ఆరుగాలం కష్టపడి మిరపకాయలు పండించిన రైతు.. తీరా వాటిని అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నాడు. పంటను ఎప్పుడు కొంటారా.. అని మార్కెట్లో రోజుల తరబడి నిరీక్షిస్తున్నాడు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు పరిమితికి మించి మిర్చి విక్రయానికి వచ్చిందన్న కారణంతో అధికారులు కాంటాలను ఆలస్యం చేయడంతో మార్కెట్లో రైతులు ముప్పుతిప్పలు పడుతున్నారు.
కేసముద్రం, ఫిబ్రవరి 15 : కేసముద్రం మార్కెట్కు పంట ఉత్పత్తులను తీసుకొచ్చిన రోజే కాంటాలు పెట్టి, అదే రోజు రైతులను ఇంటికి పంపించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ అలా జరగడం లేదు. ఎప్పటికప్పుడు కాంటాలు పెట్టకపోవడంతో మిర్చి రైతులు మార్కెట్లోనే రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నెల 12న 8 వేల బస్తాల మిర్చి విక్రయానికి రాగా, పరిమితికి మించి వచ్చిందన్న కారణంతో అధికారులు రెండు రోజులు మార్కెట్కు సెలవులు ప్రకటించారు. తిరిగి మార్కెట్ గురువారం ప్రారంభంగా కాగా, 6 వేల బస్తాల మిర్చి వచ్చింది. పరిమితికి మించి వచ్చిందని మళ్లీ అధికారులు కాంటాలను రేపటికి వాయిదా వేశారు. దీంతో రైతులు రెండు రోజులపాటు మార్కెట్లోనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా వరుస సెలవులు ఉంటుండడంతో రైతులు నేరుగా ట్రేడింగ్ కంపెనీలకు వెళ్లి తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారు. కాగా నేటి నుంచి మళ్లీ మూడు రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
ఈ -నామ్ విధానంలో వ్యాపారులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాలి. లేదా సరుకు అమ్మిన రోజు తేదీతో చెక్కురూపంలో ఇవ్వాలి. అందుకు విరుద్ధంగా వ్యాపారులు నగదు చెల్లిస్తూ కోత విధిస్తున్నారు. మిర్చి కొనుగోళ్లలో 3 శాతం, ఇతర పంటల కొనుగోళ్లలో 2శాతం కటింగ్ చేస్తూ దోచుకుంటున్నారు.
మార్కెట్కు సెలవులు ఇవ్వడం, మార్కెట్ ప్రారంభం రోజు ఎక్కువ మిర్చి విక్రయానికి వస్తుండడంతో ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు పూర్తిగా తగ్గిస్తున్నారు. ఈ నెల 12న మార్కెట్కు 8 బస్తాల నాణ్యమైన మిర్చి, 4 బస్తాల తాలు మిర్చి తీసుకెళ్లా. పరిమితికి మించి మిర్చి విక్రయానికి వచ్చిందని వ్యాపారులు ఆ రోజు రాత్రి ధరలు నిర్ణయించి కాంటాలు మరుసటి రోజు పెట్టారు. నాణ్యమైన 8 బస్తాల మిర్చి క్వింటాల్కు రూ.17 వేలు పలకడంతో అమ్ముకోకుండా మిర్చి బస్తాలను ఇంటికి తీసుకెళ్లాను. 4 బస్తాల తాలు మిర్చిని క్వింటాలుకు రూ.11వేల చొప్పున అమ్ముకోగా రూ.18,270 రావాల్సి ఉంటే 3 శాతం కటింగ్తో రూ.540 తగ్గించి ఇచ్చారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కమీషన్ను తొలగించి రోజూ మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలి.