న్యూశాయంపేట, జూన్ 8 : తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు పూర్వవైభవం తెచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ ఆని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం భద్రకాళీ బండ్ వద్ద చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చీఫ్ విప్ వినయ్భాస్కర్కు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. భద్రకాళీ బండ్పై మహిళలు బతుకమ్మలతో సంబురాలు జరుపుకున్నారు. అనంతరం చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ మండు వేసవిలోనూ నిండు కుండల్లా చెరువులను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. మిషన్ కాకతీయతో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో చెరువులు మరమ్మతు చేశారన్నారు. గత పాలకులకు చెరువులను కాపాడే సోయి లేదన్నారు. వాటిపై ఆధారపడిన కులవృత్తులకు బతుకుదెరువు లేక విలవిలలాడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో జీవం పోశారన్నారు.
మండుటెండల్లో సైతం చెరువులన్నీ నిండుగా కనిపిస్తున్నాయంటే అది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. గతంలో చేపలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ప్రస్తుతం ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ నిలిచిందన్నారు. భద్రకాళీ బండ్ను రూ.60 కోట్లతో పర్యాటకంగా తీర్చిదిద్దినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అంతరించి పోతున్న కులవృత్తులను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు.
సీఎం కేసీఆర్ విజన్తోనే దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్వన్గా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
భద్రకాళి చెరువులో ‘సూపర్’ మిరుమిట్లు
ఓరుగల్లు నగర నడిబొడ్డున రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు చకచకా కొనసాగుతున్నాయి. రాత్రివేళ సైతం విద్యుత్ లైట్ల వెలుతురులో పనులు జరుగుతున్నాయి. ఆ లైట్ల కాంతులు ఇలా భద్రకాళి చెరువులో పడి మిరుమిట్లు గొలుపుతున్నాయి.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్