వెంకటాపూర్, డిసెంబర్ 9 : రామప్ప దేవాలయాన్ని 18వ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సందర్శించనున్నట్లు హైకోర్టు ప్రాజెక్టు మేనేజర్ విశాల తెలిపారు. గురువారం ఆయన వరంగల్ జిల్లా 9వ అదనపు జడ్జి జీ అనీల్కుమార్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ మహేష్నాథ్తో కలిసి రామప్పను సందర్శించారు. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రామప్ప ఆలయం, సరస్సు, హరిత హోటల్, బోటింగ్, గార్డెన్లోని పబ్లికేషన్స్, కాఫీటేరియా పా యింట్లను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్, రెవెన్యూ, టూరిజం, కోర్టు అధికారులతో చర్చించారు. ముందు గా వారు శ్రీరామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఉమాశంకర్ తీర్థప్రసాదాలు అందించి శాలవాతో సన్మానించారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రత్యేకతను టూరిజం గైడ్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన నేఫథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కుటంబ సమేతంగా రామప్పను సందర్శించనున్నట్లు చెప్పారు. ఇందుకు కోసం రూట్ మ్యాప్ పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట ములుగు జడ్జి రామ్చందర్రావు, ములుగు సీఐ గుంటి శ్రీధర్, ఎస్సై రాధిక, తహసీల్దార్ మంజుల, లాయర్లు వేణుగోపాల్, రవీందర్, స్వామి, సంబంధిత అధికారులు ఉన్నారు.