స్వయానా కర్షకుడైన సీఎం కేసీఆర్, గడిచిన పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు అనేక సంస్కరణలు చేశారు. రైతులకు వివిధ పథకాలు అందించి ఊతమిచ్చారు. దీంతో రైతులంతా సాగువైపు మళ్లి, పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నాడు విలువ లేని భూములకు సైతం నేడు ఎంతో ‘విలువ’ వచ్చింది. సాగునీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి వచ్చి భూముల ధరలు అమాంతం పెరగడంతో రైతుల్లో ధీమా వచ్చింది. ఇంత గుండెనిబ్బరాన్నిస్తున్న భూములను మళ్లీ కాంగ్రెస్ చేతిలో పెడితే అంతా ఆగమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రణాళికలతో పటిష్టం చేసిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘హస్తా’న్ని అందలమెక్కిస్తే భూముల ధరలు పతనం కావడం ఖాయమని, ఎత్తిపోతల పథకాలు నిర్లక్ష్యానికిగురై సాగునీరు అందదని, ఫలితంగా రైతుల్లో మనోధైర్యం సన్నగిల్లుతుందని, మళ్లీ అన్నదాతలు ఆత్మహత్యల బాటపట్టే ప్రమాదముందని, ఇలా అన్ని రంగాలు, అందరిపైనా ప్రభావం పడి వ్యవస్థ మొత్తమే గాడితప్పుతుందనే వాదనలు వస్తున్నాయి.
– వరంగల్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వరంగల్ (నమస్తే తెలంగాణ)
వరంగల్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వరంగల్(నమస్తే తెలంగాణ): గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా వ్యవసాయరంగ అభివృద్ధి కోసం చేసిన కృషితో భుముల ధర అమాంతం పెరిగిందనేది జగమెరిగిన సత్యం. అయితే కాంగ్రెస్ చెబుతున్న మాటలు చూస్తుంటే మళ్లీ వ్యవసాయరంగం కుదేలయ్యేలా ఉందని, రైతులు ఆత్మస్థయిర్యం కోల్పోయే ప్రమాదముందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
నిరంతర కరెంటు పోయి, 10హెచ్పీ మోటర్లు వచ్చి ధరణి ఎత్తేసి, కౌలుదారు కాలమ్ వచ్చి, రైతుబంధుపై నీలినీడలు కమ్మితే రాష్ట్రంలో భూముల ధరలు పడిపోతాయని, ధరణి లేకుంటే భూములకు రక్షణే లేకుండా పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తిరిగి పట్వారీల అజమాయిషీ వస్తే రైతుల్లో భూములపై ఇప్పుడున్న ధీమా పోతుందని, కౌలుదారు కాలమ్ భయంతో స్వయంగా వ్యవసాయం చేయలేనివారు భూమిని బీడు పెడుతారు తప్ప కౌలుకు ఇవ్వరని, ఫలితంగా సాగు పడిపోతుందని రైతుసంఘాల నాయకులు అంటున్నారు.
సాగు తగ్గిపోతే ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందంటున్నారు. గ్రామాల్లో 70శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలవారు ఆదాయం కోల్పోతారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్నారు. మూడు గంటల కరెంటు వల్ల సాగుకు నీరు సరిపోక ఈ రకంగా చూసినా సాగు విస్తీర్ణం మీద దెబ్బపడుతుందని స్పష్టం చేస్తునారు. 10హెచ్పీ మోటర్ల వల్ల రైతులమీద అదనపు భారం పడుతుందని వాపోతున్నారు. రైతుబంధులో కౌలుదారులు, రైతుల పంచాయితీలతో గ్రామాల్లో శాంతిభద్రతల ముప్పువాటిల్లే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కరెంటు తీసేయడం, భూమికి భద్రత లేకుండా చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, సాగు విస్తీర్ణం పడిపోవడం ద్వారా భూముల ధరలు పతనమవుతాయని అంటున్నారు.
ఇప్పుడు రెండు, మూడెకరాల రైతులకు కూడా భూముల ధరలు ఎంత భరోసాను, ధీమాను ఇస్తున్నాయని, ఫలితంగా రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయని, గతంలో భూములకు పెద్ద ధరలు లేక కొద్దిపాటి అప్పులకు కూడా భయపడి ఆత్మహత్యలకు పాల్పడేవారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు భూముల ధరలు పెరిగాక అప్పులమీద భయం పోయిందని, రైతుల్లో ధీమా వచ్చిందని చెబుతున్నారు. ధరలు మళ్లీ పాతరోజులు వస్తాయని అంటున్నారు. తెలంగాణలో చిన్న కమతాలున్న కుటుంబాలవారు అనేక మంది దూరంగా ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ గ్రామాల్లోని తమ భూములను కౌలుకిచ్చి వ్యవసాయం చేయిస్తున్నారని, అంతే తప్ప కౌలుకు ఇచ్చే రైతులంతా వందల ఎకరాలున్న వారేం కాదని, చిన్న, మధ్య తరగతి ఉద్యోగులను ఈ సమస్యలన్నీ చుట్టముడితే చిరుద్యోగులకు ఎంతో కొంత ఆసరా అయ్యే ఈ అదనపు ఆదాయం కూడా కోల్పోతారని అభిప్రాయపడుతున్నారు.
గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోతే మళ్లీ వలసలు మొదలవుతాయని, రైతుకిచ్చే కరెంటునే కుదించే కాంగ్రెస్, కోట్ల రూపాయలు పోసి ఎత్తిపోతల పథకాలను పూర్తి స్థాయిలో నడిపిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం దాదాపు 10వేల కోట్ల దాకా విద్యుత్ సంస్థలకు సబ్సిడీ ఇస్తున్నారని, కాంగ్రెస్కు ఇంత సొమ్ము ఇచ్చే గుండె ధైర్యం ఉంటుందా? అనేది ప్రశ్నార్థకమేనంటున్నారు. పదేండ్ల కాలంగా కేసీఆర్ కష్టపడి నిర్మించిన గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటుందని, ఈ వ్యవస్థను నిలబెట్టేందుకు చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ సబ్స్టేషన్లు, జాతీయ గ్రిడ్తో అనుసంధానం, విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ, గోదాముల నిర్మాణం, మార్కెట్ యార్డుల విస్తరణ, రైతువేదికల శిక్షణ సమాచార వ్యవస్థ అన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయంటున్నారు. ఒక్కొక్కటిగా పేర్చి నిర్మించిన వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన చెందుతున్నారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 24: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్ల కరెంట్ కష్టాలు వస్తయి. కాంగ్రెస్ నాయకుల మోసపూరిత వాగ్ధానాలను ప్రజలు నమ్మవద్దు. సీఎం కేసీఆర్ అందరికీ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. ధరణి తెచ్చిన తర్వాత భూములకు భద్రత పెరిగింది. ఎలాంటి భూముల పంచాయతీ లేదు. ఎవరి భూములపై వారికే పూర్తి అధికారాలు వచ్చాయి. తెలంగాణ వచ్చినంక ఇప్పుడు రైతులు వ్యవసాయం మీద ఇంకా శ్రద్ధ చూపుతున్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాతరోజులు వస్తాయి.
– తంగెళ్ల మోన్, హనుమకొండ
నయీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల కోసం మూడు గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నారు. వారు ఇచ్చే మూడు గంటల కరెంట్ ఒక్క మడి కూడా తడవదు. అలా ఒక్క మడి తడవని నీటితో ఏ విధంగా ఎవుసం చేసేది. కాంగ్రెస్ నాయకులు వచ్చి పంట పండిస్తే తెలుస్తది. నోటికి ఏది వస్తే అది మాట్లాడి అధికారంలోకి వచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తామని అనుకుంటున్నారు. అలా చేస్తే తిరగబడటం ఖాయం.
– యాదయ్య, రైతు
భీమదేవరపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వమంటే కరెంటు కోతలే గుర్తుకత్తయ్..ఎప్పుడు సూడు అట్లకరంటత్తది.. ఇట్ల పోతది..బాయికాడ అదే గోస..ఇంటికాడ అదే గోస..యవసం పంటకు నీళ్లు పారిచ్చేందుకు బాయిలకాడ రాత్రిల్లు కరెంటుకోసం కావలికాసేది..పాములు, తేళ్ళు, గుడ్డెల్గులకు భయపడుకుంట బిక్కుబిక్కుమనుకుంట కరెంటు కోసం కావలి కాసేది. ఇంటికత్తె ఇంటికాడ కరెంటుండకపోయేది. దానిపాడుగానూ నీళ్ళకోసం రిగ్గులకాడికి బిందలు పట్టుకుని పోయేది. అక్కడి రిగ్గు చుట్టూ జనం ఉండేది. రిగ్గు కొట్టి కొట్టి చేతులు పోయేది. ఇప్పుడు కాంగ్రెస్ కరెంటు కోతలుండవని జెప్తాంది. నమ్మేటోల్లు ఉండద్దా..అప్పుడు పడ్డ కష్టాలు గుర్తుకు వత్తే పాణం తరుక్కపోతది. సీఎం కేసీఆర్ ఇత్తున్న 24 గంటల కరెంట్తో సంతోషంగ ఉంటున్నం. మూడు గంటల కరెంటిత్తె పంటల కెట్ల సరిపోతది.. ఒక్క మడి కూడా పారక రైతు రందిల పడుతడు. రైతులను ఆదుకు న్నోళ్లనే గెలిపిద్దం.
ఐనవోలు, నవంబర్ 27: రైతులు పంటలు బాగా పండించి, మంచి దిగుబడి సాధిస్తుండడాన్ని కాంగ్రెసోళ్లు ఓర్వలేకపోతున్నరు. రైతుల విషయంలో కాంగ్రెసోళ్లు పెద్ద కుట్రే చేస్తున్నారు. వాళ్లిచ్చే మూడు గంటల కరెంటు వద్దు.. వాళ్లూ వద్దు. బీళ్లుగా ఉన్న భూముల్లో ఈ పదేళ్లలో కేసీఆర్ సార్ పాలనలో రెండు పంటలు పండిస్తు న్నం. కాంగ్రెస్ పాలనలో కరెంటుకు చాలా ఇబ్బందు లు ఉండేవి. మూడు గంటల కరెంటుతో ఎకరం భూమి కూడా తడవదు. బీఆర్ఎస్ సర్కార్ 24గంటల ఉచిత కరెంట్ ఇస్తోంది. దీంతో రెండు పంటలు పండిస్తు న్నం. నిరంతరం కరెంట్ ఇవ్వడం వల్ల తీరికను బట్టి పొలాలకు నీళ్లు పెట్టు కుంటున్నం. బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి రైతుల సమస్య లు తీరాయి. అప్పుల బాధలు తగ్గాయి. మళ్లీ కాంగ్రెసోళ్లు ఏదో మభ్యపె డుతున్నారు. వీళ్లు మోటర్లకు మీటర్లు కూడా పెడుతరు కావొచ్చు. తెలంగాణ రైతులు మంచిగుండాలంటే సీఎంగా కేసీఆరే ఉండాలి.
– పిడుగు యాకమల్లు, రైతు, పెరుమాండ్లగూడెం, ఐనవోలు, హనుమకొండ జిల్లా
హనుమ కొండ చౌరస్తా, నవంబర్ 27: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని సాధ్యం కానీ హామీలు ఇస్తుంది. ఒక సామాన్య రైతు బిడ్డ 10హెచ్పీ మోటార్ల సామర్థ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు లేదు. 2హెచ్పీ, 5హెచ్పీ మోటార్ల సామర్థ్యంతో రైతు పంటలను పండిస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థి 10హెచ్పీ మోటార్లతోని అని అంటున్నారు అది ఎలా సాధ్యం రైతులకు.. 10 హెచ్పీ మోటార్తో రూ.500 కరెంట్ బిల్లు రేపు వీళ్లు చెప్పే పరిస్థితి ప్రకారం రూ.5 వేలు అయ్యేలా అనిపిస్తుంది.
– సింగారపు సత్తయ్య, రైతు, కుమార్పల్లి
హసన్పర్తి: వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలన్న రేవంత్రెడ్డికి రైతుల కష్టాలు ఏం తెలుసు? వ్యవ సాయం గురించి తెల్వనోడు మాట్లాడుతే గిట్లనే ఉంటది. ఆయన చెప్పిన మూడు గంటల కరెంటు గొడ్లకు వేసే మేత ను కూడా పండించలేం. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఎప్పుడు వస్తదో తెలువని పరిస్థితి ఉండేది. రాత్రింబవళ్లు చేన్ల కాడ పడుకొని ఉండేది. ఎప్పుడు పాము, తేలు కాటుకు గురవుతా మేమోనని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బతికేది. కరెంటు సక్కగ రాక వేసిన పంటలు ఎండిపోయి రైతులు తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నరు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ రైతులకు ఉచితంగా 24గంటలు కరెంటు ఇచ్చి కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులను నింపిండు. రైతులకు అందుబాటులో విత్తనాలు ఎరువులను ఉంచి, పెట్టుబడికి ఎకరాకు రూ.10వేలు ఇచ్చి పండిన పంటలకు గిట్టుబాలు ధర కల్పించి రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేసిండు. రైతులకు ప్రమాదకరంగా చనిపోతే ఆకుటుంబానికి రూ.5లక్షలు ఇచ్చి ఆదుకున్నడు. రైతు కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చిండు. మోసం చేసే కాంగ్రెస్ను ప్రజలు నమ్మరు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజ లు బుద్ధి చెప్పుడు ఖాయం.
– సూరం ధర్మారెడ్డి, మునిపల్లి, హసన్పర్తి మండలం
పర్వతగిరి: కేసీఆర్ సారు ధరణి తీసుకరాకపోతే కబ్జాలు పెరిగి రైతాంగానికి ఇబ్బందులు ఉండేవి. ధరణి లేకుంటే భూముల రిజిస్ట్రేషన్లలో పైరవీకారుల బెడద పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తే మళ్లీ రెవెన్యూ సిబ్బంది, పైరవీకారులు కలిసి ఒకరి భూమిని మరొకరి పేరు మీద మార్పులు చేసి రైతులను నానా ఇబ్బందులు పెడుతరు. సీఎం కేసీఆర్ సారు రైతుబంధుతో పెట్టుబడికి అప్పులు తేకుండా చేశారు. 24గంటల కరెంటును తీసేసి మూడు గంటలు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ను గెలిపియ్యం. కాంగ్రెస్ పాలనలో రాత్రిపూట కరెంటుతో అనేక ఇబ్బందులు పడెటోళ్లం. మూడు గంటలు పాటు కరెంటు ఇస్తే 10 హెచ్పీ మోటర్లు బిల్లులు ఎవరు ఇస్తారు? రైతులు మళ్లీ బీఆర్ఎస్కే మెజారిటీ ఇస్తం. మన కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటది.
– పంతంగి కనుకయ్య, రైతు, కొంకపాక
నర్సంపేట : రైతులు, కౌలు రైతులకు మధ్యన వివాదాలు వస్తాయి. రైతుబంధును కౌలు రైతులు, రైతుల్లో ఎవ్వరికైనా ఒకరికే ఇస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీనివల్ల రైతులు, కౌలు రైతులుకు మధ్య గొడవలు జరిగి, శాంతిభద్రతల సమస్యలు ఏర్పడతాయి. కరెంటు మూడు గంటలే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ నాయకులను నమ్మి రైతులు వ్యవసాయం చేయలేరు. రైతుల భూములకు విలువ కూడా బాగా తగ్గిపోతాయి. సీఎం కేసీఆర్ పాలనలోనే పుష్కలంగా సాగునీరు, విద్యుత్తో పాటు రైతుబంధు ఇవ్వడంతో భూములకు విలువ పెరిగి, రైతులు భరోసాతో బతుకుతున్నారు. రైతుబంధుతో రైతులకు ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు ధరణి ఎత్తేస్తామని, సీఎం కేసీఆర్ డబ్బులను వృథా చేస్తున్నారని అంటున్నారు. ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం కరెక్ట్ కాదు. దీని వల్ల నష్టపోయేది రైతులే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలి. రైతులందరూ బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలి.
– కొమ్ము రమేశ్యాదవ్, న్యాయవాది
ఐనవోలు: సీఎం కేసీఆర్ ధరణితో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ధరణితో భూములపై అధికారుల పెత్తనం పోయింది. గతంలో డబ్బులిస్తే ఒకరి భూమిని ఇంకొకరి పేరుమీదకు మార్చేవారు. సర్వే నంబర్లు తారుమారు చేసి రైతులను ఇబ్బంది పెట్టేవారు. డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్ల మాట చెల్లేది. ధరణి రావడం, వీఆర్వోలను వేరే డిపార్ట్మెంట్కు బదిలీ చేయడంతో భూమిపై పూర్తి అధికారం రైతులకే దక్కింది. ధరణితో భూముల రిజిస్ట్రేషన్లు ఇబ్బందులు లేకుండా క్రమపద్ధతిలో జరుగుతున్నాయి. ధరణితో సర్వే నంబర్లు తారుమారు అయ్యే అవకాశం లేదు. ధరణిలో కొన్ని కొత్త సవరణలు తీసుకువస్తే చాలు.
– బొల్ల అనిల్, రైతు, పున్నేలు, ఐనవోలు
చెన్నారావుపేట: సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకురావడంతో నకిలీలకు అడ్డుకట్ట పడింది. ఇంచు జాగ తీసుకోవాలన్నా పట్టాదారుడి వేలిముద్ర కావాలి. సీఎం కేసీఆర్ ఆలోచనా తీరు ఒక అద్భుతం. వ్యవసాయ రంగానికి మేలుచేసే సీఎం కేసీఆర్ రైతు కుటుంబాల పాలిట దేవుడు. కాంగ్రెస్ నాయకులు ధరణి వ్యవస్థను రద్దు చేస్తామని చెబుతున్నారు. భూమాత పేరుతో కౌలు దారుల కాలమ్ చేర్చితే రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. ధరణి ఎత్తివేస్తే గతంలో రెవెన్యూ వ్యవస్థలో జరిగిన లోపాలే మళ్లీ జరిగే ప్రమాదం ఉంది. ధరణిని కాపాడేందుకు రైతులందరూ సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలి. కాంగ్రెస్ వారి కపట ప్రేమను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి.
– మహేందర్, కోనాపురం, చెన్నారావుపేట
కాజీపేట : కాంగ్రేస్ ధరణి తీసేస్తామని చెబుతున్నట్లు తీరు చూస్తే రైతుల వ్యవ సాయ భూముమ రికార్డులు తారుమారై ఆగం అయ్యే పరిస్థితి ఉంటది. దళారులు పుట్టుక వస్తారు. అధికారులది, దళారులది ఇష్ట రాజ్యమైతది. మళ్లీ పాత గోడవల పరిస్ధితి వస్తుంది. ధరణిని తీసేసి రైతుల మద్య గొడవలు పెట్టాలని కాంగ్రేస్ పార్టీ చూస్తుంది. ఇది సరియైన పద్దతి కాదు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ధరణి తీసుక రావడం వల్ల రైతులు తహసీ ల్దార్ కార్యాలయాల్లో క్షణాలలో రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. రైతుకు ఉన్న భూమి తన కు తెలువకుండ వ్యవసాయ భూమి ఏ రికార్డు మారదు. దళారులకు, అధికారులకు లంచం ఇవ్వడం అవసరం లేదు. ఇలాంటి ధరణిని కాంగ్రేస్ పార్టీ తీసివేస్తామని చెప్పడం రైతులకు మళ్లీ పాత కష్టాలు తప్పవ్. అన్ని విధాల రైతులను ఆదుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి గెలిపించి, ధరణిని తీసేస్తానంటున్న కాంగ్రేస్ పార్టీకి రైతులు గుణపారం చెబుతారు.
-కడారి దశరథం, గాంధీనగర్, దర్గా, కాజీపేట