కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ప్రధాని మోదీ వరంగల్కు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, రాజయ్య, నరేందర్, మేయర్ సుధారాణితో కలిసి ఆయన విలేకర్లతో సమావేశంలో మాట్లాడారు. జిల్లా బీజేపీలో నెలకొన్న లుకలుకలు, గ్రూపు పంచాయితీలను పరిష్కరించేందుకు వరంగల్ సభ వేదిక కానున్నది తప్ప ప్రధాని సభతో ఉమ్మడి వరంగల్ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ విషయంలో నాడు ఇందిరాగాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తే ఇప్పుడు కేంద్రంలోనీ బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణపై కిషన్రెడ్డి, బండి సంజయ్కి అభిమానం, చిత్తశుద్ధి ఉంటే కోచ్ఫ్యాక్టరీపై మోదీతో ప్రకటన చేయించాలని లేకపోతే ప్రజలు క్షమించరన్నారు.
– హనుమకొండ, జూలై 2
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వరంగల్ పర్యటనకు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. జిల్లాలోని బీజేపీలో నెలకొన్న లుకలుకలు సర్దుకొనేందుకే ప్రధాన మంత్రి మోదీ వరంగల్ పర్యటనకు వస్తున్నారన్నారు. గ్రూపు పంచాయితీలను పరిష్కరించేందుకు వరంగల్ సభ వేదిక కానున్నదన్నారు. ప్రధాని సభతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఒరిగేది ఏమి లేదని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ప్రజల 40 సంవత్సరాల కోరిక అని చెప్పారు. దీని కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమం జరిగిందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఇందిరాగాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి మోసం చేసిందని తెలిపారు.
కాజీపేటలో నెలకొల్పాల్సిన ఫ్యాక్టరీని పంజాబ్కు తరలించారన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అవాస్తవాలు మాట్లాడడంతో పాటు వరంగల్ అభివృద్ధికి కేంద్రం సహకరించిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన నిధుల విషయంలో చెబుతున్న లెక్కలన్నీ తప్పుల తడకేనన్నారు. తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం రూ.3,67,797 కోట్లను పన్నుల రూపంలో ఇస్తే రాష్ర్టానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1,68,000 కోట్లు మాత్రమేనన్నారు. తొమ్మిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో పధ్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ప్రాంతమంతా కేసీఆర్ తిరిగారని, ఆయనకు ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి.. ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి.. ప్రజల అవసరాలు ఏమిటనే అవగాహన ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచారని, విభజన చట్టంలోని ఈ మూడు అంశాలను నరేంద్రమోదీ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో మళ్లీ వరంగల్ జిల్లా ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నతున్నదన్నారు. రైల్వే వ్యాగన్ రిపేరింగ్, తయారీ షెడ్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, కానీ ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ కోచ్ ఫ్యాక్టరీ మాత్రమేనని స్పష్టం చేశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్న మోదీ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర, గుజరాత్లో ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 150 ఎకరాల స్థలం అప్పగించినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోరాటాల ఫలితంగానే కేంద్రం దిగి వచ్చి వ్యాగన్ రిపేరింగ్, తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారన్నారు. పట్టణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన హక్కులను కేంద్రం కాలరాస్తున్నదన్నారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ అభిమానం, చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాని మోదీతో కోచ్ ఫ్యాక్టరీ ప్రకటన చేయించాలని, లేకపోతే ప్రజలు క్షమించరన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే వరకు వరకు కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో కోచ్ ఫ్యాక్టరీ సాధన కమిటీ ఏర్పాటు చేసి పోరాటం కొనసాగిస్తామన్నారు.
బీజేపీ దళితులను దగా చేసింది..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులను దగా చేసిందని స్టేషన్ఘన్పుర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలు అంతా ఏకతాటిపైకి వచ్చి ప్రధానికి నిరసన తెలుపాలన్నారు. మోదీ వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు వస్తున్నారా? అని ప్రశ్నించారు.
విభజన హామీలపై ప్రకటన చేయాలి..
విభజన చట్టం హామీలపై ప్రధాన మంత్రి మోదీతో ముందుగా ప్రకటన చేయించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. తొమ్మిదేండ్లలో కేంద్రం నిధులు ఇవ్వకున్నా, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ చేసిన కుట్రలను సీఎం కేసీఆర్ భగ్నం చేశారన్నారు. పేపర్లు లీక్ చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం తిప్పికొట్టిందని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దండుగ అన్న వ్యసాయాన్ని పండగ చేసి చూపించారన్నారు. మూడోసారి ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే భయంతో పాటు సర్వేలు కూడా అదే స్పష్టం చేస్తుండడంతో వణుకు పుట్టి ప్రధాని మోదీ వరంగల్కు వస్తున్నారని చెప్పారు. మామూనూరు ఎయిర్ పోర్టు విషయంలో రాష్ట్ర సర్కారు ముందుకొచ్చినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు.
ఎన్నికల వేల పుట్టిన ప్రేమ..
తెలంగాణపై తొమ్మిదేండ్లుగా లేని ప్రేమ బీజేపీకి ఎన్నికల సమయంలో వచ్చిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేర్కొన్నారు. ఇది అబద్దాల ప్రేమ అని, ప్రజలు ముమ్మాటికి నమ్మరన్నారు. మీరు పాలించే రాష్ర్టాల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు ఏర్పాటు చేయడంలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాతే వరంగల్ అభివృద్ధి : మేయర్
తెలంగాణ ఏర్పాటు తర్వాతే వరంగల్ ఎంతో అభివృద్ధి చెందిందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఇంతకాలం ప్రధాని మోదీకి గుర్తుకురాని వరంగల్ నగరం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుర్తుకు వచ్చిందా? అని ఎద్దేవా చేశారు. స్మార్ట్ సిటీ పేరుతో అభివృద్ధి అంటున్న బీజేపీ నేతలు ఈ నిధుల్లో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉందనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు. నగర అభివృద్ధిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, వరంగల్ను ఫ్యూచర్ సిటీగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్పోర్టును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, మాజీ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు.