హనుమకొండ, ఏప్రిల్ 29 : సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మే ఒకటి నుంచి నిర్వహించనున్న కార్మిక సంక్షేమ మాసోత్సవాల సందర్భంగా శనివారం హనుమకొండ సుబేదారి రెవెన్యూకాలనీలోని తెలంగాణ భవన నిర్మాణం కార్మిక సంక్షేమ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సంఘటిత, అసంఘటిత కార్మికులను చైతన్యం చేసేందుకు గత సంవత్సరం నుంచి కార్మిక మాసోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తోందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కార్మిక చైతన్య మాసోత్సవాన్ని సీఎం కేసీఆర్ ప్రశంసించారని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో కార్మిక భవనాలు నిర్మించనున్నట్లు అసెంబ్లీలో సీఎం ప్రకటించారని చీఫ్ విప్ గుర్తు చేశారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో కార్మిక భవనానికి మే 5న మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాలను బలోపేతం చేసేందుకు కార్మికుల సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆటో కార్మికులతో త్రిచక్ర ఆటో సహకార సంఘం ఏర్పాటు చేసినట్లు చీఫ్ విప్ తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 6912 మంది కార్మిక కుటంబాలకు ైక్లెయిమ్లు ఇప్పించినట్లు వెల్లడించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు.
రోజూవారీ కార్యక్రమ వివరాలు
మే ఒకటో తేదీన కార్మికుల అడ్డాల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. మే 2వ తేదీన కార్మిక సంఘాల నాయకులతో సమావేశం, 3న వృత్తి సంఘాల కార్మిక నాయకులు, 4న ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. 5న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జిల్లా కేంద్రంలో కార్మిక భవన నిర్మాణానికి భూమి పూజ ఉంటుందన్నారు. 6న ఎలక్ట్రానిక్ ఎంప్లాయీస్ అసోసియేన్, 7న భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులతో సమావేశం ఉంటుందన్నారు. 8 నుంచి 11వ తేదీ వరకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు నిర్వహిస్తామని వివరించారు. 12 నుంచి 15వ తేదీ వరకు కార్మిక నివాసాల సందర్శన, 16న కార్మిక సహకార సంఘాల సభ్యుల కుటుంబాలతో గెట్గెదర్, 17న ప్రభుత్వ స్థలలో 20 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మే 18 నుంచి 20 వరకు కార్మికుల నివాస ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21న కార్మిక చట్టాలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన కార్యక్రమాలు, 22 నుంచి 26వ తేదీ వరకు కార్మిక చట్టాలపై అవగాహన సదస్సులు ఉంటాయని చీఫ్ విప్ పేర్కొన్నారు. 27 నుంచి 29వ తేదీ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సెమినార్లు, 30న రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశం, 31న కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరే విధానాలకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించడంతో ‘కార్మిక సంక్షేమ’ మాసోత్సవాలు ముగుస్తాయని ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. కార్మిక మాసోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ‘కార్మిక సంక్షేమ’ మాసోత్సవాల కోఆర్డినేటర్ పుల్లా శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, బీఆర్ఎస్ నాయకులు మాడిశెట్టి శివశంకర్, ఏనుగుల రాంప్రసాద్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్, కార్మిక సంఘాల నాయకులు మల్లేశం, ఎన్ రవి, సారంగపాణి, భిక్షపతి, రాజు, సురేశ్, సిరికొండ భిక్షపతి, పీ సారంగపాణి, కొండయ్య, రాజు పాల్గొన్నారు.