పెషాలిటీ సేవలు పేదలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
‘వెయ్యేండ్ల చరిత్రకు సాక్షిగా వరంగల్ వీరభూమి ఉన్నది. కాకతీయులు పరిపాలించిన వరంగల్ వీరభూమి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి సందర్భంలోనూ ఓరుగల్లు అండగా నిలిచింది. ఉద్యమంలో అతి పెద్ద బహిరంగ సభలను ఇక్కడే పెట్టి విజయవంతం చేసినం. భద్రకాళీ అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణ వచ్చింది. ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత భద్రకాళీ అమ్మవారికి కిరీటం చేయించుకున్నం. తెలంగాణలో ఓరుగల్లుకు ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రాజముద్రలో కాకతీయ కళాతోరణం ఉన్నది. చెరువులను బాగు చేసుకున్న పథకానికి మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకున్నం. తెలంగాణ ప్రజల కోసం కృషిచేసిన కాకతీయులకు ఇలాంటి వాటితోనే అసలైన నివాళి. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి నన్ను దీవించిన కాళోజీ నారాయణరావు, ఉద్యమంలో అండగా నిలిచిన జయశంకర్ సారును ఈ వేదికగా స్మరించుకుంటున్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వరంగల్ కేంద్రంగా 1969లో జరిగిన ఉద్యమంలో ఎందరో యువకులు పాల్గొన్నారు. అప్పటి సమైక్య ప్రభుత్వాలు కాల్పులతో ఉద్యమాన్ని అణచివేసినయ్.
రాజకీయంగా ప్రజలు తెలంగాణ డిమాండుకు మద్దతు ఇస్తూ ఎంపీలను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసింది. అప్పటి ఉద్యమ పార్టీని కలిపేసుకున్నది. తెలంగాణ కోసం 2001లో గులాబీ జెండా పట్టుకుని ఉద్యమం చేసినం. చివరికి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వేదికగానే కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని తెగించినం. వరంగల్ ఘన చరిత్ర కాంగ్రెస్ హయాంలో వెనుకకు పోయింది. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుంటున్నం. బీఆర్ఎస్ పాలనతోనే ఇది కొనసాగుతుంది. వరంగల్ నగరంలోని రైల్వే ట్రాక్లపై ఆరు చోట్ల బ్రిడ్జిలను నిర్మించాల్సిన అవసరం ఉన్నది. కొత్త ప్రభుత్వం రాగానే వీటి పనులు మొదలుపెట్టుకుందాం. వరంగల్ నగరాభివృద్ధి ఇక ఆగదు. పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ, ఇండ్ల నిర్మాణ ప్రక్రియను కొనసాగించుకుందాం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్. ఉజ్వలమైన దీన్ని మనం అభివృద్ధి చేసుకోవాలె. అభివృద్ధిలో వరంగల్ నగరం హైదరాబాద్లా మారే ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే హైదరాబాద్తో అభివృద్ధిలో వరంగల్ పోటీ పడుతున్నదని దాస్యం వినయ్భాస్కర్ అంటున్నడు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఇక్కడికి వస్తున్నయి. మీరు ఇచ్చే బలమే మా ధైర్యం. వరంగల్ను సుందరమైన నగరంగా అభివృద్ధి చేసుందాం. బీఆర్ఎస్తోనే ఇది సాధ్యమవుతుంది.. దాస్యం, నన్నపునేని ఇద్దరూ ప్రజల మధ్యే ఉంటరు.. వాళ్లు మీ బిడ్డలు.. ఇక్కడి బీసీ బిడ్డలను ఆదరించాలె’ అని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.