హుజూరాబాద్/జమ్మికుంట, నవంబర్10 : “ఆత్మ గౌరవమనే ఈటల రాజేందర్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణను కించపరిచిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సంకలజొచ్చినవ్.. ఇప్పుడు నీ ఆత్మ గౌరవం ఎటు పోయిందే రాజేంద్రా..? ఆంధ్రుల, ఢిల్లీ నాయకులకు తాకట్టు పెట్టినవా..?. బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేశావ్.. ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలకు ద్రోహం చేస్తున్నావ్.. వెన్నుపోటుదారుడు ఈటల మనకు అవసరమా..?. హుజూరాబాద్లో యువకుడు పాడి కౌశిక్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి. నియోజకవర్గాన్ని రూ.వెయ్యికోట్లతో నేనే దగ్గరుండి అభివృద్ధి చేయిస్తా.” అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలో బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి సుమారు 30 వేలకు పైగా ప్రజలు తరలిరాగా, వారినుద్దేశించి మంత్రి ప్రసంగించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపోళ్లను నమ్మితే మోసపోతామని, గోసపడ్తామని చెప్పారు. హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగరేయాలని, యువకుడు పాడి కౌశిక్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టిక్కెట్లను అమ్ముకున్న రేవంత్రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని అమ్ముకోడనే గ్యారంటీ ఉందా..? ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. సాగుకు పుష్కలంగా కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా..? మూడు గంటలు చాలన్న కాంగ్రెస్ కావాలా..? ప్రజలే తేల్చుకోవాలన్నారు. కేసీఆర్తోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని, దీనికి నిదర్శనమే తొమ్మిదేళ్ల పాలన అని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్కు నమ్మక ద్రోహం చేశారని, ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటుదారుడు ఈటల మనకు అవసరమా..? చెప్పాలన్నారు.
గజ్వేల్, హుజూరాబాద్ రెండింటా నామినేషన్ వేశారని, రెండు చోట్లా ఆయన ఓడిపోవడం ఖాయమన్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఖాయమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులు కౌశిక్కు పుష్కలంగా ఉన్నాయని, తానే దగ్గరుండి రూ.వెయ్యి కోట్ల అభివృద్ధిని చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. నిజం గడప దాటక ముందే.. అబద్ధం ఊరంతా చుట్టేస్తుందన్న చందంగా ఎన్నో అబద్ధాలు చెప్పి గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచాడని, నిజం నిలకడగా తెలుస్తుందన్నట్లు ఇప్పుడు నియోజకవర్గ ప్రజలందరికీ ఎవరేంటో తెలిసిందన్నారు. ఇప్పటికైనా ప్రజలు న్యాయం, ధర్మం గుర్తించాలని, కౌశిక్రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. రైతులను బిచ్చగాళ్లతో పోల్చిన రేవంత్రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. బీజేపీ ఇక్కడ వచ్చేది లేదు.. సచ్చేది లేదని, ఇప్పుడున్న మూడు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. ఢిల్లీ నుంచి పెద్ద నాయకులతో వస్తున్న ఈటల.. ఉప్పల్ ఆర్వోబీ ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయించాలనే సోయి ఎందుకు లేదన్నారు. ఉప ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి గెలిచిన ఈటల.. రెండేైళ్లెనా తట్టెడు మైట్టెనా తీశావా..? అని ప్రశ్నించారు. హుజూరాబాద్లో ఏం చేయనోడు.. గజ్వేల్లో ఏం చేస్తాడో చెప్పాలన్నారు. ఇంట్ల గెల్వలేనోడు.. బయటెట్లా గెలుస్తాడో.. ఆయనకే తెల్వాలన్నారు. హుజూరాబాద్లో జీ హుజూర్ రాజకీయాలు నడిచే రోజుల దగ్గర పడ్డాయన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీతో జమ్మికుంట పట్టణం కిక్కిరిసింది. ఎటు చూసినా తెలంగాణ చౌరస్తా రహదారులు జనంతో కిటకిటలాడాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలతో పట్టణం జన సందోహంగా మారింది. దాదాపుగా 30వేలకు పైగా జనం హాజరుకావడంతో హోరెత్తింది.
కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ను, రాజకీయ భిక్షపెట్టిన కేసీఆర్ను వెన్నుపోటు పొడిచిన నమ్మక ద్రోహి ఈటల రాజేందర్. ఔనన్నా.. కాదన్నా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరే. మీ ఆశీర్వాదంతోనే నామినేషన్ వేసి మీ ముందుకు వచ్చా. ఢిల్లీకి రాజునైనా నియోజకవర్గానికి కొడుకులా ఉంటా. ఉప ఎన్నికల తర్వాత కూడా ఇక్కడ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. కానీ, ఈటల చేసిన ఒక్క అభివృద్ధి పనైనా ఉందా? చెప్పాలి. దండం పెట్టి ఓట్లడగుతుంటే నా భార్యా బిడ్డలను అవహేళన చేసిన ఈటలకు మహిళలపై ఉన్న గౌరవం ఏపాటిదో చెప్పాలి. గజ్వేల్ సొంతిళ్లు అంటున్న ఈటల రాజేందర్, హుజూరాబాద్ ప్రజలను కూడా మోసం చేసే పనిలో ఉన్నాడు. నియోజకవర్గంతో నాది పేగు బంధం. ఇక్కడే పుట్టా. ఇక్కడే చస్తా. నాపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. ఈ ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి.