‘కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకి. పనికి మాలిన చట్టాలు రూపొందిస్తూ ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా విభజన హామీలు అమలు చేయకపోవడం మోదీ సర్కారు నీతిమాలిన పాలనకు నిదర్శనం. నేరవేర్చే దాకా పోరాటం ఆపం.’ అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ‘యుద్ధభేరి’ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే కేంద్రం మాత్రం వారి ఉసురు తీస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 31న నిర్వహించనున్న సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
హనుమకొండ, మే 26 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 31న అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘యుద్ధభేరి’ సభను విజయవంతం చేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కొన్ని సంవత్సరాల నుంచి మే నెలంతా కార్మిక మాసోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షే మం, అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో కార్మిక భవనాలు నిర్మించడంతో పాటు వారికి ఇన్సూరెన్స్ చేయించారని తెలిపారు.
అలాగే, కార్మికులకు అందజేసిన కార్డులపై 23 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు. 58 జీవో ద్వారా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న కార్మికులకు పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ సర్కారు కార్మికుల పిల్లల విద్య, వైద్యం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. గత ఏడాది కార్మిక శాఖ ద్వారా 6,914 మందికి లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఒక వైపు కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుంటే కేం ద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు.
లాభాలు తెచ్చిపెడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్నదన్నారు. అదానీ, అంబానీల కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని సైతం దశల వారీగా కేంద్రం ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. విభజనం చట్టంలోని హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు గిరిజన యూనివర్సిటీ సాధించుకొనే వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు. విభజన హామీల సాధన ఉద్యమానికి ఓరుగల్లు కేంద్ర బిందువుగా మారనుందని చీఫ్ విప్ పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం పాల్పడుతున్న కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ నెల 31న సాయంత్రం 5గంటలకు ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం ప్రాంగణంలో ప్రారంభంకాను న్న ‘యుద్ధభేరి’ సభకు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనికోరారు. సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజా ప్రతినిథులు హాజరవుతారన్నారు. సమావేశంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు పులి రజినీకాంత్, కార్మిక సంఘం నాయకులు డాక్టర్ పుల్లా శ్రీనివాస్, కేవీ జాన్సన్, ఎంజాల మల్లేశం, నాయిని రవి, సాయిని రవి, నరహరి, సంజీవ, బొట్ల భిక్షపతి, టీ సారంగపాణి పాల్గొన్నారు.