వడగండ్లు మిగిల్చిన కడగండ్లతో కలతచెందిన కర్షకుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఎంతో భరోసా నింపింది. ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగంతో కలిసి పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో సీఎం కేసీఆర్ గురువారం పర్యటించి.. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి బాధితులను ఓదార్చడం, పంట ఏదైనా ఎకరాకు రూ.10వేల ఆర్థిక సాయం ప్రకటించడం అన్నదాతలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ‘అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం.. మీ ధైర్యమే నా ధైర్య’మని సీఎం స్పష్టం చేయడం మరింత బలాన్నిచ్చింది. పంట నష్టం జరిగితే గతంలో ఏ నాయకుడు కూడా ఇలా వెంటనే వచ్చి ఆదుకున్న దాఖలాలు లేవని, సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి తమకు అండగా నిలిచారని రైతులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మేరకు కొన్నిగంటల్లోనే సాయం జీవో విడుదల కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలు ప్రాంతాల్లో కేసీఆర్ చిత్రపటాలకు శుక్రవారం పాలాభిషేకం చేశారు.
వరంగల్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చేతికి వచ్చే సమయంలో రాళ్లవానలతో నష్టపోయిన పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించి, రైతులతో మాట్లాడి ఆర్థిక సాయం జీవో విడుదల చేయడంపై అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతున్నది. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇస్తానని చెప్పడం, సీఎం కేసీఆరే స్వయంగా పంటల వద్దకు వచ్చి తమ కష్టాలు తెలుసుకోవడంపై రైతులు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్దమొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించడంపైనా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో సీఎం కేసీఆర్ గురువారం పర్యటించి క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న వరి, మక్క, మిరప చేలు, మామిడి తోటలను పరిశీలించిన విషయం తెలిసిందే.
చేతికి వస్తున్న పంటను నష్టపోతే రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసునని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన పంటలకు గతంలో ఎప్పుడూ లేనంత పెద్ద మొత్తంలో సాయం ప్రకటించారు. ఎండకాలంలో రాళ్లవానలతో జరిగిన పంట నష్టాలపై ఉమ్మడి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి పరిశీలించి సాయం చేస్తామని చెప్పడం ఎంతో భరోసానిచ్చిందని రైతులు అంటున్నారు. వానకాలంలో అధిక వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడం గతంలో ఉండేదని, రాళ్లవానలకు నష్టపోయిన పంటలకు ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.
రైతులు వెనుకడుగు వేయొద్దనే..
తెలంగాణలో వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. సాగునీరు, ఉచిత కరంటు, రైతుబంధు తదితర పథకాలతో ఊతమిస్తున్నారు. రైతుబీమాతో అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచారు. పండిన పంటను మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అదునులో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. ఇంత చేసి విపత్తులతో పంట నష్టపోతే రైతులు వెనుకడుగు వేయకుండా వారికి ధీమానిచ్చేందుకు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇస్తుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు ధైర్నమిచ్చిండు..
ఎల్కతుర్తి : మొన్నటి చెడగొట్టు వానలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పి సీఎం కేసీఆర్ ఎంతో ధైర్నమిచ్చిండు. ఆరుగాలం కష్టించి పంటలు వేస్తే గీ వానలు చేయవట్టి చేతికి వస్తయో రావో తెల్తలేదు. గిప్పుడు కూడా వడగండ్లు పడి పంటలకు చాలా నష్టం జరిగింది. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వెంటనే దెబ్బతిన్న పంటలను చూసి ఆదుకుంటామని హామీ ఇచ్చిండు. ఎకరానికి రూ.10వేలు ఇస్తామని ప్రకటన చేయడం ఎంతో ధైర్యమిచ్చింది. నాకు రెండెకరాల వరి పొలం ఉంది. మొన్నటి వానకు దాదాపు పంటంతా నేలమట్టమైంది. పెట్టుబడి కూడా వచ్చుడు కష్టమే. కానీ సర్కారు సాయం వస్తదని తెలిసినంక పాణం నిమ్మలమైంది. అవి వస్తే నాకు జరిగిన నష్టంలో ఎంతో కొంత ఆదుకున్నట్లయితది.
– పిట్టల మహేందర్, రైతు, సూరారం, ఎల్కతుర్తి
కేసీఆర్ సారంటేనే ధైర్యం..
కురవి : రైతును కళ్లలో పెట్టుకుని చూసుకోవడం కేసీఆర్ సార్ వల్లనే అవుతుందని మరోసారి స్పష్టమైంది. తెలంగాణ రాక ముందు ఎన్నో కష్టాలు పడ్డం. ఓ సమయంలో అసలు వ్యవసాయమే వద్దనుకున్నం. సర్ ప్రాణాలు లెక్కచేయక కొట్లాడి తెలంగాణ తెచ్చె. ఆయన రైతు కాబట్టే రైతుల కష్టాలు పోవాలని ఎంతో కష్టపడ్డడు. అప్పుడు వర్షాలు పడితేనే లెక్క. చుక్కనీరు లేకపాయె. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందుగా సాగునీటి సమస్య తీరాలని ఎంతో ఖర్సు వెట్టి కాళేశ్వరం కట్టిండు. సాగునీరు తెచ్చి పంట సాయం కోసం అప్పులోల్ల కాడికి పోకుండా రైతుబంధు ఇస్తుండు. కిస్మత్ మంచిగ లేక పాణాలు పోతే కుటుంబం ఆగం కాకుంట రైతుబీమా ఇస్తుండు. మొన్న వడగండ్ల వానకు పంటలన్నీ నాశనమైనయ్. నేను కూడా మూడెకరాల్లో మక్కజొన్న పెట్టిన. రేటు మంచిగ ఉందనుకునే మోపులనే గీ చెడగొట్టు వానలు పడి ముంచిపోయినయ్. లేకపోతే 80 క్వింటాళ్ల దాక పంట వచ్చేది. చేతికొచ్చిన పంట నీళ్ల పాలైందని నెత్తివట్టుకున్న. కానీ ఇంతల్నే నేనున్నా అని కేసీఆర్ సార్ నా అసొంటి రైతులకు మళ్లోసారి దేవుడయ్యిండు. జరం ఉన్నా సుత ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ధైర్యం చేసిండు. బాధలో ఉన్న రైతుల కండ్లు తుడిచేందుకు స్వయంగా కదిలిండు. ఆదుకుంటమని ధైర్నం చెప్పిండు. నష్టం వచ్చినోళ్లకు ఎకరానికి 10వేలు ఇస్తానని చెప్పాడు. సార్ మాట ఇస్తే వచ్చినట్లే. రైతుబంధు. బీమాతో పాటు నష్టపరిహారం ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమే.
– బానోత్ వీరన్న, కంచర్లగూడెం
సాహసోపేత నిర్ణయం
నర్సంపేట రూరల్ : సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతు పక్షాన నిలిచారు. అకాల వర్షానికి అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గురువారం జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ స్వయంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతు ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతుకు ఒక్కో ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ఇస్తామనడం చాలా సంతోషంగా ఉంది. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారాన్ని ఇప్పటివరకు అందించలేదు. సీఎం కేసీఆర్ రైతు కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. – వడ్లకొండ కిషన్, రామవరం
కొండంత అండ..
ఖానాపురం : అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం అందిస్తామన్న సీఎం కేసీఆర్ రైతుల్లో మనోధైర్యం నింపాడు. నేను 15 ఎకరాల్లో వరి, 15 ఎకరాల్లో మక్కజొన్న నష్టపోయాను. కోలుకోవడం కష్టమనుకుంటున్న తరుణంలో కేసీఆర్ ఇలాంటి ప్రకటన చేయడం ఊరట కలిగించింది. కేంద్రం పట్టించుకోకపోయినా రైతుల మీద ఉన్న ప్రేమతో కేసీ ఆర్ రైతులను ఆదుకోవడం సంతోషం. దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించడమే కాకుండా పరిహారం అందించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం రైతుల అదృష్టంగా భావిస్తున్నాం. రైతులకు అన్నివేళలా అండగా నిలబడే సీఎం ఉండడం వల్లే సంతోషంగా వ్యవసాయం చేయగలుగుతున్నాం. కేసీఆర్ పది కాలాల పాటు రైతులకు ఇలాగే తోడ్పాటునందించాలి.
– కర్రె క్రిష్ణారెడ్డి, బుధరావుపేట
రైతు లోకానికి ఊరట
దేవరుప్పుల : వడగండ్ల వాన పడిన రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల పక్షాన నిలువడం ఊరటనిచ్చింది. ఇంత వేగంగా స్పందించిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలె. వానాకాలానికి మొదలే మూడెకరాలు నాటుపెట్టిన. పంట చేతికొచ్చింది. ఇయ్వాలనో రేపో కోసేదె. ఇంతలోనే వడగండ్ల వానకు నామరూపాలు లేకుండా పో యింది. వ్యవసాయ అధికారులు వచ్చి చూసిపోయిండ్రు. పరిహారం వస్తదా రాదా అనే అనుమానం ఉండె. కేసీఆరే వచ్చి జరిగిన నష్టాన్ని చూసి అక్కడికక్కడే ఎకరాకు రూ.10 వేలు ప్రకటించడం, వెనువెంటనే నిధులు మంజూరు చేస్తూ గంటల వ్యవధిలో జీవో రావడం చరిత్రలో ఇదే మొదటిసారి. రైతులకిచ్చేది నష్టపరిహారం కాదు సహాయ పునరావాసం అన్న మాట రైతుల గుండెల్లో నిలిచిపోతుంది. రైతు పక్షపాతి కేసీఆర్కు రైతులెప్పుడూ అండగా ఉంటారు. ఇప్పటికే అనేక వ్యవసాయ పధకాలు అమలౌతున్నాయి. రైతుబంధు ఆసరా అయితాంది. రైతు బీమా రైతు కుటుంబా ల్లో ఆర్థిక భరోసా నింపుతున్నది.
– కొండ్రెడ్డి కృష్ణారెడ్డి, దేవరుప్పుల
కేసీఆర్ ప్రకటనతో ధీమాగా
ములుగు, మార్చి 24(నమస్తే తెలంగాణ) : మొన్న వడగండ్ల వానలు బాగా పడ్డయ్. గాలిదూమారం వచ్చి పంటలను ఆగం చేసినయ్. నర్సంపేట దిక్కు పంటలు ఎక్కువ నష్టమైందని తెలిసి చాలా బాధపడ్డ. పంటలు దెబ్బతిన్నందుకు రైతులు గోస పడుతాన్రని సీఎం కేసీఆర్ సార్ గాలిమోటర్ మీద వచ్చి రైతులను కలిసిండని టీవీలో వార్తలు చెబుతుంటే ఇన్న. చేతికచ్చే సమయంలో చెడగొట్టు వాన ఆగంచేసింది. రైతులు కుంగిపోవద్దని కేసీఆర్ సారు ఎకరానికి 10వేలు ఇస్తనని మంచి మాట చెప్పిండు. దగ్గరుండి పంటలను చూసి వాళ్ల బాధ అర్సుకున్నడు. కౌలు రైతులను కూడా ఆదుకుంటానని చెప్పడం గొప్ప విషయం. నాకు నాలుగెకరాల పొలం ఉన్నది. పెట్టుబడి కింద రైతుబంధు వస్తున్నది.
– ఒజ్జెల చంద్రయ్య, ములుగు
సారు మాట సద్దన్నం మూట
నల్లబెల్లి : సారు ఇచ్చిన మాట మాకు సద్దన్నం మూటలాంటిది. అకాల వర్షంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతు కష్టం తెలిసిన కేసీఆర్ సారు.. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ప్రకటించి మాకు ఆత్మబంధువయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎన్నో కరువు కాటకాలు వచ్చాయి. ఏ ప్రభుత్వం కూడా దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోలే. కానీ కేసీఆర్ ఒక్కరే ఆశించిన దానికంటే అదనంగా నష్టపరిహారం ప్రకటించి రైతు పక్షపాతి అయ్యారు. అన్నం పెట్టే రైతుకు భరోసానిచ్చారు. ఆయన రుణం తీర్చుకుంటం.
– తెలంగాణ విజయ్, కొండైల్పల్లె
రైతులకు ఇంత కన్న ఏం గావాలె..
పెద్దవంగర : మాది బొమ్మకల్లు. రెండెకరాల్లో మిర్చి, మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో పెసర్లు ఏసిన. దాంట్లో మా పాలోల్లు కాలేరు ఈశ్వరమ్మది చెలుక ఎకరం తీసుకొని వేసిన. మంచిగ పండింది. కొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకుంటే చెడగొట్టు వాన నాశనం చేసింది. పెట్టిన పెట్టుబడి.. చేసిన కష్టం అంతాపోయింది. ఇప్పుడేం చేయాలని రంది వట్టుకున్నది. ఇంతల్నే ముఖ్యమంత్రి కేసీఆర్ సారు రైతుల దగ్గరికి అచ్చి ఎకరానికి రూ.10వేలిస్తమని మంచిమాట చెప్పిండు. కౌలు రైతులను కూడా ఆదుకుంటమని కొండంత ధైర్నమిచ్చిండు. కష్టాల్లో ఉన్న రైతులకు ఇంతకన్న ఏం గావాలె. గిట్ల నష్టం జరిగిందని తెలిసిన ఎంబడే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఆదుకునుడు చాన సంతోషంగా ఉంది. – కాలేరు సోమయ్య, బొమ్మకల్లు
10వేల సాయం.. ఎంతో సంతోషం
దంతాలపల్లి : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు సహాయం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. దంతాలపల్లి మండలంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా పంటలు నష్టపోతే సహాయం అందించలేదు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులను అధైర్య పడవద్దు నేనున్నా అన్ని భుజం తట్టి అండగా ఉన్నడు. కేసీఆర్ సార్ రైతుబిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసుకొని సహాయం అందిస్తున్నడు. నేను ఊరి చివర 40 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకున్న. మొన్నటి వానకు కాయలన్నీ రాలినయ్. కేసీఆర్ సార్ కౌలురైతులను గుర్తించి ప్రత్యేకంగా ఆదుకుంటామని చెప్పడం సంతోషంగా ఉంది.
– గోనేల ఎల్లయ్య, కౌలురైతు, దంతాలపల్లి
కేసీఆర్తోనే పండుగలా ఎవుసం
చిన్నగూడూరు : వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తూ తెలంగాణలో కేసీఆర్ వ్యయసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నడు. గత పాలకులు పట్టించుకోకపోవడంతో వ్యవసాయం వదిలి రైతులమంతా పట్టణాలకు వలసలు పోయేటోళ్లం. సాగునీరు, కరంటు ఉండేది కాదు. పండిన ధాన్యాన్ని గత్యంతరం లేక దళారులకు ఇచ్చి మోసపోయేటోళ్లం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక వ్యవసాయం పండుగలా సాగుతోంది. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు 10వేల నష్టపరిహారం ఇస్తానని భరోసా ఇచ్చిండు. మాటకు కట్టుబడే ముఖ్యమంత్రి మన కేసీఆర్. 24గంటల కరంటు, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నడు. పండిన ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు అనేక పథకాలతో రైతులకు వరాలు ఇచ్చిండు. ఇలాంటి ముఖ్యమంత్రి పదికాలాల పాటు చల్లగా ఉండాలి.
– గంగాధరి వీరయ్య, చిన్నగూడూరు
సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి
పాలకుర్తి : అకాలవర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.10 వేలు సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్ సార్ రైతు పాక్షపతి. ఇటీవల కురిసిన అకాల వర్షంతో నేను వేసిన మక్కజొన్న పంటకు భారీగా నష్టం వాటిల్లింది. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలుచేయడమే గాక కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం సంతోషంగా ఉంది. ఆపద వచ్చినప్పుడు ఆదుకొని కన్నీరు తుడిచే ముఖ్యమంత్రి ఉండడం మా రైతుల అదృష్టం.
– మణిక్యరావు, కొండాపురం పెద్దతండా