హనుమకొండ, సెప్టెంబర్ 5 : సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరేదీ లేదని, ఈ వృత్తి ఎంతో గొప్పదని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ కలెక్టరేట్లోని డీఈవో అబ్దుల్హై అధ్యక్షతన నిర్వహించిన గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయులు సన్మాన కార్యక్రమానికి చీఫ్ విప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 49 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా చీప్ విప్ వినయ్భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానాన్ని అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
సమాజ నిర్మాణం లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేయాలని హితవు పలికారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోలిస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మె రుగైన బోధనా సామర్ధ్యం, నైపుణ్యాలు కలిగి ఉన్నారని అన్నారు. పేద కుటుంబాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే బృహత్ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమం కింద కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ స్పూర్తితో ముందుకు సాగాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను రెగ్యులర్ చేసినందకు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు చీఫ్ విప్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ సమాజంలో ఎవరు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా, అందుకు గురువు అందించిన తోడ్పాటు, కృషియే కారణమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజ్, అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ జీ, కార్పొరేటర్లు ఏనుగుల మానస, వేములు శ్రీనివాస్, ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు తదిరులు పాల్గొన్నారు.