వరంగల్, ఆగస్టు 29 : వీధి వ్యాపారులు నగరంలో నిర్మించిన వెండర్స్ జోన్లోనే తమ వ్యాపారాలు చేసుకొని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కోరారు. కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీపీ ఏవీ రంగనాథ్తో కలిసి వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ల ప్రతినిధులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల కాలంలో ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులను పోలీసులు ఇబ్బందులకు గురిచేసేవారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. చిరు వ్యాపారస్తులు తమ వ్యాపారాలను ఆనందంగా చేసుకునేందుకు సహకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఆటో డ్రైవర్లు ప్రైవేట్ ఫైనాన్స్ల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అసంఘటిత రంగం కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. వాటిపై అవగాహన పెంచుకొని, లబ్ధిపొందాలని సూచించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ తరుచూ అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. స్ట్రీట్ వెండర్స్, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ వాహనదారులకు జరిమానాలు వేసి, ఇబ్బంది పెట్టడం తమ అభిమతం కాదన్నారు. జరిమానాలు విధించడం కంటే వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించినట్లు చెప్పారు. ఏరియా వారీగా కోఆర్డినేషన్ కమిటీలు వేసుకొని సమస్యలను గుర్తించాలన్నారు. సమావేశంలో గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, డీసీపీ ఎండీ బారీ, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్ సింగ్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఆటో యూనియన్ల ప్రతినిధులు, చిరు వ్యాపారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.